వందల సంస్కృతుల చరిత్రల సమాహారమే భారత దేశం. వీటన్నింటిలో కొన్ని సమాన లక్షణాలు కనిపించవచ్చు కానీ ప్రతి ప్రాంతంలో, గిరిజన తెగలలో భిన్న సంస్కృతులు, అస్తిత్వాలున్నాయి. అందుకే భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత దేశానికి సరైన మాట. తెలంగాణ సుదీర్ఘచరిత్ర గురించి తిరిగి రాయవలసిన అవసరం లేదు. కానీ స్వాతంత్య్రానంతర తెలంగాణ చరిత్రలో ఉజ్వల ఘట్టాన్ని ఆవిష్కరించి తెలంగాణ చరిత్రను అతి స్వల్పకాలంలో తిరగరాసిన ఘనత మాత్రం టీఆర్ఎస్దే.
ఉమ్మడి రాష్ట్రంలో స్వాతంత్య్ర ఫలాలన్నీ గోడవతల కొమ్మకే పండి మనకు కాకుండా పక్కింటి గోతాములో పడ్డట్టు పోయినయ్. పారే నదులన్నీ మనకు టాటా చెప్తూ పారిపోయాయి. ఇక్కడి నేలపై కట్టిన ప్రాజెక్టు అక్కడి పొలాలను సస్యశ్యామలం చేసింది. మన గోదారి గంగమ్మ మన బిడ్డకు అందని స్తన్యంలా సముద్రం పాలైంది. ఈ నేపథ్యంలో వచ్చిన టీఆర్ఎస్ మా పాలన మాకు కావాలి అని మాత్రమే చెప్పలేదు. మా ఆత్మగౌరవం మాకు ముఖ్యం అనే కేసీఆర్ నినాదం మరొక స్వాతంత్య్ర సమరానికి నాంది పలికింది. సరికొత్త జవసత్వాలతో ప్రపంచం ముందు తెలంగాణ రాష్ట్రం నిలిచింది.
ఎక్కడికో వలసపోయి బతుకులీడ్చిన సన్నకారు రైతులు, రైతు కూలీలు నేడు మూడు పంటలు పండిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన ఏడేండ్లలోనే గోదారి గంగమ్మ కిలోమీటర్ పైకెక్కి తెలంగాణ గడ్డ మీద అన్నింటికన్నా ఎత్తయిన కొండపోచమ్మ కొంగును తాకి రాష్ట్రం అన్ని ప్రాంతాల్లోకి చూస్తూ రాష్ట్రంలోని చివరి అంచు కోదాడ పక్క పల్లెలను కూడా తాకింది. కాళేశ్వరం ప్రాజెక్టు అతి స్వల్పకాలంలో నిర్మించబడిన అతి పెద్ద నీటివనరుల ప్రాజెక్టుగా నేడు చరిత్రలో నిలిచింది. కాళేశ్వరం ఒక అద్భుతంగా మారి తెలంగాణను ఒక నీటి గరిసెగా చేసింది. తెలంగాణలో దేశం మొత్తంలోనే అత్యంత అధికంగా ధాన్యాన్ని పండించిన రాష్ట్రంగా నేడు గర్వంగా నిలబడింది. మూడుసార్లు ధాన్యపు దిగుబడిలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రం భౌగోళికస్థితిని అవగాహన చేసుకొని ఏ నది ఎంత ఎత్తులో పారుతుంది, ఎటు నుంచి ఎటు మళ్లుతుంది, ఎక్కడి నీరు ఎక్కడికి ఎలా ఎక్కించాలి, అన్ని ప్రాంతాలకు ఎలా వ్యాపింపజేయాలనే సమగ్ర ప్రణాళికా రచన చేసింది కేసీఆర్. దాని ఫలితమే నేడు రాష్ట్రం ధాన్యపు గరిసె అయింది. దేశంలో ఏ రాష్ట్రం లోనూ అమలుచేయని రైతు సంక్షేమ పథకాలను రైతుబిడ్డ కేసీఆర్ అమలు చేస్తున్నారు. ప్రతి వృత్తికీ సంక్షేమం చేరింది. చేతివృత్తులకు కొత్త జవసత్త్వాలు అందాయి. ఆత్మహత్యల కేంద్రంగా ఉన్న చేనేత పరిశ్రమ తిరిగి ఆత్మగౌరవంతో తల పైకెత్తగలిగింది. బతుకమ్మ చీరల పథకం నికరమైన పని నికరమైన ఆదాయం కలిగించేదిగా మారింది. దోభీఘాట్లు, సెలూన్లు, గొర్రెల పెంపకం వంటి సంప్రదాయ వృత్తులు కొత్త ఊపిరితో కళకళలాడుతున్నాయి. ఆసరా లేని వారికి ఆసరాగా నిలిచింది ఫించను పథకం. నలురీతులా నలు తెరగులా తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెడుతున్నది కేసీఆర్ మూలభూమికగా ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం.
తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడగలిగేది భవిష్యత్తరాలకు అందించగలిగే రాజకీయ పార్టీ మరేదీ కనిపించడం లేదు. దీనికి ప్రత్యామ్నాయాన్ని సమీప భవిష్యత్తులో ఎక్కడా ఎవరూ చూపలేకపోతున్నారు. ఉమ్మడి రాష్ర్టాన్ని ఐదు దశాబ్దాలకు పైన పాలించిన కాంగ్రెస్ నేడు ఎన్నికల్లో డిపాజిట్లు కూడా పొందలేని స్థితిలో నామమాత్రావశిష్టంగా మిగిలింది. తెలుగుజాతి ఆత్మగౌరవం పేరు తో రాష్ర్టాన్ని దశాబ్దంపైగా పాలించిన టీడీపీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని మాత్రం ఏనాడు గుర్తించలేక రెండు కళ్ళ సిద్ధాంతాన్ని తెచ్చుకొని తెలంగాణలో రెండుకళ్ళూ పోగొట్టుకొని ఇక్కడ నిలిచే అస్తిత్వం లేక అదృశ్యమైంది. తెలంగాణ పేరును ఉపవాచకంగా పెట్టుకున్న పార్టీలు ఎక్కడున్నాయో ప్రజలు వెతికే పరిస్థితిలో ఉన్నాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి అందుకు భిన్నంగా లేదు.
తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం పట్ల బీజేపీ శ్రద్ధ ఎప్పుడూ ప్రశ్నార్థకమే. ప్రాంతీయ అస్తిత్వాలను జాతీయపార్టీలు ఏనాడూ పట్టించుకోలేదు. గడిచిన ఐదారు దశాబ్దాల్లో జరిగిందిదే. నేటి బీజేపీ కూడా ఇదే దారిలో ఉన్నది. జాతీయస్థాయి పథకాల గురించి మాట్లాడే బీజే పీ తెలంగాణకు ఈ ఆరేడేండ్లలో ఒరగ బెట్టిందేమీ లేదు. కాళేశ్వరానికి కానీ ఇక్కడి మరొక నీటి పథకానికి కానీ జాతీయ హోదాను ఇవ్వడం లేదు, ఆర్థిక సహాయం చేయడం లేదు. పసుపు బోర్డుపై చేసిన వాగ్దానం అటకెక్కింది. కాజీపేట వర్కుషాపు కాగితాల్లో మురిగింది. తెలంగాణ ఆత్మగౌరవం గురించి కానీ బడుగు బలహీన వర్గాల ఉన్నతిని గురించికానీ ఆ పార్టీకి ఉన్న శ్రద్ధ ఎంతనో తెలంగాణలో అందరికీ స్పష్టం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వరుస పరాజయాలు పొందిన ఈ పార్టీ టీఆర్ఎస్కు ఏ మాత్రం ప్రత్యామ్నాయంగా నిలువలేదని ప్రజలకు స్పష్టమైంది.
తెలంగాణ అస్తిత్వాన్ని వచ్చే దశాబ్దాలకు కూడా కాపాడగలిగిన యువనాయకత్వం కూడా టీఆర్ఎస్కే ఉన్నది. ప్రాంతీయ అస్తిత్వాలను, ఆత్మగౌరవాన్నీ కాపాడగలిగేది ప్రాంతీయ పార్టీలే అని చాలా రాష్ర్టాల్లో రుజువైంది. కేసీఆర్ ప్రభుత్వానికి వచ్చే దశాబ్దాల్లో ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలిగే స్థితిలో మరో పార్టీ నేడు మృగ్యం. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడగలిగేది నేడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ మాత్రమేనని ప్రజల్లో స్థిరభావం ఏర్పడింది.
–వ్యాఘ్రగిరి