అద్దం అబద్ధం చెప్పదు. బింబానికి ప్రతిబింబాన్ని చూపిస్తుంది. మన ముఖంలో ఏవైనా మరకలుంటే వాటిని తుడిచేసుకునే ప్రయత్నం చేయాలి కానీ, అద్దాన్ని నిందించడం తగదు. కానీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పదే పదే ఆ పనే చేస్తున్నది. అంతర్జాతీయ రేటింగ్స్ వెలువడిన ప్రతిసారీ బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. సిద్ధాంతాలు చెప్పి రాద్ధాంతం చేస్తున్నారు. అంతా పశ్చిమ దేశాల కుట్ర అంటూ కొట్టిపారేస్తున్నారు. కొందరైతే ప్రత్యామ్నాయ రేటింగ్స్ వ్యవస్థ ఏర్పాటుచేసుకోవాలని సెలవిస్తున్నారు. పదేండ్ల మోదీ పాలనలో దేశం అధోగతి పాలైనట్టు ఆ రేటింగ్స్ ఎత్తిచూపడమే వారి కోపానికి కారణమని చెప్పాలి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు పదేండ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సహజంగానే అంతర్జాతీయ సూచీల్లో మన స్థానం ఏమిటా? అనే ఆసక్తి కలగడం సహజం. ముందుకు వెళ్లామా లేక వెనుకకు మళ్లామా? అనే చర్చ కూడా జరుగుతుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) తాజాగా విడుదల చేసిన నివేదికలో భారతదేశంలో ఉపాధి పరిస్థితులు నిరాశాజనకంగా ఉన్నాయని పేర్కొన్నది. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు క్రమంగా తగ్గిపోతుండటాన్ని ఎత్తిచూపింది. నిరుద్యోగుల్లో యువత శాతం 54.2 నుంచి 65.7కు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లోని చదువుకున్న యువతకు ఉపాధి అంతంత మాత్రంగానే అందుబాటులో ఉండటమే అందుకు కారణం. ప్రభుత్వం ఈ నివేదికను కొట్టిపారేసింది. స్వదేశీ అధ్యయన సంస్థల నిర్ధారణలు మరోలా ఉన్నాయని అంటున్నది. ఇంకా విదేశీ నివేదికల మీద ఆధారపడే బానిస గుణం మనలో ఇంకా పోలేదని ఓ కేంద్రమంత్రి వ్యాఖ్యానించడం కొసమెరుపు. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ హామీ ని నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైంది. బజ్జీల బండి పెట్టుకోవడమూ ఉపాధి కిందకే వస్తుందని ఆ పార్టీ నేతలు దబాయించడం తెలిసిందే.
జీడీపీ పెరిగినట్టు నివేదికలు వస్తే ఉత్సాహంగా టాంటాం వేసుకునే కేంద్రం పెరిగిన సంపద సమంగా పంపిణీ అవడం లేదని తెలిపే నివేదికలు, సూచీలపై చిరాకు పడుతుండటం విచిత్రం. పోటీగా స్వదేశీ సూచీలు తీసుకురావాలి అనేదాకా పోయింది ఈ ధోరణి. ఆ మధ్య విడుదలైన అంతర్జాతీయ ఆకలి సూచీలో 125 దేశాల్లో భారత్ కు 111వ ర్యాంకు వచ్చినప్పుడు చాలామంది ఔరా ఎంతగా వెనుకబడిపోయామని విస్తుపోయారు. కానీ, ప్రభుత్వం మరోలా స్పందించింది. ఆ సూచీ ఓ తప్పుల తడక అనీ, దురుద్దేశాలతో దానిని రూపొందించారని మండిపడింది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆ సూచీని ఎద్దేవా చేయడంపై దుమారం చెలరేగడం తెలిసిందే.
జీడీపీలో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ఐదో స్థానంలో నిలిచిన మన దేశంలో ఆహార ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. అయినప్పటికీ అర్ధాకలితో లేదా పూర్తి పస్తులతో గడుపుతున్న పేదల సంఖ్య పెరగడం దేనిని సూచిస్తున్నది? సంపద సమ పంపిణీ జరగకపోవడం, ధనిక-పేద వ్యత్యాసాలు పెరిగిపోవడం ఈ పరిస్థితికి కారణమని ఎవరైనా చెప్తారు. మొన్నటికి మొన్న అంతర్జాతీయ సంతోష సూచీలో 146 దేశాల్లో మన దేశానికి 126వ ర్యాంకు రావడంపై కూడా కేంద్రం విమర్శలు సంధించింది. జీవితానికి భరోసా, పర్యావరణ రక్షణ వంటి కీలక అంశాల ఆధారంగా రూపొందే ఈ ఐక్యరాజ్యసమితి నివేదికను విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గతంలో మైండ్ గేమ్ అని కొట్టిపారేశారు. సంపద, అదీ ధనవంతుల సంపద పెంచుతూపోతున్న కేంద్ర ప్రభుత్వం పేదలకు ఆసరా కల్పించడంలో విఫలమవుతుండటమే ప్రస్తుత దీనస్థితికి కారణం. కావాల్సింది పోటీ సూచీలు కాదు, అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయిన పేదలకు తక్షణ ఆసరా, బతుకు భరోసా కల్పించడం.