దేశ అభివృద్ధి, శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా బీజేపీ తన నూతన ఎన్నికల మ్యానిఫెస్టో ‘సంకల్ప పత్రం.. మోదీ గ్యారెంటీ’ని ఇటీవల విడుదల చేసింది. వికసిత భారతే తమ లక్ష్యమని పేర్కొన్నది. కానీ, 2014లో కూడా బీజేపీ ఇలాంటి వాగ్దానాలతోనే నమ్మబలికి అధికారంలోకి వచ్చింది. అప్పుడు ప్రకటించిన మ్యానిఫెస్టోలోని ఎన్ని హామీలు నెరవేర్చారు? అన్నది నూతన మ్యానిఫెస్టోలో ఎక్కడా ప్రస్తావించలేదు. 90 శాతం హామీలను అమలు చేశామని ఒక్కముక్కలో తేల్చేశారు. వెయ్యేండ్ల అభివృద్ధికి సరిపడా ఎజెండాతో నూతన మ్యానిఫెస్టో తయారు చేశామని మోదీ మరోసారి గప్పాలు కొడుతున్నారు.
బీజేపీ 2014లో ఇచ్చిన హామీలు ఎంతమేరకు అమలు చేసిందో? గడిచిన పదేండ్ల పాలనలో మోదీ సర్కార్ సాధించిన ప్రగతి ఎంత అనేది గణాంకాలతో సహా గమనిస్తే అసలు కథ అర్థమవుతుంది. యువతకు ఉపాధి కల్పించడంలో గత కాంగ్రెస్ పాలకులు ఘోరంగా విఫలమయ్యారని, తాము అధికారంలోకి వస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని యువతను నమ్మించి నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి వచ్చారు. ఈ లెక్కన గడిచిన పదేండ్లలో ఏడాదికి 2 కోట్ల చొప్పున మొత్తం 20 కోట్ల ఉద్యోగాలు కాదు కదా కనీసం 2 కోట్ల ఉద్యోగాలు కూడా కల్పించలేకపోయింది మోదీ ప్రభుత్వం. గడిచిన 40 ఏండ్లలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతీయువకుల్లో 45 శాతం మంది నిరుద్యోగులే. ఇదీ మోదీ సాధించిన ప్రగతి.
అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని, తాము అధికారంలోకి రాగానే ధరలు తగ్గిస్తామని వాగ్దానం చేశారు. కానీ, ధరలను ఏవిధంగా, ఎంతమేరకు తగ్గించి సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చారో మ్యానిఫెస్టోలో ఎక్కడా ప్రస్తావించలేదు. 2014-2024 వరకు కన్సూమర్ ఇండెక్స్ ప్రైస్ గణాంకాలను పరిశీలిస్తే.. గత పదేండ్లలో ధరలు తగ్గడం అటుంచి 70 శాతానికి పైగా పెరిగినట్టు తెలుస్తున్నది. అదేవిధంగా 2014లో రూ.300 ఉన్న సిలిండర్ ధర నాలుగు రెట్లు పెరిగి రూ.1150కి చేరింది. అప్పట్లో లీటర్ డీజిల్ రూ.55, పెట్రోల్ రూ.66 ఉండేవి. అవి ప్రస్తుతం సెంచరీకి చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలలో టర్కీ తర్వాత మన దేశం రెండో స్థానంలో ఉన్నట్లు గ్లోబల్ ఇండెక్స్ రిపోర్ట్ తెలియజేస్తున్నది. దీన్నిబట్టే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
రైతుల ఆదాయం రెండింతలు చేస్తానని చెప్పిన మోదీ దాని గురించి అసలు ప్రస్తావించలేదు. పైగా ఈ పదేండ్లలో 1,00,474 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అంటే సగటున రోజుకి 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం పక్కనపెడితే.. రైతులకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి దాదాపు 750 మందికి పైగా అన్నదాతల మృతికి కారణమైంది బీజేపీ సర్కార్. నల్లచట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని మోదీ ప్రకటించినప్పుడు పంటకు కనీస మద్దతు ధర దక్కేలా చట్టం చేస్తామని హామీ ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. మద్దతు ధర కోసం మరోసారి రైతన్నలు రోడ్డెక్కి నిరసనలు చేసినా మోదీ సర్కార్ పట్టించుకోవడం లేదు.
నరేంద్రమోదీ పాలనలో రైతుల ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతున్నది. అదానీ, అంబానీల ఆదాయం మాత్రం రెట్టింపవుతున్నది. విద్యావిధానం సమూలంగా ప్రక్షాళన చేస్తామన్న హామీని అటకెక్కించారు. అదీకాకుండా 2014 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా లక్షకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ఆయుష్మాన్ భారత్ గురించి గొప్పలు చెప్తున్న బీజేపీ గతేడాది రూ.8 వేల కోట్లు ఆ పథకం కోసం ఖర్చు చేసింది. కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ రూ.9.5 వేల కోట్లను ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తుండటం గమనార్హం.
మోదీ పాలనలో రూపాయి విలువ మరింత క్షీణించింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో 82కి పడిపోయింది. మరోవైపు 2014లో రూ.55.87 లక్షల కోట్లుగా ఉన్న దేశ అప్పు ఈ పదేండ్లలో రూ.155.31 లక్షల కోట్లకు పెరిగింది. భారీఎత్తున అప్పులు చేసిన మోదీ సర్కార్ ఏమైనా అభివృద్ధి చేసిందా? అంటే అదీ లేదు. మోసపూరిత వాగ్దానాలు, హామీలతో దేశ ప్రజలను వంచించారు. ఈ పదేండ్ల తిరోగమన పాలన చాలదన్నట్టు.. మళ్లీ వికసిత భారతం అంటూ మాయమాటలతో ప్రజల ముందుకువస్తున్నారు. అలవిగాని హామీల వర్షం కురిపిస్తున్న బీజేపీని నమ్మి మరోసారి మోసపోవద్దు.
– భరత్ చౌహాన్