అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, కలల్ని సాకారం చేస్తూ, గెలుపును చిరునామాగా మార్చుకొని, అభివృద్ధే ఆలంబనగా దేశ యవనికపై కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. 2001 ఏప్రిల్ 27న గుప్పెడు మందితో తెలంగాణ నడిబొడ్డున జల దృశ్యంలో ఊపిరి పోసుకున్న టీఆర్ఎస్, ఈ సెప్టెంబర్ 2న దేశ రాజదాని నడిబొడ్డున సగర్వంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవనాన్ని నిర్మించుకునేందుకు సమాయత్తమవుతున్నది.
దక్షిణ భారతీయులను కేవలం మదరాసీలుగా చూసి న ఢిల్లీ పాలకులు ప్రత్యేకంగా తెలుగు మాట్లాడే సమూ హం ఒకటుందని గుర్తించడానికి 80వ దశకం వరకూ ఎదురుచూడాల్సి వచ్చింది. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన తర్వాత ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవ కీర్తి పతాక రెపరెపలాడుతున్నది. ఏడేండ్లుగా తెలంగాణ అభివృద్ధే ద్యేయంగా ఢిల్లీ గడ్డపై నినదిస్తున్న పార్టీ టీఆర్ఎస్. ఇప్పటివరకూ తెలుగు రాజకీయపార్టీలకు నిలువ నీడ లేని ఢిల్లీ గడ్డపై సగర్వంగా టీఆర్ఎస్ గులాబీ జెండా రెపరెపలాడే తెలంగాణ భవన్ రూపుదిద్దుకోబోతున్నది.
సుదీర్ఘంగా సాగిన తెలంగాణ ఉద్యమానికి నాయక త్వం వహించింది టీఆర్ఎస్. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. ఒక జాతి ఏకతాటిపైకి వచ్చి ఒక రాజకీయపార్టీని సొంతం చేసుకోవడం ఒక చారిత్రక సన్నివేశమే. నిద్రాణంగా ఉన్న స్వరాష్ట్ర ఆకాంక్షలను ముక్కోటి గొంతుకల్లో మార్మోగించారు కేసీఆర్. తెలంగాణ యావత్ సమాజాన్ని సమన్వయంతో ఉద్యమపథాన నడిపించారు. రాష్ట్రసాధనలో తెలంగాణ భవన్ నిర్మాణం, తర్వాత దాని పాత్ర అనిర్వచనీయం. అది భావసారూప్యత కలిగిన ప్రతీ ఒక్కరికీ వేదికగా నిలిచిం ది. ఉద్యమ వ్యూహాలకు పదునుపెట్టింది. రెండంతస్తుల ఈ ఆత్మాభిమాన ప్రతీక నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల శాశ్వత చిరునామాగా నిలిచింది.
సెప్టెంబర్ 2న ఢిల్లీలో నిర్మాణం ప్రారంభించుకోబోతున్న తెలంగాణ భవన్ మరో చరిత్రకు నాందిగా మిగులుతుందనటంలో సందేహం లేదు. పనిచేసే ప్రభుత్వానికి ప్రోత్సాహం ఇవ్వవలిసిన కేంద్ర సర్కార్ తెలంగాణను కనీసం పట్టించుకోవడం లేదు. కృష్ణా జలాల్లో మనకు దక్కాల్సిన న్యాయమైన వాటాలను తేల్చడం లేదు. సాక్షాత్ పార్లమెంట్ ఆమోదించిన విభజన చట్టం లోని హామీలను సైతం తుంగలో తొక్కతూ కోచ్ ఫ్యాక్టరీని, బయ్యారం ఉక్కు, గిరిజన వర్శిటీ వంటి కీలక హామీలను గాలికొదిలేసింది. మన రాష్ట్రం నుంచి పన్నుల రూపేణా రూపాయి వసూలు చేస్తూ పావలా ఇవ్వడానికి నానా యాగి చేస్తున్నది. తెలంగాణపై పక్షపాత బుద్ధిని చూపిస్తున్న బీజేపీ సర్కారు మీద సమరానికి ఢిల్లీ టీఆర్ఎస్ భవన్ సమగ్ర భూమికను ఏర్పర్చబోతున్నది. అటు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నిస్తూనే యావత్ దేశానికి తెలంగాణ సాధించిన ప్రగతిని కళ్లకు కట్టబోతున్నది.
హైదరాబాద్లో 2006లో తెలంగాణ భవనాన్ని నిర్మించుకున్న టీఆర్ఎస్, ప్రజల ఆదరాబిమానాలతో 33 జిల్లాల్లో విజయదశమి నాటికి నూతన కార్యాలయాలను ప్రారంభించుకోబోతున్న ఈ శుభ తరుణాన మరో పండుగ దినం సెప్టెంబర్ 2.ఢిల్లీ గడ్డపై స్వాభిమానాన్ని, తెలంగాణ ప్రజల ఆత్మాభిమాన పతాకను ఎగరేయబోతున్నది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన జరగబోయే పండగ క్షణాల్లో యావత్ తెలంగాణ సమాజానికి, టీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు శుభాకాంక్షలు.
వై.సతీష్ రెడ్డి
(వ్యాసకర్త: సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర సమితి)