BRS | సాగునీటి సమస్య అంశాన్ని బీఆర్ఎస్ బలంగా ముందుకు తీసుకురావటం ఒకవైపు గ్రామీణ తెలంగాణ దృష్టిని ఆకర్షిస్తుండగా, మరొకవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణ స్థితిలోకి నెడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగింత, జల వనరుల పథకాలపై శ్వేతపత్రం, మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు అనే మూడు విషయాలను కేంద్రంగా చేసుకొని ఈ మూడు మాసాలలో అసెంబ్లీ లోపల, బయట హోరాహోరీ చర్చలు అనేకం జరిగాయి.
ఇందులో ఎవరి వాదన సరైనదనే ప్రశ్నకు ప్రజల అంతిమ తీర్పు ఎట్లుండగలదో గానీ, ప్రస్తుత పంటలకు ఎటువంటి నీరూ అందక ఎండిపోతూ తల్లడిల్లుతున్న రైతాంగానికి మాత్రం బీఆర్ఎస్ ఈ సమస్యలను గట్టిగా లేవనెత్తటం, అందుకు బదులుగా ప్రభుత్వం తరచు తడబడుతుండటం కళ్లెదుట కనబడుతున్న వాస్తవాలు. ఆ విధంగా, కేవలం ఆరోపణలు, దూషణలనే అధికార పక్షపు నెగెటివ్ వైఖరి వల్ల ఉపయోగం లేకపోతుండగా, రైతులకు ఉపయోగపడేటట్లు మాట్లాడటమనే బీఆర్ఎస్ వైఖరి ప్రజలను మెప్పిస్తున్నది.
రబీ సీజన్ మొదలైన కొద్దికాలం నుంచే రోజూ కనిపిస్తున్న వార్తలేమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ పాలన సాగినన్నాళ్లు మొత్తం తెలంగాణలో ఎక్కడ కూడా సాగునీటికి కొరత లేకుండా వ్యవసాయ కార్యకలాపాలు సాగించుకున్న రైతులు ఇప్పుడు ఉన్నట్టుండి నీటి సమస్యను ఎదుర్కోవటం మొదలైంది. గత ప్రభుత్వంలో నీటి ప్రాజెక్టులు, కాలువలు, భూగర్భ జలాలు, చెరువులు, కుంటల నుంచి నిరంతరం నీరు లభించేది. ఖాళీ చెరువులనేవి లేకుండా నింపేవారు. భూగర్భ జలాలు బోర్ల ద్వారా ఎగసివచ్చేవి. అందుకోసం అన్ని సంవత్సరాల పాటు కేసీఆర్ వేసిన మంత్రమేమో, ఇప్పుడు కేవలం మూడు నెలలలోనే కొత్త ప్రభుత్వం వేయని మంత్రమేమో గాని, రైతులు పొలాలకు నీళ్లు ట్యాంకర్లతో తెచ్చిపోయవలసి వస్తున్నది. ఎండిన పొలాలను మేత కింద పశువులకు వదలివేస్తున్నారు. పళ్లతోటలు ఎండే ప్రమాదం ముంచుకొస్తున్నది. ఈ స్థితి చాలదన్నట్టు గ్రామాలలో మంచినీటి సమస్య ఇంకా తీవ్రం కాకున్నా వేసవి ఆరంభంలోనే మొదలైంది.
నిజానికి ఈ స్థితిపై చర్చకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ప్రతిపక్షాలు కోరాలి. అదైతే ఇంకా జరగలేదుగాని, పంటలకు విపత్కర పరిస్థితి ఏర్పడిన చోట్ల కనీసం లభ్యమైన వనరుల నుంచైనా నీటి విడుదలకు బీఆర్ఎస్ పదే పదే డిమాండ్ చేయటం, అందుకు కొన్ని చోట్ల స్థానిక అధికారపక్ష నాయకత్వం, యంత్రాంగం సహకరించకపోవటం, కొన్నిచోట్ల విడుదల చేయటం కనిపిస్తున్నది. ఇదంతా రైతులు, గ్రామీణుల దృష్టిలో ప్రభుత్వాన్ని బలహీనపరుస్తున్నది.
సరిగా ఇటువంటి నేపథ్యంలో పైన పేర్కొన్న మూడు జల సంబంధమైన అంశాలు తెరపైకి వచ్చాయి. సాగునీటి విషయంతో పాటు రైతులు ఇదే మూడు నెలలుగా మరికొన్ని విషయాలపై అనుమానంగా, ఆందోళనగా కనిపిస్తున్నారు. అవి, కాంగ్రెస్ అధికారానికి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న రూ.2 లక్షల రైతు రుణమాఫీని ఒకే విడతలో ప్రకటిస్తూ మొదటి ఫైలుపై సంతకం చేయగలమనటం, రైతుబంధు రూ.15 వేలకు హెచ్చింపు, రైతు బీమా, కౌలుదార్లకు కూడా రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, పంటకు బోనస్ వంటివన్నీ వ్యవసాయరంగానికి సంబంధించినవి కాగా, వీటిపై ప్రభుత్వం ఎంత దాటవేస్తున్నదో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
ఒకవేళ ఇవి సక్రమంగా జరుగుతుండి ఉంటే పైన పేర్కొన్న ప్రాజెక్టుల అప్పగింత, శ్వేతపత్రం, మేడిగడ్డ అంశాలపై రైతులు తప్పయినా ఒప్పయినా ప్రభుత్వంతో ఏకీభవించేవారేమో తెలియదు. కానీ, ఇవన్నీ సరిగా సాగకపోవటం ప్రభుత్వానికి కలిసిరాని విషయమైంది. అంతే ముఖ్యంగా, మరొకస్థాయిలో చూసినప్పుడు, నీళ్ల సంబంధమైన ప్రతి అంశంపై ప్రభుత్వం ఆరోపణలు, అసత్యాల నెగెటివ్ వైఖరితోనే ఈ మూడు మాసాలుగా వ్యవహరిస్తుండటం ప్రజలకు నచ్చటం లేదు. మరొకవైపు బీఆర్ఎస్.. ‘మమ్మల్ని ఎంతైనా విమర్శించండి, ఎటువంటి విచారణలైనా జరిపించండి, దోషులపై ఎంతటి చర్యలైనా తీసుకొండి, కాని మాపై ఉన్న కక్షను రైతులపై తీర్చుకోవద్దు, వారి ప్రయోజనాలను కాపాడండి’ అని అసెంబ్లీలో, బయటా పదే పదే అంటున్న మాటలను గ్రామీణ ప్రజలు బాగా గుర్తిస్తున్నారు. కాంగ్రెస్ నెగెటివ్ ధోరణికి, బీఆర్ఎస్ పాజిటివ్ తీరుకు ఇది అద్దం పడుతున్నది.
ఈ క్రమంలో గుర్తుపెట్టుకోవలసిన అయిదు ముఖ్యమైన తేదీలు ఫిబ్రవరి 12, 13, 16, 17, మార్చి 1. ఈ తేదీలలో ఏం జరిగింది? కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవటంతో అది మన రైతాంగానికి మరణ శాసనం కాగలదన్న కేసీఆర్ అందుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 13 నాడు నల్లగొండలో కృష్ణా పరీవాహక ప్రాంతాల రైతుల మహాసభకు పిలుపునిచ్చారు. కేవలం ప్రభుత్వాన్ని విమర్శించటం రొటీన్ నెగెటివిజం అవుతుంది. అట్లాగాక ఆయన పాజిటివ్ దృష్టితో కార్యాచరణ కోసం రైతాంగాన్ని సమీకరించబూనారు.
ఆ చర్య పాజిటివ్ ప్రభావం వెంటనే ప్రభుత్వంపై పడింది కూడా. అపుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ, 12వ తేదీన షెడ్యూల్ ప్రకారం బడ్జెట్పై చర్చ జరగవలసి ఉండగా, కేసీఆర్ నల్లగొండ పిలుపు ఒత్తిడితో అసాధారణమైన రీతిలో ప్రభుత్వం బడ్జెట్ చర్చను వాయిదా వేసి మరీ, ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమంటూ సభలో ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం తెలిసిందే. ఇక తీర్మానంపై చర్చలో ఏ విధంగా హరీశ్రావు ప్రభుత్వ వాదనలన్నింటినీ తిప్పికొట్టి వారిని నిరుత్తరులను చేశారో లైవ్ ప్రసారాలలో తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రజలు కూడా గమనించారు. అయితే, చర్చ పొడవునా ప్రభుత్వ వైఖరి కేసీఆర్ పాలనను దోషిగా నిలబెట్టేందుకు తప్పుడు లెక్కలు చెప్తూ డాక్యుమెంట్లను వక్రీకరించే నెగెటివ్ ధోరణిలో మాత్రమే సాగగా, హరీశ్ ప్రసంగం యావత్తు యథాతథంగా డాక్యుమెంట్ల ఆధారంతో రైతాంగానికి ఉపయోగపడేవిధంగా పాజిటివ్గా సాగినట్టు అందరికీ అర్థమైంది.
అధికార పక్షం అప్పటికైనా పరిస్థితిని గ్రహించకలేక, కేసీఆర్ నల్లగొండ సభ 13న జరుగనుండగా ఆ ముందు రోజున సభను సత్వరమే ముగించి మరీ మేడిగడ్డ యాత్ర తలపెట్టింది. అది అక్కడకు సర్కారు వారి మరో యాత్ర.
నల్లగొండ నుంచి ప్రజల దృష్టి మరల్చ చూడటం తప్ప అందులో మరో ఉద్దేశం కన్పించదు. తీరా మేడిగడ్డ వెళ్లి కొత్తగా చూపింది, చెప్పింది ఏమీ లేదు. దీనిని ప్రజలు నెగెటివిజం అంటారో, పాజిటివిజం అనుకుంటారో ఎవరి అభిప్రాయానికి వారు రావచ్చు. ఆ తర్వాత నీటి పారుదలపై 16న శ్వేత పత్రమని, ఎందుకో చెప్పకుండా వాయిదా వేసి, 17న ప్రవేశపెట్టారు. విశేషమేమంటే కనీసం ఆ రోజున అయినా కొత్త విషయాలేమీ వెల్లడించక, యథా ప్రకారం పాత విమర్శలే చేసి, 12వ తేదీనాటి వలెనే హరీశ్తో పాటు కడియం శ్రీహరి ఇచ్చిన పకడ్బందీ సమాధానాలతో బిత్తరపోయారు.
ఈ రెండు చర్చల సందర్భంగా ఎన్నో అంశాలతో ప్రభుత్వం తన పత్రాలలో పేర్కొన్నవి, నోటిమాటగా చెప్పినవి కూడా తప్పులని ఆ ప్రసారాలు చూసినవారికి సభావేదికపైననే తెలిసిపోయింది. ఆ విధంగా తెలంగాణ ఏర్పడకముందు 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నవి గాని, 2014 నుంచి మొన్నటి ఎన్నికల వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదన్నవి గాని అనేకం అసత్యాలని స్పష్టమైన రీతిలో ఛానల్ ప్రేక్షకులకు అర్థమైపోయింది. దీనంతటిలో ఉన్నది కూడా అధికారపక్షపు నెగెటివిజం, బీఆర్ఎస్ పాజిటివిజం. ఇది చాలదన్నట్టు, అధికారపక్షం వారి నెగెటివిజానికి వారి దూషణలు, పరుషమైన భాష రంగులద్ది ప్రజలను ఒక గంటైనా విరామం లేకుండా ప్రతిరోజూ ఆశ్చర్యపరిచింది.
అసెంబ్లీ బయటి పరిణామాలను గమనిస్తే అక్కడ కూడా రైతాంగానికి ఉపయోగపడగల పాజిటివ్ ధోరణికి బదులు, ఎన్నికలు ముగిసినాక సైతం బీఆర్ఎస్పై నిరంతరం కక్ష తీర్చుకునే నెగెటివ్ వైఖరినే ప్రదర్శిస్తూ వస్తున్నారు. బాధ్యత గల ప్రభుత్వం రెండు పనులు చేయాలి. ఒక స్థాయిలో రాజకీయాలు ఎట్లున్నా మరొకస్థాయిలో ఇది రబీ పంటకాలం అయినందున వ్యవసాయదారులకు నీటి సమస్యలు లేకుండా ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవాలి. అది ప్రాథమిక బాధ్యత. రెండవ పని కాళేశ్వరం పిల్లర్ల కుంగుదలకు కారణాలేమిటో కాంగ్రెస్ నాయకులు తలొకమాట చెప్పడం గాక నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించాలి. అందులో భాగంగా, పిల్లర్ల మరమ్మతులు జరిగేలోగా ప్రాజెక్టులోని తక్కిన భాగం నుంచి నీటి సరఫరాకు వీలవుతుందా? అయితే ఏ మేరకు? అనే విషయంపై కూడా పరిశీలనలు జరిపించాలి. ఒకవేళ అది అసాధ్యమని నిపుణులు చెప్పినపక్షంలో ఆ ప్రకారం చర్యలు తీసుకోవాలి.
ఇవి రెండూ రైతులకు ఉపయోగపడే పాజిటివ్ కార్యక్రమాలు అవుతాయి. కాని రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు సుదీర్ఘ మాసాలలో రెండూ చేయలేదు. నీటి విషయం పట్టించుకోవటం లేదు. అది అందిన వారికి అందుతున్నది, అందనివారి పంటలు ఎండుతున్నాయి. కాళేశ్వరం విషయానికి వస్తే ఒకవైపు ఆరోపణలు, మరొకవైపు రకరకాల ప్రకటనలతో గందరగోళాలు. ఆరోపణలు సరేసరి. కాని ఆ మూడు పిల్లర్ల వల్ల మొత్తం ప్రాజెక్టే వృథా అయిందని, దానిని పూర్తిగా కూలగొట్టవలసిందేనని, లేదా అట్లా గాలికి వదిలేయాలని, ప్రాజెక్టును తిరిగి తుమ్మిడిహెట్టికి మార్చుతామని, కాళేశ్వరంతో పాటు అన్నారం, సుందిళ్ల కూడా నిరుపయోగంగా మారాయని తలా ఒకటి, రోజుకొక తీరు ప్రకటనలు. బాధ్యులపై విచారణలని, వాళ్ల అరెస్టులని, జైళ్లకు పంపటాలని, వారి నుంచి డబ్బు వసూళ్లని మరొకరకం హెచ్చరికల పరంపరలు. కాని విజిలెన్స్ విచారణ జరిపించినా ఆ నివేదికలో ఏముందో అధికారికంగా తెలియదు. జడ్జితో విచారణ అన్న జాడ ఏమైందో తెలియదు.
రాష్ట్ర పరిశీలనలో ఏమి వెల్లడైందో వివరాలు తెలియవు. కేంద్రస్థాయి ఎన్ఎస్డీఏ ప్రాథమిక నివేదిక హడావుడిగా రెండురోజులలో వచ్చిన తర్వాత ముందుకు కదలలేదు. నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ నివేదిక రహస్యంగానే ఉంది. ఇప్పుడు తాజా పరిణామం ఎన్ఎస్డీఏ చంద్రశేఖర్ అయ్యర్ బృందాన్ని నియమించటం. అది నాలుగు మాసాలలో నివేదిక ఇస్తుందట. పిల్లర్ల కుంగుబాటుకు కారణాలను నిర్ధారించటంతో పాటు మరమ్మతులను సూచిస్తుందని చెప్తున్నారు. ఆ బృందం కాళేశ్వరం వద్ద కుంగిన పిల్లర్ల ప్రాంతాన్ని వదిలి తక్కిన చోటినుంచి నీరు వదలవచ్చునని హరీశ్రావు అంటున్న మాటను పరిగణనలోకి తీసుకొని పరిశీలన చేయగలదో లేదో తెలియదు. అది ఆ బృందానికి వదిలివేద్దాం.
నీటి పారుదల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఈ కేంద్ర కమిటీ పరిశీలన మాట ప్రామాణికం అని ఇప్పుడు ప్రకటిస్తున్నారు. ఆ నివేదిక మేరకు మరమ్మతులు చేయగలమంటున్నారు. ఇదంతా ఎప్పటినుంచి వచ్చిన మార్పు? బీఆర్ఎస్ బృందం మార్చి 1న కాళేశ్వరానికి వెళ్లి, తమ వాదనలు ఏమిటో రైతాంగానికి, ప్రజలకు వివరించి చెప్పిన తర్వాత వచ్చిన మార్పు. ఫిబ్రవరి ఆఖరు వరకు మహా దూకుడుగా కనిపించిన వారు ఇప్పుడు నిర్మాణాత్మక మార్గంలోకి మళ్లినట్టు కనిపిస్తున్నది. వాస్తవానికి అసెంబ్లీలో తమ వాదనలు వమ్మయినప్పుడే వారి ధోరణి మారవలసింది. కనీసం ఇప్పుడైనా పాజిటివ్ ధోరణికి కట్టుబడగలరని ఆశించాలి.
ఈ మూడు మాసాల పాటు అన్నీ గమనించిన రైతులు, సాధారణ ప్రజలు ఇప్పుడు ఎండుతున్న పొలాల మధ్య నిల్చొని ఆ వ్యథను అనుభవిస్తూ, రాజకీయాలు ఎట్లున్నా తమ జీవితాలకు సంబంధించి ఎవరు నెగెటివ్, ఎవరు పాజిటివ్ అన్నది స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. ప్రభుత్వం మారిన కొద్ది మాసాలకే, తొలి వేసవిలోనే, తొలి పంట కాలంలోనే వారికి ఇటువంటి అనుభవం ఎదురు కావటం మరిచిపోలేనిది.
– టంకశాల అశోక్