‘మనవాళ్ళు ఒత్తి వెధవాయలోయ్’ అని గురజాడ అప్పారావు ఏ సందర్భంలో అన్నాడో కానీ, ప్రతిభని, మంచితనాన్ని గుర్తించి గౌరవించే సంస్కారం తెలుగు వాళ్ళలో తక్కువే అని చెప్పాలి. ఎవరో ఎక్కడో ఏదైనా సాధించినా, ఒక పురస్కారానికి ఎంపికైనా, అతడేదో మన బాల్యస్నేహితుడైనట్లు, మనకు బాగా పరిచయం ఉన్నట్లు పొగడ్తల వర్షం కురిపించేస్తాము. మన కండ్లముందే, మనవాడు ఒక ఘనవిజయాన్ని, ఒక గుర్తింపును సాధిస్తే ప్రశంసించే సౌహార్ద గుణం మాత్రం ప్రదర్శించము. ఎందుకంటే మనకు తెలిసినవాడు ఎదిగిపోతే మనకు ఎక్కడాలేని అసూయ రగులుతుంది!
మనవాళ్లను మెచ్చుకోవడానికి మనకు అహం అడ్డం వస్తుంది. సెహబాష్ అనడానికి నోరు పెగలదు. కానీ, ప్రతిభ కలిగినవారిని, సమాజానికి ప్రేరణ కలిగించేవారిని జాతీయస్థాయిలో గుర్తించి గౌరవించేవారు ఉన్నారు. అలాంటి అరుదైన గౌరవం, గుర్తిం పు మన రాష్ట్ర నేత, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్కు లభించాయి. ఆ ఇచ్చినవారు కూడా సామాన్యులు కారు. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు కలిగిన ‘ఇండియా టుడే’ పత్రిక వారు. ఆ పత్రిక తమ తాజా సంచికలో జోగినపల్లి సంతోష్ కుమార్ చేస్తున్న సామాజిక సేవ గూర్చి రెండు పేజీలు కేటాయించి ప్రస్తుతించింది. తెలంగాణలో హరితహారం పేరిట మొక్కలు నాటడం, వాటి ని పెంచడం, మహావృక్షాలుగా అవి ఎదుగు తూ ప్రకృతి సమతుల్యాన్ని కాపాడే విధంగా చెయ్యడం అనే ప్రక్రియను ఒక మహోద్యమం గా నడిపిస్తున్నారని జోగినపల్లి సంతోష్ కుమార్ను కీర్తిస్తూ ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించింది. హరితహారం ఉద్యమ చరిత్ర ను ప్రముఖంగా రాసుకొచ్చింది. ఈ వ్యాసాన్ని రాసిన వ్యక్తి సాధారణ జర్నలిస్ట్ కాదు. ప్రముఖ సంపాదకులు, ప్రఖ్యాత పాత్రికేయులు అమర్నా థ్ కె మీనన్ ‘FOREST GUARDIAN’ శీర్షికతో ఈ ప్రత్యేక వ్యాసాన్ని రాయడం విశేషం.
జోగినపల్లి సంతోష్ కుమార్ మూడేండ్ల క్రితం ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి ఆయన స్వయంగా మొక్కలను నాటడమే గాక, సినిమా నటీనటులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు వంటి అనేకమంది సెలబ్రిటీలకు ప్రేరణ కల్గించి వారిని కూడా హరితహారం లో భాగస్వాములను చేశారు. ఆయన స్వయంగా కీసర ప్రాంతంలో 2,042 ఎకరాల అటవీప్రాంతాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తూ చరిత్ర సృష్టించారు.
అటవీ సంరక్షణ కోసం ఆయన తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి మూడు కోట్ల రూపాయలను కేటాయించారు. సంతోష్ కుమార్ స్ఫూర్తి తో సినీ హీరో ప్రభాస్ కూడా కాజీపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో 1,650 ఎకరాలను అభివృద్ధి చేస్తు న్నారు. మరో సినిమా నటుడు సాయికుమార్ 61వ జన్మదినం సందర్భంగా తన బంధువు లు, అభిమానులు, స్నేహితులకు ఔషధ గుణా లు కలిగిన మొక్కలను ప్రదానం చేశారు. అలాగే టీఆర్ఎస్ నేత జోగు రామన్న ఆదిలాబాద్ జిల్లాలో పదిలక్షల మొక్కలను నాటించారు.
సంతోష్ కుమార్ పిలుపు అందుకుని హెటెరో డ్రగ్స్ చైర్మ న్ పార్థసారథిరెడ్డి సంగారెడ్డి జిల్లాలో ముంబాపూర్ నల్లవెల్లి రిజర్వ్ ఫారెస్ట్లో 2,543 ఎకరాలను దత్తత తీసుకున్నారు. అలాగే మేఘ ఇంజినీరింగ్ వారు 5,500 ఎకరాల రాచకొండ రిజర్వ్ ఫారెస్ట్ను దత్తత తీసుకున్నారు అంటూ.. ‘ఇండియా టుడే’ తన వ్యాసంలో ప్రశంసించింది.
‘అడవులను పెంచడం, మొక్కలను నాటడం నాకు సంతోషాన్ని, సంతృప్తిని కలిగిస్తుంది. ప్రకృతి అత్యంత ఆహ్లాదకరమైన మిత్రుడు..’ అని చిరునవ్వుతో సంతోష్ కుమార్ అంటారని ఈ వ్యాసం సంతోష్ కుమార్ సేవాభావాన్ని కొనియాడింది.
జోగినపల్లికి జాతీయ స్థాయిలో లభించిన ఈ గౌరవం, ఆదరణ ప్రకృతి ప్రేమికులకు, వృక్షరక్షకులకు స్ఫూర్తిని కలిగించి ప్రతి ఇల్లూ ఒక నందనవనం కావాలని, రాష్ట్రం మొత్తం బృందావనంలా పచ్చగా మెరిసిపోవాలని ఆశిస్తూ ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ హరితహారాన్ని ఆచరణలో పెడుతూ రాష్ట్రం మొత్తాన్ని మంగళ హరితహారంగా తీర్చిదిద్దుతున్న సంతోష్ కుమార్ ప్రేరణతో మరింతమంది ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరుకోవడం తప్పు కాదు.
రాజకీయాలు, ప్రకృతి సంరక్షణ వేర్వేరు అంశాలు. రాజకీయాల్లో నిరంతరం బిజీగా ఉంటూ కూడా సంతోష్ కుమార్ అటవీ సం రక్షణ, మొక్కలను నాటడం, నాటించడం, నాటినవాటిని రక్షించుకోవడం ఒక యజ్ఞం లాంటిది. దీనికి ఎంతో శ్రమ, నిబద్ధత అవస రం. హరితహారంలో భాగంగా ఇప్పటికే కోట్ల మొక్కలను నాటారు.హరిత హారంతో రాష్ట్రం నలుమూలలా పచ్చదనంతో మెరిసిపోతున్నది. రాష్ట్రం పచ్చలహారంగా మారుతున్నది.కేసీఆర్ ఆశయాలను, ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్తున్న సంతోష్ కుమార్ కృషిని దేశం, జాతీయ మీడి యా గుర్తించడం తెలంగాణకే గర్వకారణం.
(వ్యాసకర్త: సీనియర్ రాజకీయ విశ్లేషకులు)
–ఇలపావులూరి మురళీ మోహన రావు