కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఎలాంటి కొత్తదనం లేకుండా పేలవంగా ఉన్నది. పూర్తిస్థాయి బడ్జెట్ కాదు, కనుక ప్రజలు దీనిపై పెద్దగా ఆశలేమీ పెట్టుకోలేదు. కాకపోతే సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్నది కనుక ఏవైనా జనాకర్షక అంశాలు ఉంటాయేమో అనుకున్నారు. కానీ, ఎలాంటి ఉరుములు, మెరుపులు లేకుండానే చప్పగా సాగింది ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం. మౌలికరంగం మెరుగుదల, ద్రవ్యలోటు తగ్గింపుపైనే ఆమె ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. పెట్టుబడి వ్యయం లక్ష్యాన్ని 11 శాతం పెంచారు. ద్రవ్యలోటును 5.1 శాతానికి తగ్గిస్తామన్నారు. ఆదాయ పన్ను పరిమితి పెంపు గురించి ఒకప్పుడు బీజేపీ నేతలు ఊదరగొట్టేవారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పదేండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వెలువడిన ఈ చివరాఖరి బడ్జెట్లోనూ పన్ను పరిమితుల్లో గానీ, రాయితీల్లో గానీ ఎలాంటి వెసులుబాట్లు ప్రతిపాదించలేదు. ఇప్పటికే చేయాల్సినదంతా చేశాం.. ఇకపై చేయాల్సింది ఏమీ లేదనే ధోరణి ఆర్థికమంత్రి మాటల్లో వ్యక్తమైంది.
ఎన్నికల వేళ తాయిలాల జోలికి పోకుండా, ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను పెంచుకోవడం ప్రభుత్వంలో పెరిగిన ఆత్మవిశ్వాసానికి ప్రతీక అంటున్నారు బీజేపీ అనుకూల ఆర్థిక, రాజకీయ పరిశీలకులు. ఇక రూ.5 లక్షల కోట్ల జీడీపీ లక్ష్యం ఓవైపు వాయిదా పడుతుండగానే, 2030 నాటికి రూ.7 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ సాధిస్తామంటూ ఆర్థికమంత్రి అరచేతిలో స్వర్గం చూపించే ప్రయత్నం చేశారు. ప్రజల తక్షణ సమస్యల కన్నా స్థూల ఆర్థికవృద్ధి మీదనే దృష్టి పెట్టడం బీజేపీ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది.
గత పదేండ్లలో భారత ఆర్థిక వ్యవస్థ సకారాత్మక పరిణామానికి గురైందని, ఆశలు పెరిగాయని ఆర్థికమంత్రి గొప్పగా చెప్పుకొన్నారు. జీడీపీ పెరిగినా తలసరి ఆదాయం పెరగని వింతైన, విలోమ పరిస్థితిలో భారత్ ముందుకు సాగుతున్నది. ధనిక-పేద అంతరాలు అంతకంతకూ అధికమవుతున్నాయి. ఆదాయాల తరుగుదల, ధరల పెరుగుదల మధ్యన నలిగిపోతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ఉపశమనమూ బడ్జెట్లో లేకపోవడం ప్రభుత్వ ప్రాధాన్యతలకు మచ్చుతునక. టూరిజం అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తామని చెప్తూ లక్షద్వీప్లో మౌలిక వసతుల అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. అంతర్జాతీయ వివాదాలపై తెంపరితనపు స్పందనగా మారిన ఈ అంశం సున్నితమైన జీవావరణంతో ముడిపడి ఉన్నదనే విషయం విదితమే. పర్యాటక అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసం జరగకుండా చూడాలన్న పర్యావరణవేత్తల హెచ్చరికలపై తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన
అవసరమున్నది.
రైతులకు పెద్దపీట వేసినట్టు ఆర్థికమంత్రి చెప్పారు. కానీ, పలు కీలక అంశాల్లో రైతులకు నిరాశ కలిగించారు. పీఎం కిసాన్ యోజన కింద ఆర్థిక సాయాన్ని రూ.6 వేల నుంచి రూ.9 వేలకు, అలాగే పంటరుణాల లక్ష్యాన్ని పెంచుతారని ఆశించినప్పటికీ బడ్జెట్లో వీటికి చోటు దక్కలేదు. గత ఐదేండ్లలో రూ.లక్ష కోట్లకుపైగా వ్యవసాయ బడ్జెట్ నిధులను ప్రభుత్వం ఖర్చు చేయకుండా వెనక్కి తీసుకున్నదన్న విమర్శలు వచ్చిన నేపథ్యంలో వ్యవసాయ రంగంపై ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రశ్నార్థకమవుతున్నది. రుణమాఫీకి అవకాశం ఉన్నప్పటికీ దాని జోలికి వెళ్లలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాల్సిన అవసరం ఇప్పుడు ఇదివరకటి కంటే ఎక్కువగా ఉన్నది. అందుకు అవసరమైన ఆర్థిక వెసులుబాటు కూడా ఉన్నప్పటికీ దానిని పట్టించుకోలేదు. ఇలా ప్రజల మీద భారం తగ్గించే అనేక అంశాలపై ఆర్థికమంత్రి శీతకన్ను వేయడంతో బడ్జెట్ అన్నివర్గాలకు అసంతృప్తినే మిగిల్చింది!