ఉద్యమ అనుభవాలతో ప్రభుత్వాధినేతగా.. సమస్యల పట్ల స్పష్టతతో.. శాశ్వత పరిష్కారాన్ని ఆవిష్కరించే నాయకుడు కేసీఆర్. ఏడేండ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమాలను రెండు కండ్లుగా భావించి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అహోరాత్రులు అలుపెరుగని కృషి చేస్తున్నారు. అనేక జటిలమైన సమస్యలకు కూడా పరిష్కారాలను చూపగలిగే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్. తెలంగాణ అభివృద్ధి నమూనానే దేశానికి కేసీఆర్ నమూనాగా ఆదర్శం కావటం విశేషం.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా సబ్బండ వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ అనేక పథకాలకు శ్రీకారం చుట్టారు. సామాజిక అసమానతలను తొలగించి ఆర్థిక సమానత్వం సాధించేలా ఆయన ముందుకు సాగుతున్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కులవృత్తులను, గ్రామీణ కుటీర పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారు. తాజాగా దళితుల అభ్యున్నతి కోసం తీసుకొచ్చిన దళితబంధు పథకం.. తెలంగాణ సంక్షేమ పథకాలకు తలమానికం వంటిది.
తెలంగాణలోని వివిధ సామాజిక వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ వినూత్న పథకాలను ప్రవేశ పెట్టారు. గొల్లకుర్మ సామాజికవర్గం కోసం గొర్రెల పంపిణీ పథకం వచ్చింది. ఇప్పటిదాకా 11 వేల కోట్లు ఖర్చు చేసి 7.26 లక్షల యూనిట్ల గొర్రెలను రాష్ట్రప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసింది. పశుగ్రాసానికి ఇబ్బంది కలుగకుండా 80 శాతం సబ్సిడీతో దాణా అందిస్తున్నది. దీంతో గొల్లకుర్మలకు దాదాపు రూ.5 వేల కోట్ల ఆదాయం లభించింది. ముదిరాజుల అభివృద్ధి ధ్యేయంగా ‘సమీకృత మత్స్య అభివృద్ధి పథకం’ను 2018లో ప్రారంభించింది. మిషన్ కాకతీయలో చెరువుల పూడికతీత ద్వారా చేపల పెంపకానికి అవకాశాలు రెట్టింపైనవి. ఫిబ్రవరి 2021 నాటికి రాష్ట్రంలో 13,10,239 టన్నుల చేపల ఉత్పత్తి జరిగింది. వీటి విలువ సుమారు 17,199 కోట్లు.
వ్యవసాయం తర్వాత దేశంలో అతి పెద్ద ఉపాధి కల్పనారంగం చేనేత, జౌళి. ప్రపంచీకరణ విధానాలతో ఈ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. సిరిసిల్ల ఉరిసిల్లగా మారింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పద్మశాలీల అభివృద్ధి పట్ల సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆధునిక పరిజ్ఞానాన్ని అందించడం, శిక్షణ ఇవ్వడం, ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించటం లాం టి ఎన్నో చర్యలు చేపట్టారు. పవర్ లూమ్స్, నూలు, రసాయనాల వంటి ముడిసరుకు, సామాగ్రి కొనుగోలుపై ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ అందిస్తున్నది. చేనేత కార్మికులకు రూ.50 కోట్ల రుణమాఫీ చేసింది. వరంగల్లో కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు విప్లవాత్మక నిర్ణయం. దీంతో తెలంగాణలో చేనేత రంగ స్వరూపమే మారిపోతుందనటంలో సందేహం లేదు.
తెలంగాణలో మరో ప్రధాన సామాజికవర్గం గౌడ. రాష్ట్రప్రభుత్వం నీరా పాలసీని తీసుకువచ్చి గౌడ కులస్థులే నీరా తీసేలా పదేండ్లు లైసెన్స్ కేటాయించింది. ప్రత్యేక నీరా స్టాల్స్ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 62,950 మంది గీత కార్మికులకు ఆసరా పెన్షన్ అందజేయటం హర్షణీయం. రజకుల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, ఆధునిక దోభీఘాట్లు, ఆధునిక యంత్రాలతో లాండ్రీల ఏర్పాటుకు ప్రభుత్వం విస్తృతంగా నిధు లు మంజూరు చేస్తున్నది. నాయీబ్రాహ్మణులకు శిక్షణ, సెలూన్లకు గృహ కేటగిరీ విద్యుత్, నూతన సెలూన్ల ఏర్పాటుకు ఇచ్చే సబ్సిడీ కోసం గత ఏడేండ్లలో రూ.520 కోట్లకు పైగా ప్రభుత్వం వెచ్చించింది.
బహుజనుల్లో ఫెడరేషన్ల ద్వారా అందించే సబ్సిడీని రూ.25 వేల నుంచి లక్ష రూపాయల కు పెంచింది. 2014 నుంచి ఇప్పటిదాకా వాల్మీ కి, బోయ ఫెడరేషన్కు రూ.11.02 కోట్లు, సగర (ఉప్పర) ఫెడరేషన్కు రూ.20.73 కోట్లు, భట్రాజు ఫెడరేషన్కు రూ.7.61 కోట్లు, కృష్ణ బలిజ (పూసల) ఫెడరేషన్కు రూ.15.71 కోట్లు, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్కు రూ.34.11 కోట్లు, కుమ్మరి (శాలివాహన) ఫెడరేషన్కు రూ.35.27 కోట్లు, మేదర కార్పొరేషన్కు రూ.13.63 కోట్లు, వడ్డెర ఫెడరేషన్కు రూ.34.28 కోట్లు కేటాయించి వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నది. సామాజిక, విద్య, ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చటానికి ఎంబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఏడాదికి రూ.వెయ్యి కోట్ల నిధులను కేటాయిస్తున్నది. ఎస్సీ, ఎస్టీలతో సమానంగా ఎంబీసీలకు సబ్సిడీ ఇవ్వటం గమనార్హం.
బీసీ విద్యార్థుల ఉన్నతవిద్యపై దృష్టిని కేంద్రీకరిస్తూనే, సాంప్రదాయ కులవృత్తుల ప్రాధాన్యతను గుర్తించింది రాష్ట్రప్రభుత్వం. చైనా అనుసరిస్తున్న విధానం తరహాలో సూక్ష్మ, మధ్యస్థాయి రంగాల్లో జవసత్వాలు నింపుతున్నది. దేశ చరిత్రలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం.. మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యానిధి పథకం, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద విదేశాల్లో చదువుకునే
ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల ఆర్థికసాయాన్ని
అందిస్తుండటం శ్లాఘనీయం.
సామాజికంగా వివక్షను ఎదుర్కొం టూ కనీస జీవన ప్రమాణాలతో నివసించలేకపోతున్న దళితుల అభివృద్ధి కోసం ‘దళితబంధు’ పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. దళిత కుటుంబాల సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. జన నేతగా వారు-వీరు అనే తేడా లేకుండా సర్వజన హృదయాలలో నిలిచారు సీఎం కేసీఆర్. ప్రజారంజక పాలనను కొనసాగిస్తూ మరింతకాలం రాష్ర్టానికి, దేశానికి ఆయన మార్గదర్శకత్వం అందించాల్సిన అవసరం ఉన్నది. దార్శనికుడు కేసీఆర్కు, ఎన్నిక ఏదైనా గెలుపు బాటే. గత రెండు దశాబ్దాల అనుభవం అదే.
(వ్యాసకర్త: వైస్ఛాన్స్లర్, కాకతీయ యూనివర్సిటీ)
ప్రొఫెసర్ తాటికొండ రమేష్