రాష్ట్రంలో 2021-22 సంవత్సరానికి గాను ఆరుతడి పంటలే వేయాలని ప్రభుత్వం రైతులకు సూచించింది. దీనికోసం రైతులకు తగు సూచనలు,సలహాలు ఇవ్వటానికి అన్నిరకాల వ్యవస్థలను సన్నద్ధం చేసింది. వరికి బదులుగా ఏ నేలల్లో, ఏ పంటలు వేస్తే లాభదాయకంగా ఉంటుందో వ్యవసాయ శాస్త్రవేత్తల సాయం అందిస్తున్నది. సంప్రదాయకంగా ఏటా వరి సాగు చేస్తున్న రైతులు ఇకనుంచి వరికి బదులు ఇతర ఆరుతడి పంటలు పండించటం ద్వారా వరి ధాన్యం అమ్మకం సమస్య నుంచి బయటపడేందుకు మార్గనిర్దేశనం చేస్తున్నది.
రాష్ట్రంలో గత ఏడేండ్లుగా వ్యవసాయం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటిదాకా వానకాలం పంటగా వరిని అత్యధికంగా పండిస్తున్నారు. సుమారుగా 54 లక్షల మంది వరి సాగు చేస్తున్నారు. ఇందుకు రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులు, అందుబాటులోకి వచ్చిన సాగు నీరు, 24 గంటల ఉచిత విద్యుత్తు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. 2021 వానకాలంలో దాదాపు 63 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు అధికారిక లెక్కలు ధృవీకరిస్తున్నాయి. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా వరి దిగుబడి పెరిగి దేశానికే ధాన్యాగారంగా ఘనతికెక్కింది. ఈ నేపథ్యంలో యాసంగి పంట వరిధాన్యాన్ని కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించటంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతులను చైతన్యపరుస్తున్నది.
తెలంగాణ ఎత్తయిన పీఠభూమిగా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం సారవంతమైన భూములున్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. రాష్ట్రవ్యాప్తంగా భూ సార పరీక్షలు నిర్వహిస్తే ఇక్కడ నాణ్యమైన వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉందని నిపుణులు గుర్తించారు. ఇక్కడ పండించిన పంట నాణ్యతతో కూడుకొని ఉంటుందని దీన్ని విత్తనాల కోసం వాడుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
భారతీయ భూ విజ్ఞాన సంస్థ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్) ఇటీవల ప్రకటించిన నివేదిక ప్రకారం దేశంలోని సగం రాష్ర్టాలు భూసార క్షీణతను ఎదుర్కొంటున్నాయి. భూమిలో ఎప్పటికీ ఒకే రకమైన పంట వేయడం వల్ల భూసారం పూర్తిగా దెబ్బతిని పంట దిగుబడి తగ్గుతున్నదని ఆ నివేదిక తెలియజేసింది. కాబట్టి రైతులు ప్రతి సీజన్లో ఒకే రకమైన పంట కాకుండా, రెండవ పంటగా ఆరుతడి పంటలను వేసుకుంటే ఎంతో మేలు. ఇందులో ముఖ్యంగా డిమాండ్ ఉన్న పంటలు పప్పు దినుసులు, చిరుధాన్యాలు పెసర, మినుము, కంది, సోయాబీన్, మక్కజొన్న, పత్తి, మిర్చి వంటి పంటలను పండించటం రైతులకు లాభదాయకం. మార్కెట్లో గిరాకీ ఉన్న వ్యవసాయ పంటలు పండించడానికి రైతులు ముందుకురావాలి. అప్పుడే రైతు పెట్టిన పెట్టుబడి, లాభం చేతికి అందుతుంది.
సాగు భూములను నాశనం చేస్తున్న మరో మహమ్మారిని గుర్తించాలి. రసాయన ఎరువులు వాడకం తగ్గించుకోవాలి. తెలంగాణవ్యాప్తంగా రైతులు భూ సార పరీక్షలు నిర్వహించి తమ భూముల్లో సరైన పంట వేసుకునే విధానానికి నాంది పలకాలి. 50 శాతం నేలలో నత్రజని, 49 శాతం నెలలో భాస్వరం, 9 శాతం భూముల్లో పొటాష్ లోపించినట్లు భూ సార పరీక్షల ద్వారా వెల్లడైంది. తెలంగాణ భూముల్లో పొటాషియం నిల్వలు ఎక్కువగా ఉన్నట్లు భూ విజ్ఞాన సంస్థ పేర్కొన్నది. ఈ ప్రాంతాల్లో పొటాష్ వాడకం నామమాత్రంగా ఉంటే సరిపోతుంది. కానీ రైతులు సరైన అవగాహన లేక రసాయన ఎరువులు వాడితేనే ఎక్కువ పంట వస్తుందనే భావనతో విచ్చల విడిగా ఎరువులు వినియోగిస్తున్నారు. దీంతో భూసారం క్షీణించటమే కాకుండా భూమి కృశించిపోవటం (వట్టిపోవటం) జరుగుతున్నది. ఈ నేపథ్యంలోంచే రసాయన ఎరువుల స్థానంలో ప్రకృతి సహజ సిద్ధ సేంద్రియ ఎరువులను వినియోగించటం ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
ప్రాజెక్టులు, కాల్వలు, చెరువుల కింద ఉన్న భూముల్లో వరి కాకుండా మరో పంట వేయలేమనే అభిప్రాయం ఉన్నది. ఆరుగాలం నీరు పారే భూముల్లో ఆరుతడి పంటలు వేయటానికి అనుకూలం కాదు. కానీ నీరు అధికంగా అవసరమయ్యే పంటలను (భూమి లక్షణాన్ని బట్టి) వేసుకోవచ్చు. ఉదాహరణకు చెరకు లాంటి పంటల సాగుకు వ్యవసాయ శాస్త్రవేత్తల సాయంతో ప్రత్యామ్నాయ పంటల దిశగా ఆలోచించాలి. లేదా నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో చేపల పెంపకాన్ని కూడా చేపట్టవచ్చు.
ఈ క్రమంలోంచే 2007-2012 మధ్యకాలంలో భూసార పెంపుదలకు చేపట్టిన చర్యలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో 2025 నాటికి 4.5 కోట్ల టన్నుల పోషకాలు అవసరమవుతాయని తెలుస్తున్నది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేంద్రియ వనరుల పోషకాలు యాభై లక్షల టన్నులు మాత్రమే. 2025 నాటికి 78 లక్షల టన్నులు ఉత్పత్తి ఉండవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సేంద్రియ ఎరువుల తయారీ వినియోగం ఎంత ఎక్కువ జరిగితే అంతగా వ్యవసాయ రంగానికి శ్రేయస్కరం. ఈ విధానంతోనే సాగు భూములు పునరుజ్జీవం పొందటమే కాదు, దిగుబడులు కూడా పెరిగి రైతులకు మేలు జరుగుతుంది.
ఏదేమైనా వ్యవసాయరంగంలో ఆధునిక పోకడలను అనుసరించి ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆరుతడి పంటలతో పాటు ఇటీవల ప్రభుత్వం రైతులకు పరిచయం చేసిన పరిశ్రమ అనుబంధ వ్యవసాయ విధానం కూడా రైతులకు ఎంతో మేలు చేస్తుంది. ఒక గ్రామం, ప్రాంతంలోని రైతులంతా ఒక సమూహం(యూనిట్)గా ఏర్పడి వ్యవసాయ నిపుణుల పర్యవేక్షణలో అందరూ ఒకేవిధమైన పంట సాగుచేయాలి. దీంతో పంటను మార్కెట్కు తరలించటం లాంటి అవరోధాలను అధిగమించవచ్చు. మార్కెట్ అవసరాలను, డిమాండ్ను శాస్త్రీయంగా అంచనా, అధ్యయనంతో సాగు చేసినప్పుడే వ్యవసాయ కష్టాలు కడతేరుతాయి.
(వ్యాసకర్త: పీఆర్వో, కేయూ)
డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి
98495 77610