హుజూరాబాద్ ప్రజలు ఉద్యమ, అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు మానసికంగా సిద్ధపడ్డారు. ప్రతిపక్షాలకు ఈ ఉపఎన్నిక శరాఘాతం కానున్నది. ప్రతిపక్షాలు ఆత్మసంతృప్తి కోసమే పోటీలో ఉంటాయనేది ఊహించుకోవచ్చు. కేవలం తమ రాజకీయ ఉనికి కోసమే ప్రభుత్వంపై విష ప్రచారానికి ఒడిగడుతున్నాయి.
కేంద్రంలో తానేదో ఒరగబెట్టినట్లు బీజేపీ గొప్పలకు పోతున్నది. ప్రధాని మోదీ పాలనలో అసహనం, అణచివేత, విద్వేషం, వివక్ష, వేధింపులు పెరిగిపోయి దేశ సమగ్రతకు ముప్పు ఏర్పడింది. దీంతో తెలంగాణలో బీజేపీని విశ్వసించే పరిస్థితిలో ప్రజలు లేరు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమ పాలనను కొనసాగిస్తూ పలు రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగుతున్నది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళిత బంధు’ పథకాన్ని ప్రారంభించారు. కేసీఆర్ ఏ పథకం ప్రవేశపెట్టినా అది చరిత్రలో నిలిచిపోతుంది. దీనికి ఉదాహరణ ‘రైతు బంధు’ పథకాన్నే తీసుకోవచ్చు. ఈ పథకాన్ని చూసే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పేర పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు యావత్ దేశం ‘దళితబంధు’ వైపు ఆసక్తిగా చూస్తున్నది. దళిత సాధికారత కోసం, వారి ఆర్థిక, సామాజిక ప్రయోజనాల కోసం ‘దళిత బంధు’కు కేసీఆర్ రూపకల్పన చేశారు. అందుకోసం రూ.1200 కోట్లను కేటాయించారు. ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేస్తున్నది. పైలట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ నుంచే ప్రారంభించారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు ఇక్కడి నుంచే మొదలవడం గమనార్హం.
హుజూరాబాద్ నియోజకవర్గంలో సుమారు 30 వేల వరకు దళిత కుటుంబాలున్నాయి. వారి జీవన స్థితిగతులను పరిగణనలోకి తీసుకొని లబ్ధిదారులను ఎంపికచేశారు. తరతరాలుగా దళితులను ఆర్థిక, సామాజిక వివక్ష పీడిస్తున్నది. దీన్నుంచి విముక్తి కలిగించి అన్నిరంగాల్లో వారిని అభివృద్ధి వైపు నడిపించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. అభివృద్ధి, సంక్షేమంలో మన రాష్ట్రం అగ్రభాగాన నిలుస్తుందనటంలో సందేహం లేదు. బడుగు బలహీనవర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు బడ్జెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమం కోసం ఈ సారి రూ.15,293 కోట్లు కేటాయించింది. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపన కోసం సీఎం కేసీఆర్ పరితపిస్తున్నారు. అందుకోసం నియోజకవర్గాల అభివృద్ధికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రూ.5 కోట్ల చొప్పున నిధులు కూడా కేటాయించారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సీఎం కేసీఆర్ సాగిస్తుంటే.. ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. ఎన్ని అబద్ధాలు చెప్పినా కండ్లముందు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూస్తున్న ప్రజలు ప్రతిపక్షాలను పట్టించుకునే స్థితిలో లేరనేది వాస్తవం. రాష్ట్రంలో అవినీతిరహిత, స్వచ్ఛమైన పాలన కొనసాగుతున్నది కాబట్టే పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు. అదేస్థాయిలో అభివృద్ధి సైతం జరుగుతూ, ఉపాధి కల్పన ఊపందుకున్నది. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత స్వరాష్ట్ర పాలనలో ప్రజల ఆకాంక్షలు ఒక్కొక్కటిగా నెరవేరుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో ప్రజలు అభివృద్ధివైపే నిలుస్తారనటంలో ఏ మాత్రం సందేహం లేదు.
(వ్యాసకర్త: జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు)
మాగంటి గోపీనాథ్