ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలు నిర్వీర్యం కావడం ఆందోళన కలిగిస్తున్నది. వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో చర్చకు పెట్టకుండా రద్దుచేయడం ఇందుకు తాజా ఉదాహరణ. రైతుల సుదీర్ఘ ఆందోళన నేపథ్యంలో మూడు చట్టాలను ఉపసంహరించుకోవడం మంచి నిర్ణయమే. కానీ రద్దు చేయడానికి ముందు పార్లమెంటులో చర్చించాలన్న కనీస ప్రజాస్వామిక స్పృహ మోదీ ప్రభుత్వానికి లోపించింది. ఈ వ్యవసాయ చట్టాల రద్దు విషయంలోనే కాదు, వాటిని గతేడాది పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు కూడా ఏకపక్షంగా వ్యవహరించిందే తప్ప విపక్షాలకు చర్చకు అవకాశం ఇవ్వలేదు. ‘పార్లమెంటులో మాకు మెజార్టీ ఉంది కాబట్టి- మేం చట్టాలను చేస్తాం, అవసరమనుకుంటే వాటిని ఉపసంహరించుకుంటాం’ అనే రీతిలో మోదీ సర్కారు వ్యవహరించడం సమర్థనీయం కాదు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రధానే ప్రకటించిన తర్వాత ఇక చర్చ ఎందుకు అన్నది కేంద్ర వ్యవసాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రుల ప్రశ్న. ఈ ధోరణి చూస్తుంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల వీరికి కనీస అవగాహన ఉన్నదా అన్న సందేహం తలెత్తకమానదు. మోదీ హయాంలో పార్లమెంటులో అర్థవంతమైన చర్చలు జరగడమే లేదు. బిల్లులను సమీక్ష కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘాలకు పంపించటమనేది గణనీయంగా తగ్గిపోయింది. అధికారమంతా మోదీ దగ్గరే కేంద్రీకృతమై మంత్రివర్గ సహచరులు కూడా నామమాత్రంగా మారిపోయారు. పెద్దనోట్ల రద్దు వంటి కీలక నిర్ణయాన్ని కూడా కేంద్రమంత్రులు మిగతా దేశ ప్రజల మాదిరిగా ప్రధాని ప్రసంగం ద్వారానే తెలుసుకోవడం విచిత్రం. ఇక సొంత పార్టీని, ప్రతిపక్షాన్ని పట్టించుకోవాలనుకోవడం అత్యాశే అవుతున్నది. వాస్తవానికి కీలకమైన అంశాలపై విధాన పరమైన నిర్ణయాలు తీసుకు నేముందు పార్లమెంటు లోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చకు పురికొల్పడం ప్రజా స్వామ్య వ్యవస్థలలో ఆనవాయి తీగా వస్తున్నది. ప్రభు త్వం ముందుకుతెచ్చిన ప్రతిపాదనలపై వివిధ వేదికల పైన మేధావులు. ఆయా రంగాల నిపుణులు చర్చోపచ ర్చలు జరిపిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. కానీ మోదీ ప్రభుత్వానికి చర్చ అంటేనే గిట్టడం లేదు. భిన్నాభిప్రా యాలను సహించడం లేదు.
ప్రజాస్వామ్య సిద్ధాంతాలను ఔపోసన పట్టిన అంబేద్కర్తో పాటు ఎందరో ఉద్ధండులు రాజ్యాంగసభ చర్చల్లో పాల్గొనడమే కాదు, మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను రూపొందించడానికి ఎంతో శ్రమించారు. నెహ్రూ, పీవీ నరసింహారావు, వాజపేయి వంటి దిగ్గజాలు ఈ దేశ పార్లమెంటును సుసంపన్నం చేశారు. నేడు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం భాసిల్లుతున్నదీ అంటే అందుకు కారణం మన పార్లమెంటరీ వ్యవస్థ. ‘ఇందిరే ఇండియా.. ఇండియానే ఇందిర’ అని ఇందిరాగాంధీ పిలిపించుకున్న కాలంలో కూడా దేశ ప్రజాస్వామిక వ్యవస్థలు ఇంతగా బలహీనపడలేదు. ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ నిరంకుశ పోకడలను సహించక, అంతటి బలమైన నాయకురాలిని గద్దె దింపిన ఘన చరిత్ర మన దేశ ప్రజలది. ప్రజలు చైతన్యరహితులని భ్రమించిన నాయకులు మట్టికరిచిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. మోదీ విధానాల పట్ల ప్రజాస్వామ్యప్రియులు అప్రమత్తం కావలసిన సందర్భం ఇది.