ప్రత్యేక తెలంగాణకు రాజముద్ర పడేదాక ప్రతీ క్షణం ఉత్కంఠే. ప్రతీ మజిలీ ప్రసవవేదనే. అనేక కుట్రలను ఛేదిస్తూ.. అనేక ఎత్తుగడలను చిత్తుచేస్తూ దేశంలో తెలంగాణ విజయపతాకను ఎగురవేసి నేటికి ఎనిమిదేండ్లు పూర్తయ్యాయి. రాష్ట్రం ఏర్పడటంతోనే ఆగిపోలేదు తెలంగాణ. ప్రజల కలలను పండిస్తూ నేడు ప్రగతిపూలు పూయిస్తున్నది. దేశానికి దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగింది తెలంగాణ నేల.
2014 మార్చి 1.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు రాజముద్ర వేసి గెజిట్ వెలువరించిన శుభదినం ఇదే.. అప్పటి ఉద్యమసారథి కేసీఆర్ సారథ్యంలో పద్నాలుగేండ్ల సుదీర్ఘ పోరాటానికి, వందలాది మంది తెలంగాణ అమరుల వీరుల త్యాగాల ఫలితంగా దేశం దిగొచ్చి తెలంగాణను ఇవ్వక తప్పని పరిస్థితిని కల్పించిన ధీరోదాత్త గడ్డ తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పదేండ్లు ముఖ్యమైనవి. రాష్ట్రపతి ప్రసంగం నుంచి రాష్ట్రపతి ఆమోదముద్ర దాకా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2009లో నవంబర్ 29న ‘తెలంగాణ వచ్చుడో-కేసీఆర్ సచ్చుడో.. కేసీఆర్ శవయాత్రో.. తెలంగాణ జైత్రయాత్రో’ అంటూ మొదలైన కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష 11 రోజులు తెలంగాణ నేలకు కంటి మీద కునుకు లేదు. డిసెంబర్ 9న ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్రం మొదలుపెట్టింది’ అని చిదంబరం ప్రకటన. ఇదొక మైలురాయి. ఆ తరువాత సమైక్యాంధ్ర కృత్రిమ ఉద్యమం. ఫలితంగా కేంద్రం యూ టర్న్. డిసెంబర్ 23న అదే చిదంబరం తెలంగాణ ఏర్పాటుకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందనే ప్రకటన. ఫలితం మళ్లీ మొదటి నుంచి అన్నట్టు పదునెక్కిన ఉద్యమం. శ్రీకృష్ణ కమిటీ, ఎనిమిదో షెడ్యూల్, ఉద్యమం. సాగరహారం, మిలియన్ మార్చ్.. రాజీనామాలు.. సడక్ బంద్లు.. కేంద్రంపై ప్రజాస్వామ్య తిరుగుబాటు… ఇలా అనేక ఉద్యమరూపాలు.. ఫలితంగా 2014, ఫిబ్రవరి 18న లోక్సభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం. ఫిబ్రవరి 20న రాజ్యసభలో బిల్లు పాస్. మార్చి 1న రాష్ట్రపతి రాజముద్ర. సరిగ్గా ఇవ్వాళ్టికి ఎనిమిదేండ్ల్లు. తెలంగాణ రాష్ట్రం అనే దశాబ్దాల కల సాకారం. మన చరిత్రలో మార్చి 1 ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నది.
2014, జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఏడున్నరేండ్లలో కేసీఆర్ తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చివేశారు. వ్యవసాయం, సాగునీటి రంగాల్లో సాధించిన విప్లవాత్మక ప్రగతి దేశాన్ని అబ్బురపరుస్తున్నది. అభివృద్ధి, సంక్షేమరంగాల్లో దేశానికి మార్గదర్శిగా తెలంగాణ నిలుస్తున్నది. సాగునీటి ప్రాజెక్టుల రీ-డిజైనింగ్తో సీఎం కేసీఆర్ కేవలం మూడేండ్లలోనే నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా రికార్డు సృష్టించింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని మూడు విడతలుగా చేపట్టడంతో నడి ఎండకాలంలోనూ చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి.
రాష్ట్ర ఆవిర్భావం ముందు భూగర్భ జలశోకమైతే ప్రస్తుతం రెండు మూడు ఎస్సారెస్పీ ప్రాజెక్టులతో సమానమైన నీటినిలువతో భూగర్భజలాల మట్టం పెరిగింది. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని దాశరథి కీర్తిస్తే…‘నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ’గా తీర్చిదిద్దుతానని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం కేసీఆర్ కోటి 20 లక్షల ఎకరాల మాగాణంగా మార్చారు. మొత్తంగా ఆరున్నర దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అద్వితీయ ప్రగతిని సాధిస్తూ వెయ్యేళ్ల కీర్తిని సొంతం చేసుకొని ముందుకు సాగుతున్నది.