అతనొక స్రష్ట.. అతనొక ద్రష్ట.. అతనొక మార్గదర్శి.. అతనొక కాంతిపుంజం.. చీకట్లను రూపుమాపుతూ వెళ్లటమే! మహా పర్వతాల వంటి సమున్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందడుగులు వేయటమే! లేకపోతే, తెలంగాణలో ఏడేండ్లలో ఇన్ని విప్లవాలా? ఒక సస్య విప్లవం, ఒక మత్స్య విప్లవం, ఒక క్షీర విప్లవం, ఒక గులాబీ విప్లవం (మాంసం ఉత్పత్తిలో రికార్డులు).. ఇప్పుడీ క్రమంలో మరో విప్లవాన్ని సాధించటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సిద్ధమవుతున్నది. అదే విద్యా విప్లవం. యావత్ భారతదేశానికి విద్యారంగంలో తెలంగాణ పాఠాలు చెప్పే రోజులు సమీప భవిష్యత్తులోనే రానున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలన్నింటిలో 8వ తరగతి వరకూ ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రారంభించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం నిస్సందేహంగా ఒక విప్లవాన్ని సృష్టించబోతున్నది.
‘తరగతి గది నాలుగు గోడల మధ్య దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది’ అనే గొప్ప మాట వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విద్యార్థులు ఉటంకించటానికి పరిమితమైపోయి చాలా కాలమైంది. ఆ మాటకున్న విలువను, అర్థాన్ని ఆచరణలో పెట్టడానికి ఉమ్మడి రాష్ట్రంలోగానీ, ఆ మాటకొస్తే మన దేశంలోగానీ ఏ నాయకుడూ, ఏ ప్రభుత్వమూ చిత్తశుద్ధితో ప్రయత్నించిన దాఖలా లేదు. దీని ఫలితంగానే ప్రభుత్వ బడులంటే నాణ్యత లేని విద్యకు చిరునామాగా మారిపోయాయి. పిల్లలకు భవిష్యత్తు ఉండాలంటే, ప్రైవేటు బడులకు పంపించకతప్పని పరిస్థితులు దేశ ప్రజానీకంపై రుద్దబడినాయి. ఇటువంటి తరుణంలో తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయటానికి అనేక చర్యలు తీసుకున్నారు. అద్భుతమైన ఫలితాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన గురుకులాలను వందల సంఖ్యలో నెలకొల్పారు. విద్యారంగంలో దేశానికే రోల్మోడల్గా తెలంగాణ మారుతున్నదని 2018 లోనే కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి స్వయంగా కొనియాడారు.
మార్పు రెండు రకాలుగా ఉంటుంది.. పరిణామాత్మక మార్పు, గుణాత్మక మార్పు. పరిణామాత్మక మార్పులు కొనసాగి కొనసాగి ఒక దశలో గుణాత్మక మార్పునకు దారితీస్తాయి. దానినే విప్లవం అంటారు. విద్యారంగంలో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన అనేక చర్యలు ఒక విప్లవాన్ని సృష్టించటానికి వేదికను సిద్ధం చేయగా.. ఆ లక్ష్యాన్ని పరిపూర్తి చేసే నిర్ణయం ఇంగ్లిష్ మీడియంలో బోధన. పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్న ప్రజలు.. ఇంగ్లిష్ మీడియం వైపు దృష్టిసారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించటం చారిత్రకమేకాదు.. సందర్భోచితం కూడా. రాష్ట్రంలో ఉన్న మొత్తం 26,072 ప్రభుత్వ పాఠశాలలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దటానికి రూ.7,289 కోట్ల భారీ వ్యయంతో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఈ నెల 8న ప్రారంభించనున్నారు. దేశ భవిష్యత్తు.. తరగతి గది నాలుగు గోడల మధ్య రూపుదిద్దుకుంటుందని తెలంగాణ నిరూపించనున్నది.