రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద శ్రీశైలం కుడి ప్రధాన కాలువ 80 వేల క్యూసెక్కులకు విస్తరణ, బనకచర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ కింద ఉన్న తెలుగుగంగ, గాలేరు-నగరి, ఎస్ఆర్బీసీ కాలువల విస్తరణ పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన తర్వాత రెండు రాష్ర్టాల మధ్య కృష్ణా జలాలపై వివాదాలు తీవ్ర రూపం దాల్చిన సంగతి అందరికీ ఎరుకే. ఈ వాద వివాదాల సందర్భంగా ఆంధ్రా ప్రాంత రాజకీయ నాయకులు, మంత్రులు, మేధావులుగా చలామణి అవుతున్నవాళ్ళు, సీనియర్ పాత్రికేయులు టీవి చర్చల్లో బచావత్ ట్రిబ్యునల్ తీర్పును, విభజన చట్టాన్ని తమకు తోచిన పద్ధతిలో విశ్లేషిస్తూ అర్ధ సత్యాలను, అబద్ధాలను యథేచ్చగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఇటువంటి కొన్ని అంశాలను చర్చించాను. ఇప్పుడు మరి కొన్ని..
ఆంధ్రా ప్రాజెక్టులకు 512 టీఎంసీలు, తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకు 299 టీఎంసీలు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ‘ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసిందే కానీ రాష్ర్టాల వారీగా కాదు. ఈ కేటాయింపులను దేవుడు కూడా మార్చలేడు’ అంటున్నారు. ఇది పచ్చి అబద్ధం. తెలిసి కొందరు, తెలియక కొందరు ఈ రకమైన వాదనలు చేస్తున్నారు. బచావత్ ట్రిబ్యునల్ రాష్ర్టాల వారీగానే నీటి కేటాయింపులు చేసింది తప్ప ప్రాజెక్టుల వారీగా కాదు. కృష్ణా నదిలో 75 శాతం విశ్వసనీయత (Dependability) కలిగిన నీరు 2060 టీఎంసీలుగా లెక్కగట్టి వాటిని మహారాష్ట్రకు 560 టీఎంసీలు, కర్ణాటకకు 700 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 800 టీఎంసీల నికర జలాలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఇవి గాక నీటి వాడకం తర్వాత తిరిగి నదిలోకి చేరే పడవాటి నీరు (Return Flows) 70 టీఎంసీలని లెక్కగట్టి వాటిని మహారాష్ర్టాకు 25, కర్ణాటకకు 34, ఆంధ్రప్రదేశ్కు 11 టీఎంసీలు కేటాయించింది. దానితో ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నికర జలాలు మొత్తం 811 టీఎంసీలు. ఇవి గంపగుత్తగా మూడు రాష్ర్టాలకు కేటాయించిన నీరు.
బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని ఒక యూనిట్గా తీసుకుందే తప్ప తెలంగాణను, ఆంధ్రప్రదేశ్ను వేరువేరు యూనిట్లుగా పరిగణించలేదు. తెలంగాణ అప్పటికి ఒక రాష్ట్రంగా లేదు కాబట్టి ఆ అవకాశమే లేదు. ఆంధ్రా మేధావులు అంటున్నట్టు ఇవి ప్రాజెక్టుల వారీ కేటాయింపులు కాదు. ఇందుకు సాక్ష్యాలు బచావత్ నివేదికలోనే బోలెడన్ని ఉన్నాయి. మచ్చుకు.. పేజీ 182లో క్లాజ్కు వివరణ ఇస్తూ రాసిన వాక్యాలు చూడవచ్చు.. We make it clear that water has been allocated to each of the three states enblocand that subject to the conditions and restrictions placed by us, each state shall have the right to make beneficial use of the water allocated to it in any manner it thinks proper. We further make it clear that water allocated to each state is for all beneficial purposes including domestic and industrial uses and no separate allocation is made for such uses. నివేదికలోని అనేక అంశాలపై రాష్ర్టాలు లేవనెత్తిన అభ్యంతరాలకు వివరణలు ఇస్తూ క్లారిఫికేషన్ IXలో ఈ విధంగా రాశారు.the allocations of water to the three states were not tied to any specific project or projects. ఇంత స్పష్టంగా బచావత్ ట్రిబ్యునల్ నివేదికలో నీటి కేటాయింపులు రాష్ర్టాల వారీగా గంపగుత్తగా చేశామని రాసి ఉంటే, ఆ ట్రిబ్యునల్ నివేదికను తప్పుగా విశ్లేషించి ఇవి ప్రాజెక్టులవారీ కేటాయింపులని, వాటిని దేవుడు కూడా మార్చలేడని బుకాయించటం అవివేకం.
బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ర్టానికి గంపగుత్తగా కేటాయించిన 811టీఎంసీలను నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓల ద్వారా పునఃకేటాయింపులు జరిపింది.తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకు 299 టీఎంసీలు, ఆంధ్ర ప్రాంత ప్రాజెక్టులకు 512 టీఎంసీల కేటాయింపులు చేసింది. వాటిలో కూడా తెలంగాణ ప్రాంత కేటాయింపులేమో ఇక్కడి వర్షపాతంపై ఆధారపడే మైనర్, మీడియం ప్రాజెక్టులకు చేసింది.
ఆంధ్ర ప్రాంత ప్రాజెక్టులకేమో పశ్చిమ కనుమలలో కురిసిన వర్షపాతం ద్వారా మహారాష్ర్ట, కర్ణాటక రాష్ర్టాల నుంచి వచ్చే నదీ ప్రవాహాలపై ఆధారపడే మేజర్ ప్రాజెక్టులకు కేటాయింపులు చేసింది. పలువిధాలుగా తెలంగాణ వినియోగాలను అన్యాయంగా కట్టడి చేసి ఆంధ్ర ప్రాంత ప్రాజెక్టులకు ఎక్కువ కేటాయింపులు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అవే వినియోగాలు శాశ్వతంగా కొనసాగాలని నేడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వద్ద వాదిస్తున్నది! ఇక్కడ మరొక ముఖ్య అంశం చెప్పుకోవాలి. కేంద్రం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కాలపరిమితి పెంచుతూ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సెక్షన్-89 ప్రకారం రెండు అంశాలు ట్రిబ్యునల్ విచారణకు నివేదించడం జరిగింది.
అందులో మొదటిది..
they shall make project wise specific alloca -tions, if such allocation have not been made by a tribunal constituted under the Inter State River Water Disputes Act, 1956 (33 of 1956). బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీ కేటాయింపులు జరపలేదు కనుకనే బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ను ప్రాజెక్టుల వారీ కేటాయింపులు జరపమని కేంద్రం కోరింది. ఈ విషయాన్ని ఏపీ ప్రభు త్వం స్వయం గా బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నది. ఇప్పుడు ఆంధ్రా మేధావులు మాత్రం ఈ సత్యాన్ని తొక్కిపెట్టి అసత్యాలను ప్రచారం చేస్తున్నారు.
ఇక రెండో అంశం..
first in time and first in right అనే అమెరికా నీటి పంపిణీ సూత్రం ఆధారంగా.. బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసిందే తప్ప పరీవాహక ప్రాం తం ఆధారంగా కాదనీ, పరీవాహక ప్రాంతం ఆధారంగా చేసిఉంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కంటే కర్నాటకకు ఎక్కువ నీటి కేటాయింపులు జరిగి ఉండేవనీ, ఏపీలో కృష్ణా డెల్టా, కేసీ కాలువ, తుంగభద్ర, నాగార్జునసాగర్ తదితర ప్రాజెక్టులు పాత కాలం నుంచే నీటిని వినియోగిస్తున్న కారణం గా ట్రిబ్యునల్ వాటికి రక్షణ లు కల్పించిందనీ, ఇందులో ఎవరికి అన్యాయం చేసింది లేదనేది వారి వాదన.
బచావత్ ట్రిబ్యునల్ మూడు రాష్ర్టాలలో అప్పటికే ఉన్న వినియోగాలకు రక్షణలు కల్పించిన మాట వాస్తవమే. అయితే first in time and first in right అనే సూత్రం ఆధారంగానే రక్షణలు కల్పించారని చెప్పడానికి సాక్ష్యాలు లేవు. పైగా బచావత్ ట్రిబ్యునల్- తాము చేసిన కేటాయింపులు శాశ్వతం కావని చెపుతూ.. వీటిని 2000 మే 31తర్వాత మారిన పరిస్థితులకు అనుగుణంగా పునఃసమీక్షించుకోవడానికి అవకాశం కల్పించింది. అందుకే బ్రిజేష్ ట్రిబ్యునల్ 2003 లో ఉనికిలోకి వచ్చింది. ఈ అవార్డు పునః సమీక్షకు అవకాశం కల్పిస్తూ పేజీ 181లో ఈ మాట లు రాశారు. In determining the equitable share of the States, all the factors which create equities in favour of one State or the other have to be weighed as at the date when the current controversy is mooted. But population, engineering, economics, irrigation and other conditions constantly change and with changing conditions new demands for water continually arise. A water allocation may become inequitable when the circumstances, conditions and water needs upon which it was based are substantially altered.Thus KWDT-I found it prudent to make a provision for review after a lapse of certain given time i.e. after 31st May, 2000.
పేజీ 128లో భవిష్యత్తులో పునః కేటాయింపులు జరిపేటప్పుడు బేసిన్ లోపల వినియోగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన చేయడం జరిగింది. కాబట్టి మారిన పరిస్థితులకు అనుగుణంగా నీటి కేటాయింపుల్లో మార్పులు అనివార్యం అని బచావత్ ట్రిబ్యునల్ భావించింది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం లేదు. ఇప్పుడు ఉనికిలోకి వచ్చింది. రెండు ట్రిబ్యునళ్ల ముందు తెలంగాణ సాగునీటి అవసరాలను ఉమ్మడి పాలకులు సరిగ్గా నివేదించని కారణంగా తెలంగాణకు కృష్ణా జలాల కేటాయింపుల్లో అన్యాయం జరిగింది. పరీవాహక ప్రాంతమే కాదు జనాభా, సాగు యోగ్యమైన భూమి, కరువు పీడిత ప్రాంతాలు తదితర బేసిన్ పారామీటర్ల ఆధారంగా కూడా తెలంగాణకు న్యాయమైన నీటివాటా అందలేదు. తెలంగా ణ రాష్ట్రం ఈ అన్యాయాన్ని సరిచేసి బేసిన్లోని ప్రాంతాల ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరపాలని కోరుతున్నది.
ఆంధ్రప్రదేశ్ మాత్రం బేసిన్ ఆవలకు నీటిని సరఫరా చేసే ప్రాజెక్టుల వినియోగాలను కాపాడమని అడుగుతున్నది. ఏది న్యాయం? ఏది ధర్మం? మేం ముందు నుంచి నీటిని వాడుతు న్నాం కాబట్టి మా వినియోగాలకు రక్షణ ఉండాలన్నది గిడసబారిన కాలం చెల్లిన సిద్దాంతం.
బచావత్ ట్రిబ్యునల్ కంటే ముందు, ఆ తర్వా త అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ నదీ జలాల వినియోగానికి సంబందించి ప్రగతిశీలమైన చర్చలు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో జరిగాయి. అంతర్జాతీయ ఒప్పందాలున్నాయి. అవేవీ ఈ ఆంధ్రా మేధావి వర్గానికి పట్టవు. ఇండస్ కమిషన్ (1942) మొదలుకొని హెల్సింకి రూల్స్ (1966), యునైటెడ్ నేషన్స్ వాటర్ కోర్సెస్ కన్వెన్షన్(1997), బచావత్ ట్రిబ్యూనల్(1980), బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్(2013), నేషనల్ వాటర్ పాలసీ (2012), సమగ్ర జలవనరుల అభివృద్ధి నిర్వహణ మార్గదర్శకాలు (201 6), ఎన్డీ గుల్హాటి లాంటి జల వివాదాల నిపుణులు అందరూ.. ‘బేసిన్ ఆవలికి కేటాయింపులు చేయడంపై నిషేధం లేదు కానీ, బేసిన్ లోపలి అవసరాలను పట్టించుకోకుండా ఒక పరిమితిని మించి చేయడం సరికాదు. బేసిన్లోని ప్రాంతాలకు ఆ నది జలాలపై మొదటి యాజమాన్య హక్కు ఉంటుంది. బేసిన్లోని ప్రాంతాల అవసరాలు పూర్తిగా తీరిన తర్వాత ఆ పైన లభించే నీటిని బేసిన్ ఆవలి ప్రాంతాలకు మళ్లించవచ్చు. బేసిన్ అవసరాలను కాదని బేసిన్ ఆవలికి తరలిస్తే ఇప్పుడైనా ముందుముందై నా అవాంఛనీయ ఉపద్రవాలకు దారితీయవచ్చు’ అని పేర్కొన్నారు. ఇప్పుడు జరుగుతున్నది అదే.
కానీ కృషా ్ణనదీజలాలను ఏ విధమైన సహజ, అంతర్జాతీయ న్యాయసూత్రాలు పట్టించుకోకుండా కేవలం ఆంధ్ర ప్రాంతాల ప్రయోజనాలే లక్ష్యంగా ఉమ్మడిరాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వివక్ష చూపాయి. ఇప్పుడు ఆ అన్యాయాన్ని సవరించడానికి అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం-1956, సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ను వేయమని తెలంగాణ అడుగుతున్నది. ట్రిబ్యునల్ రెండు రాష్ర్టాల కు కేటాయింపులు జరిపేదాక తాత్కాలికంగా కృష్ణా జలాలను చెరిసగం పంచుకోవాలని డిమాం డ్ పెడితే ఎంత గగ్గోలు! ఎన్ని అసత్య గోబెల్స్ ప్రచారాలు..!!
–శ్రీధర్రావు దేశ్పాండే