‘ముస్సోలినీ కలిగించిన నష్టాల నుంచి కోలుకోవడానికి ఇటలీకి దశాబ్దాలు పట్టింది. ప్రధాని మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వినాశనం నుంచి కోలుకోవడానికి మన దేశానికి అంతకంటే ఎక్కువ కాలమే పడుతుంది’ అంటూ చరిత్రకారుడు రామచంద్ర గుహ అన్న మాటలు నిజం కావటానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు.ఈ ఏడేండ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వ పాలన తీరును విశ్లేషించుకుంటే దేశవ్యాప్తంగా మోదీ-షా పేర్లు మార్మోగుతున్నాయి. అయితే,
అది పాజిటివ్గా కాదు. నెగెటివ్గా.
కేంద్ర సర్కారు ఆర్థిక విధానాల వల్ల దేశంలోని పేదల జీవితాలు రోడ్డున పడ్డాయి. ధనికుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. దళితులు, మైనారిటీలు, బలహీన వర్గాల మీద దేశంలో ఏదో మూలన నిత్యం హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి. చిన్న చిన్న నిరసనలకు, ఫేస్బుక్ పోస్టులకు భయపడి జాతీయ భద్రత చట్టాల కింద అనేక మందిని అరెస్టు చేయిస్తున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను కట్టడి చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలను అందించే మీడియా మోదీ సర్కార్కు వినోదంగా మారింది. ఇవాళ మీడియాలో మోదీ ఒక బలమైన నాయకుడిగా ప్రచారమవుతున్నారు.
ప్రజలు, విపక్షాలు మాత్రమే కాదు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు కూడా మోదీ విధానాలను బహిరంగంగా వ్యతిరేకిస్తున్నాయి. ‘చదువుకున్న వారెవ్వరూ బీజేపీకి ఓటేయరని’ కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పరోక్షంగా మోదీ-షా లపై ఉన్న వ్యతిరేకతను వెళ్లగక్కారు. గతంలో బీజేపీ కీలకనేత, సీనియర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ‘సంసారం లేనివాడు దేశాన్ని ఎలా చక్కపెడతాడ’ని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అదే పార్టీకి చెందిన సుబ్రహ్మణ్యస్వామి ‘మోదీకి పబ్లిసిటీ ఎక్కువ.. పరిపాలన తక్కువ’ అని ఎద్దేవా చేశారు. యూపీలో బీజేపీ వర్కింగ్ కమిటీ సభ్యులు రామ్ ఇక్బాల్ సింగ్ కరోనా కట్టడి విషయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ అసమర్థతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చెప్పుకొంటూ పోతే మరెన్నో ఉన్నాయి.
రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఎన్నికల కమిషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆర్బీఐ, ఉన్నత విద్యా వ్యవస్థలను, వర్సిటీలను, న్యాయవ్యవస్థలను పద్ధతి ప్రకారం దెబ్బతీశారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రణాళిక సంఘాన్ని రద్దుచేసి, దానిస్థానంలో ప్రణాళిక, పద్ధతి లేని ‘నీతి ఆయోగ్’ను తీసుకొచ్చారు. ఆర్థిక అవసరాల కోసం రాష్ర్టాలు ఇప్పుడు కేంద్రం మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. బ్రిటిష్ కాలానికి చెందిన పనికిమాలిన చట్టాలను ఉపయోగించి మేధావులను, ఉద్యమకారులను, ప్రజాస్వామికవాదులను, ఆదివాసులను, దళితులను, మైనారిటీలను జైలుపాలు చేస్తున్నారు. నేడు బీజేపీ ప్రభుత్వం సైన్స్ను అణిచివేస్తున్నది. వివిధ రంగాల సైన్స్ గురించి తక్కువచేసి మాట్లాడుతున్నది. పురాణాలు, పురాతన సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని ప్రజలకు బోధిస్తున్నది. మన దేశ గౌరవం వీటిమీదనే ఆధారపడి ఉన్నదని ప్రజలను వంచన చేస్తున్నది. పెగాసస్ సాంకేతికతతో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం మోదీ పరిపాలనకు పరాకాష్ఠ. ఏడేండ్ల పాలన మీద ‘ఫ్రీడం నౌ’ అనే సంస్థ సర్వే చేసి, భారతదేశంలో ప్రజాస్వామ్యం నియంతృత్వం వైపు ప్రయాణిస్తుందని వెల్లడించింది.
అధికారంలోకి రాకముందు ఉపాధి అవకాశాలను పెంచుతామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మోదీ హామీలను గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలను తుంగలో తొక్కి మూడు వందల ప్రభుత్వ పరిశ్రమలు, సంస్థలను ప్రైవేటు పరం చేశారు. నిజానికి ప్రభుత్వ సంస్థలు లాభాలు ఆర్జించాయి. ప్రజలకు సేవలందించాయి. లక్షల మంది యువతీ యువకులకు ఉపాధి కల్పించాయి. కానీ ఇవి ప్రభుత్వరంగ సంస్థలుగా ఉండవద్దని ప్రధాని మోదీ నిర్ణయించటం ఏ విధంగా సరైనది?
ప్రజాస్వామ్య పద్ధతిని పక్కనబెట్టి, రాష్ర్టాలతో చర్చించకుండా సీఏఏ, ఎన్నార్సీ చట్టాలను తీసుకురావడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టుబడుతున్నది. అలాగే నూతన వ్యవసాయ చట్టాలను తీసుకురావడానికి మొండిగా వ్యవహరిస్తున్నది. రైతుల పట్ల నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తున్నది. ఇలాంటి నిర్ణయాలు దేశ ఫెడరల్ వ్యవస్థకు ప్రమాదకరం.
యూపీఏ హయాంలో ధరలు ఆకాశానికి అంటితే, మోదీ హయాంలో అంతరిక్షాన్ని తాకుతున్నాయి. తెలంగాణ నుంచి బీజేపీకి నలుగురు ఎంపీలున్నారు. ఈ నలుగురిలో ఒకరు కేంద్ర మంత్రి. ఒకరు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. అయినా తెలంగాణకు నిధులు తీసుకువచ్చింది లేదు. ప్రజా సమస్యలను పరిష్కరించింది లేదు. కానీ ఈ పాదయాత్రలు ఎవరి కోసమో అర్థం కావడం లేదు.
అధికారంలో ఉండి అభివృద్ధి చేయవలసింది పోయి, యాత్రలు చేయడం సిగ్గుమాలిన చర్య. ఈ యాత్ర వల్ల ప్రజా సంపద వృథా తప్ప ఒరిగేదేమీ లేదు.
మోదీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల కు రాష్ట్ర బీజేపీ నాయకుల వద్ద సమాధానం లేదు. ఎంతసేపు మత రాజకీయాల ధ్యాస తప్ప, అభివృద్ధిపై దృష్టి లేదు. మోదీ ఆరు లక్షల కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా ప్రభుత్వ ఆస్తులను అమ్మడానికి రోడ్మ్యాప్ సిద్ధం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అధికారికంగా ప్రకటించారు. అంటే దేశాన్ని అమ్మకానికి పెట్టారా? దీనికి సమాధానం చెప్పాలి. ఇలాంటి వికృత చేష్టల వల్ల ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అవుతాయనడంలో సందేహం లేదు.(వ్యాసకర్త: ఉస్మానియా వర్సిటీ విద్యార్థి నాయకులు)
మాందాల భాస్కర్