అణచివేయబడిన జాతుల పురోభివృద్ధి, సామాజిక సమానత్వం కేంద్రంగా నవభారత నిర్మాణం జరగాలని బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటివారు స్వాతంత్య్రానికి పూర్వం కృషిచేశారు. దీని ఫలితంగా అనివార్య పరిస్థితుల్లోనే కొన్ని అవకాశాలు కొంతమందికైనా దక్కాయి. రాజ్యాంగం వారి పురోభివృద్ధికి మరిన్ని అవకాశాలు అందించింది. అయితే ఆయా వర్గాలకు ఈ అవకాశాలను అందించడానికి, సంక్షేమరాజ్యం నిర్మించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నాలు కొనసాగలేదు. ఈ నేపథ్యంలో ఏ రాజకీయ నాయకుడు చేయని సాహసాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు. దళిత బంధు పథకం ద్వారా దేశంలోనే గొప్ప సామాజిక, ఆర్థిక మార్పునకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు.
ఒక అవయవ లోపం ఉంటే మనిషి ఎలాగైతే వైకల్యంతో కనబడుతాడో, సమాజంలో ఒక వర్గం అభివృద్ధికి నోచుకోక కుంగిపోయి ఉంటే ఆ సమాజం కూడా అలానే అసంపూర్ణంగా, అనాగరికంగా కనిపిస్తుంది. ఇది సమాజంలోని అభివృద్ధి చెందిన కులాలకు కూడా అవమానం. ఇదొక అనాగరిక ఆచారం అని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదేపదే చెప్తుంటారు. అణచివేయబడినవారే తమ అభ్యున్నతి కోసం పోరాటం చేయడం కాదు, మిగిలిన వర్గాలు కూడా వారికి చేయూతనివ్వాలి. దళితబంధు పథకం ద్వారా దేశంలో అన్ని రాజకీయపార్టీల, ప్రభుత్వాల ముందు దళితుల అభివృద్ధి, వారి సాధికారత అంశాలనే ప్రధాన ఎజెండాగా కేసీఆర్ మార్చారు. ఈ నిర్ణయం దేశంలో ఇప్పటివరకు కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులనే మార్చబోతున్నది. అందుకే అంబేద్కర్ మహాశయుడు దళిత, అణగారిన వర్గాల రక్త సంబంధం అయితే కేసీఆర్ దళితుల ఆత్మబంధం.
దేశ రాజకీయాల్లోనే విశిష్టమైన నాయకుడు కేసీఆర్. వారు తెలంగాణ రాష్ట్ర నినాదం ఎత్తుకున్న నాడు రాష్ట్ర ఏర్పాటుకు అన్నీ ప్రతికూలాంశాలే. రాష్ట్ర సాధన కోసం తన రాజకీయ భవిష్యత్తును, వ్యక్తిగత జీవితాన్ని, ఉన్నత పదవులన్నింటినీ వదులుకున్నారు. అనేక అవమానాలను ఎదుర్కొన్నారు. ఒక దశలో ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి పోరాడారు. అట్లాంటి త్యాగపూరిత పోరాటం ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కృషిచేస్తున్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలను ప్రజానీకానికి అందించే క్రమంలో ఆయన వినూత్న నిర్ణయాలు తీసుకున్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అనేక ప్రాజెక్టులను, ఇతర అభివృద్ధి పనులను తక్కువ కాలంలోనే పూర్తిచేశారు. సాగునీటి సమస్యను సంపూర్ణంగా పరిష్కరించారు. ఈ ప్రయత్నంలో ఆయన లాభనష్టాలను, ప్రభుత్వంపై పడే ఆర్థికభారాన్ని లెక్కచేయలేదు. ప్రతిపక్షాల విమర్శలను, వారు చెప్పే లాభ నష్టాల లెక్కలను పక్కనపెట్టి రైతుల సంక్షేమమే తనకు ముఖ్యమని భావించి, అప్పులు చేసి అయినా సాగునీటి కష్టాలను తీర్చాలనుకున్నారు. పల్లానికి పరిగెడుతున్న నీళ్లను పైకి ఎత్తిపోసి పంట పొలాలకు నీళ్లందించి రైతుల పాదాలను కడిగారు.
వ్యవసాయాన్ని పండుగగా మార్చడానికి, రైతన్నలకు భరోసా కల్పించడానికి కేసీఆర్ కోట్ల రూపాయలతో రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను కులమతాలకు అతీతంగా ప్రవేశపెట్టారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను మొదట ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అందించినా తర్వాత బీసీవర్గాల్లోని పేదలకూ అందిస్తున్నారు. దేశంలో ఇట్లాంటి పథకాలను రూపొందించి, వాటిని విజయవంతంగా అమలుచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. విద్యావ్యవస్థను చక్కదిద్దడానికి అనేక గురుకుల పాఠశాలలను ప్రారంభించారు. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే కాదు, ఓబీసీలకు కూడా చదువుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రభుత్వ దవాఖానలకు చికిత్స చేసి అన్నిరకాల పరీక్షల సౌకర్యాలతో పేదలకు ఉచిత, నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నారు. ఈ ఏడేండ్లలో ఇలా అన్నివర్గాల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టారు. పైరవీకారులకు, దళారులకు చోటులేకుండా నేరుగా ప్రజల ఇంటికే ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా చేరవేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రజల జీవితాల్లో ఆర్థిక స్వావలంబనను తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే దళిత సాధికారత కోసం ఏదైనా చేయాలనే తపనతో దళితబంధు పథకాన్ని తెచ్చారు. కుల మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ పథకాన్ని అనేకమంది స్వాగతిస్తూ, దళితుల జీవితాల్లో సమూల మార్పు తీసుకువస్తుందని అభినందిస్తున్నారు.
ఒకటి, రెండు లక్షల ఆర్థిక సహాయమో, ఐదు, పది లక్షల బ్యాంకు రుణ మో ఇస్తే ఆ వర్గాల సంపూర్ణ స్వావలంబన సాధ్యం కాదని కేసీఆర్ భావించారు. అందుకే అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి పది లక్షలు ఉచితంగా ఇవ్వడమే కాక, వారు ఆ పైసలతో ఏం చేసుకోవాలో సలహాలు ఇవ్వడానికి ప్రభుత్వ అధికారులను నియమించారు. అంతేకాదు వాళ్లు చేసుకునే ఆయా వ్యాపారాల కార్యకలాపాలకు ప్రభుత్వరంగం నుంచి, ఇతరవర్గాల నుంచి సహకారం అందించే ఏర్పాటు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారుల కుటుంబాలకు ఏదైనా ఇబ్బంది ఏర్పడితే మళ్లీ కిందకు పోకుండా.. ముందుకు సాగడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా రక్షణ నిధిని కూడా ఏర్పాటుచేసింది. కూలీలుగా, అల్పవేతన జీవులుగా ఉన్న దళితులు ఈ పథ కం ద్వారా వ్యాపారవేత్తలుగా మారి మరికొందరికి ఉపాధి కల్పిస్తారు.
ఈ పథకం గురించి వివిధ రాజకీయపార్టీల నాయకులు, దళిత మేధావులతో ముఖ్యమంత్రి చర్చించారు. అంతేకాక హుజూరాబాద్ నుంచి 400 మందికిపైగా దళిత ప్రతినిధులను ప్రగతిభవన్కు ఆహ్వానించి, వారితో సహపంక్తి భోజనం చేసి, ఈ పథకానికి సంబంధించిన అభిప్రాయాలను, అవగాహనను పంచుకున్నారు. ప్రతిపక్షాలు ఈర్ష్యతో విమర్శిస్తున్నట్టు దొరల గడీ కాదు ఇది ప్రజల ప్రగతిభవన్ అని మరోసారి చాటారు. వాసాలమర్రిలో దళితవాడలోని ప్రతి ఇంటికి వెళ్లి వారి స్థితిగతులను పరిశీలించి, ఈ పథకాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో వివరించారు. ముఖ్యమంత్రి తలపెట్టిన సంక్షేమ పథకాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్న ప్రతిపక్షాలు, కేసీఆర్పై వ్యక్తిగతంగా ద్వేషం పెంచుకున్న కొన్ని సంఘాలవారు, నాయకులు, వ్యక్తులు దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నామంటూనే ఎప్పటిలాగే అర్థంలేని విమర్శలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ దేశంలో జరిగిన అనేక వామపక్ష, విప్లవ సామాజిక ఉద్యమాలు, రాజకీయపార్టీలు చేపట్టిన అనేక కార్యక్రమాలు అన్ని కూడా ప్రధానంగా అట్టడుగువర్గాల అభ్యున్నతి కోసమే. అందులో ప్రధానంగా దళితుల కోసం చేపట్టినప్పటికీ ఆ పోరాట సందర్భాల్లో ఆ సంస్థలు, శక్తులు ఈ వర్గాలకు అనేక వాగ్దానాలు చేస్తూ వచ్చాయి. అందుకోసం అనేక ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే వారిచ్చిన వాగ్దానాలు సంపూర్ణంగా నెరవేరలేదనేది వాస్తవమే. అందుకు అనేక కారణాలు ఉండవచ్చు. కార్యక్రమం ఏదైనా మొత్తం ఫలితాలు రావు. కాబట్టి అవి చేయడమే తప్పు అనే వాదన మూర్ఖమైనది. ఈ నేపథ్యంలో దళితబంధు దళితులందరికీ ఒకేసారి ఇవ్వాలని, లేదా అన్ని వర్గాల్లోని పేదలందరికీ ఒకేసారి ఇవ్వాలని అనడం అంటే పరోక్షంగా దళితబంధును అడ్డుకోవడమే. ఇది అసమంజసమైన, మూర్ఖమైన, ద్రోహపూరిత ఆలోచన.
దళిత బంధును విమర్శిస్తున్న పార్టీలు, సంఘాలు ఇప్పటివరకు దళితుల కోసం ఒక్క వినూత్న కార్యక్రమమైనా ప్రభుత్వానికిసూచించాయా? మరి ముఖ్యమంత్రిగారే తనకు తానుగా ముందుకు తీసుకొచ్చిన కార్యక్రమానికి వంకలుపెడుతూ పలుచనచేయడం కుట్ర కాదా? కొందరు వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం జాతి ప్రయోజనాలు ఎలా పణంగా పెడుతున్నారో దళితులంతా గమనించాలి. దళితుల కోసం పథకం ప్రవేశపెడితే అందరికీ ఇవ్వాలనడం ద్వారా దాన్ని సాధ్యం కాకుండా చేసి, కేసీఆర్నే బద్నాం చేశామని సంబురపడి సంచులు నింపుకునేవాళ్ల అసలురూపాలను ఇప్పటికైనా దళిత సమాజం అర్థం చేసుకోవాలి.
దళితబంధు పథకమే కాదు. ఏ పథకమైనా ఒక్కసారిగా అందరికీ చేరి మొత్తం ప్రయోజనాలను రాత్రికిరాత్రే అందివ్వలేదు. ప్రాధాన్యక్రమాన్ని బట్టి దీర్ఘకాలంలో ఇలాంటి పథకాల ప్రయోజనాలను ఆయావర్గాల వాళ్లు అందిపుచ్చుకుంటారు. ఇది దళితులకే కాకుండా భవిష్యత్తులో ఇతరవర్గాలకు కూడా అనేక ప్రయోజనాలను తెచ్చిపెడుతుంది. ఈ విషయం విమర్శలు చేసే ముఠాలకు తెలియక కాదు. ఈ విమర్శల వెనుక వారి స్వప్రయోజనాలు దాగి ఉంటాయి. అందుకోసమే దిగజారుడు వాదనలతో వారు దళిత ద్రోహులుగా వ్యవహరిస్తున్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలకు దళితబంధు పథకం కంటగింపుగా మారింది.ఈ పథకం అమలైతే రేపు దేశమంతా ఆ డిమాండు వారి ముందుకువస్తుంది. అందుకే ఈ పథకాన్ని ఇక్కడి దళితులకు అందకుండా కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు. నిరసనలు, ధర్నాలతోనే కాదు, కోర్టులకు వెళ్లి అయినా దీన్ని ఆపడానికి వెనుకాడని దుస్సాహసం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ దేశమంతటా ఇలాంటి పథకాన్ని అమలుచేయాలని దళిత సంఘాలు డిమాండు చేయాలి. కానీ ఆ పని చేయకుండా తెలంగాణలో మాత్రం అందరికీ ఇవ్వమనే వారితో గొంతు కలుపడం ఏమిటో? దానివెనుక ఉన్న అసలు రంగు ఏమిటో? వారి నిజ స్వరూపాలను, దళితజాతి పట్ల వారికున్న చిత్తశుద్ధిని ఇకనైనా దళిత సమాజం అర్థం చేసుకోవాలి.
అలాంటివారిని నిలదీయాలి.
ఈ పథకంలో లోపాలుంటే మీరు పాలించే రాష్ర్టాలలో ఎలాంటి మార్పులతో ప్రవేశపెడతారో ప్రకటించండి. అసలు దళితుల సాధికారతపై మీ సంపూర్ణ విధానాన్ని ఒక డాక్యుమెంట్ రూపంలో విడుదల చేయండి. అభివృద్ధికి అడ్డుపడటం తప్ప ఈ పార్టీలు, సంఘాలు ఇప్పటివరకు ఒక్క నిర్మాణాత్మక సూచన చేయలేదు. అనేక విమర్శలు ఎదుర్కొంటూ, ఆర్థికభారాన్ని భరిస్తూ అట్టడుగున ఉన్న దళితుల ఆర్థిక స్వావలంబన కోసం కేసీఆర్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయాన్ని దళిత సమాజం అందిపుచ్చుకోవాలి. ఈ నిధులు సద్వినియోగం చేసుకొని సాధికారత సాధించాలి. శ్రమకు వెనుకాడని దళితవర్గాలకు అవకాశం ఇస్తే ఎంతో ఎదుగుతారన్న కేసీఆర్ మాటలు అక్షరసత్యాలని నిరూపించాలి. ఇప్పుడు ఇది మన జాతి ముందున్న కర్త వ్యం. కేసీఆర్ ఏ పని ప్రారంభించినా గమ్యాన్ని ముద్దాడేవరకు విశ్రమించరు. మన సమాజ సాధికారత కోసం ఆయన అందిస్తున్న ఈ ఆర్థిక సహకారాన్ని సద్వినియో గం చేసుకొని తెలంగాణ దళిత సమాజం దేశానికి ఆద ర్శం కావాలి.
నేను గతంలో ఎంపీగా 20 రాష్ర్టాల్లో పర్యటించాను. కేంద్ర, రాష్ర్టాల విధి విధానాలను లోతుగా అధ్యయనంచేశాను. ఇప్పుడు ఎమ్మెల్యేగా వివిధ రాష్ర్టాల్లో ఉన్న పథకాలను అధ్యయనంచేస్తున్నాను. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇలాంటి ఒక పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొని రావడం నిశ్చయంగా విప్లవాత్మకమైన సందర్భం. సీఎం కేసీఆర్ నిర్ణయం దేశంలో 20 శాతం పైగా ఉన్న దళితజాతి సముద్ధరణ కోసం వేసిన గొప్ప ముందడుగు. తెలంగాణ దళితబిడ్డగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాను. ఈ పథకం విజయవంతం చేయడంలో నావంతు కృషిని శాయశక్తులా చేస్తాను.
దళిత బంధు సంక్షేమ పథకమే కాదు దళితుల జీవితాల్లో బృహత్తర మార్పులకు శ్రీకారం చుట్టే ఒక మహత్తర ఉద్యమం. నేడు హుజూరాబాద్లో దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమవుతున్నది. ఈ సందర్భంగా అన్నివర్గాల ప్రజలు ఆశీర్వదించాలని, దళిత బహుజనులు భారీసంఖ్యలో ఈ సభకు తరలిరావాలని కోరుకుంటున్నాను.
(వ్యాసకర్త: చెన్నూరు శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు)