దేశంలో మత్స్యరంగం అభివృద్ధి పథంలో పురోగమిస్తున్న రాష్ర్టాలన్నింటిలోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక మత్స్య పారిశ్రామిక అభివృద్ధి ప్రణాళికలను అమలుపరుస్తున్నాయి. ఇదే ఒరవడిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడి మత్స్యరంగాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశలో తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నది. అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని ముందుకు పోతున్నది. రాష్ట్ర మత్స్య పారిశ్రామికరంగం గడిచిన ఆరున్నరేండ్లలో పురోభివృద్ధిలో పరుగులు తీస్తున్నది. రాష్ట్ర మత్స్యరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనపైనే ఎక్కువ దృష్టిసారిం చింది. చేపల పెంపకానికి అనువైన నీటి వనరులను సమకూర్చేందుకు కార్యాచరణను అమలుపరిచింది. దీంతో చేపల పెంపకంలో గణనీయమైన అభివృద్ధి సాధ్యమైంది.
కాళేశ్వరంతో పాటు అనుబంధంగా ఉన్న జలాశయాలతో మత్స్యరంగం పురోభివృద్ధిచెందింది. దేశంలో సముద్ర జల వనరుల నుంచి చేపల ఉత్పత్తి తగ్గిపోవడంతో, ఉపరితల జలవనరుల చేపల పెంపకంలో గణనీయమైన అభివృద్ధి జరుగుతున్నది. తెలంగాణ ఉపరితల జలవనరుల విస్తీర్ణంలో దేశంలోనే 3వ స్థానంలో నిలవడం మత్స్యరంగ అభివృద్ధికి మరో సానుకూలాంశం.
గతంలో నిర్లక్ష్యానికి గురైన మత్స్యశాఖను బలోపేతం చేయడానికి అన్నిరకాల చర్యలను తీసుకుంటామని సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు. ఈ దిశలో చర్యలు చేట్టారు. అదనపు సిబ్బందిని నియమించారు. ఫలితంగా వెయ్యి కోట్ల నిధులతో అమల్లోకి వచ్చిన ‘సమీకృత మత్స్య అభివృద్ధి పథకం’ మత్స్యరంగానికి జవసత్వాలను నింపుతున్నది. మౌలి క సదుపాయాలు కల్పిస్తున్నది. ఆ క్రమంలోనే 65 వేల మంది మత్స్యకారులకు మోపెడ్ వాహనాలను సమకూర్చింది. ‘ఉచిత చేపపిల్లల సరఫరా’ పథకాన్ని అమలు పరుస్తున్నది. దీంతో గ్రామ స్థాయిలో జీవనోపాధి ఏర్పడటమే కాకుండా, మత్య్సకారులు ఆర్థికంగా ఎదుగుతున్నారు.
చేపల పెంపకంలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టడం, చేపల ఆహార వినియోగాన్ని పెంచడం లాంటి కార్యక్రమాలతో మత్స్యరంగం పునరుజ్జీవం పొందుతున్నది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖను పునర్ వ్యవస్థీకరించడంతో పాటుగా ఆధునీకరించుకోవాల్సిన అవసరం కనిపిస్తున్నది.
రాష్ట్రంలో 4,639 మత్స్య సహకార సొసైటీలలో 3,39,465 మంది గుర్తింపు పొందిన మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. ఇందులో 3,949 మత్స్య సహకార సంఘాలు కాగా, 598 మహిళా మత్స్య సహకార సొసైటీలు, 11 మత్స్య మార్కెటింగ్ సహకార సంఘాలు, 81 సొసైటీలు రిజర్వాయర్లకు సంబంధించిన లైసెన్స్ కలిగి ఉన్న మత్స్యకారుల సొసైటీలున్నాయి. గ్రామస్థాయి సొసైటీతో పాటు జిల్లాస్థాయిలో మత్స్యసహకార సంఘం, వీటన్నింటినీ సమన్వయం చేయడానికి రాష్ట్రస్థాయిలో మత్స్య సహకార సంఘాల సమాఖ్య పనిచేస్తున్నాయి. రాష్ట్రంలోని మత్స్య సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న సుమారు 4 లక్షల మత్స్యకారుల సంక్షేమం, ఉపాధిలతో పాటుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుజరిపే వివిధ పథకాలను క్షేత్రస్థాయిలో అమలుజరిపే బాధ్యతలను ఈ సొసైటీలు నిర్వహిస్తాయి.
రాష్ట్ర ప్రభుత్వం నీటి వనరులను ‘మిషన్ కాకతీయ’ ద్వారా పునరుద్ధరించడం, కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా ఎల్లకాలం నీటిని నిల్వ చేయడం లాంటి పరిణామాల వల్ల మత్స్యకారుల ఆదాయాలు పెరిగాయి. దీంతో మత్స్య సహకార సొసైటీల్లో సభ్యత్వానికి డిమాండ్ పెరిగింది.
రాష్ట్రంలో ఉన్న పది జిల్లాలను 33 జిల్లాలుగా విస్తరించిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లో జిల్లాస్థాయి సహకార సంఘాలను ఏర్పాటుచేయాల్సిన అవసరమున్నది. తదనుగుణంగా ‘మత్స్య సహకార సంఘాల సమాఖ్య’కు పూర్తిస్థాయి పాలకవర్గాన్ని ఏర్పాటుచేస్తే మంచి ఫలితాలుంటాయి.
దేశంలో మత్స్యరంగం పురోగమిస్తున్న అన్ని రాష్ర్టాల్లోనూ ‘ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్’లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. చేపల ఆహార వినియోగాన్ని పెంచడంలోనూ, చేపలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడంలోనూ ఈ కార్పొరేషన్ ముఖ్య భూమిక నిర్వహిస్తుంది. ముఖ్యంగా చేపల ఉత్పత్తిలో ఆధునిక విధానాల అమలుతో ఉత్పాదకతను పెంచటంలోనూ కార్పొరేషన్ ఉపకరించగలుగుతుంది. అందువల్ల మత్స్యరంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని సమన్వయం చేయడంలోనూ, ఈ రంగానికి సంబంధించిన అన్ని అంశాలను ఆచరణలోకి తీసుకురావడంలోనూ రాష్ట్రంలో ‘ఫిషరీస్ డెవ లప్మెంట్ కార్పొరేషన్’ సంస్థనూ ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకత కనిపిస్తున్నది.
(వ్యాసకర్త ‘తెలంగాణ ఫిషరీస్ సొసైటీ’ వ్యవస్థాపక అధ్యక్షులు)
పిట్టల రవీందర్
99630 62266