రెండున్నరేండ్ల కిందటి టారిఫ్ విధానం కేబుల్ చందాదారుల మీద భారం మోపిందని ట్రాయ్ దిద్దుబాటుకు సిద్ధమైంది. నిరుడు జనవరి ఒకటిన రెండో టారిఫ్ ఆర్డర్ ప్రకటిస్తే బ్రాడ్కాస్టర్లు బొంబాయి హైకోర్టుకెళ్లారు. ఏడాదిన్నరకు జూన్ 30న తీర్పు వచ్చింది. దీని అమలుకు ఆగస్టు 12 వరకుగడువు ఉండగా సుప్రీంకోర్టు స్టే నిరాకరించింది. దీంతో తగ్గింపు ధరలు అమలుచేయాల్సిన తప్పనిసరి పరిస్థితి వచ్చింది. ఆ విధంగా కేబుల్, డీటీహెచ్ చందాదారులకు ఊరట లభించటానికి మార్గం సుగమమైంది.
ట్రాయ్ ఈ ఏడాది జారీచేసిన రెండో టారిఫ్ ఆర్డర్ను పరిశీలిస్తే రెండు భాగాలు కనపడతాయి. మొదటిది కేబుల్ రంగం. రెండోది బ్రాడ్ కాస్టింగ్ రంగం. చందాదారుల కోణంలో చూస్తే, ఉచిత చానల్స్ పరంగానూ, అదనపు టీవీ ఉన్నప్పుడూ ఈ ప్రయోజనాలు పొందవచ్చు. 1.అంతకుముందు నెట్వర్క్ కెపాసిటీ ఫీజు కింద చెల్లించే రూ.130లకు 100 చానల్స్ తీసుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు అదే మొత్తానికి 200 చానల్స్ తీసుకునే వీలుంది. 2.అంతకుముందు ప్రసారభారతి వారి 26 చానల్స్ కూడా 100లోనే కలిపి ఉండేవి. ఇప్పుడు వాటిని 200కు అదనంగా చేర్చారు. 3. రూ. 160 చెల్లిస్తే, 200+26 కు మించి కూడా అపరిమితంగా చానల్స్ ఎంచుకోవచ్చు. 4.ఒక ఇంట్లో ఒకటికి మించి టీవీలు ఉంటే మొదటి టీవీకి రూ.130 నెట్వర్క్ కెపాసిటీ ఫీజు, ఆపైన ఒక్కో టీవీకి రూ.52 వంతున కడితే సరిపోతుంది.
ఇవి చందాదారులకు మేలుచేసేవే. కానీ కేబుల్ పరిశ్రమకు నష్టదాయకం. బ్రాడ్కాస్టర్లు చందాదారులకు రకరకాల బొకేలు అంటగడుతూ ఉంటే ఆ బొకేలోని చానల్స్ అన్నీ ఇవ్వటానికి ఎమ్మెస్వోలు ఇబ్బంది పడాల్సివచ్చేది. ఇంకోవైపు చందాదారులు ఆ బొకే తీసుకోవటం వల్ల వారికున్న 74 చానల్స్ అవకాశంలో వీటిని పోగొట్టుకోవటం వల్ల 100కు మించిపోయి, అదనపు ఫీజు కట్టాలి. ఇప్పుడు అలాంటి ఆదాయం రాదు. పైగా హెడ్ ఎండ్ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవలసి వస్తుంది. ఇన్ని ఉచిత చానల్స్ ఇస్తే క్యారేజ్ ఫీజు తగ్గిపోతుంది. బొకేల కారణంగా చిన్న చానల్స్ కూడా ఇవ్వాల్సి రావటంతో క్యారేజ్ ఫీజు ఆదాయం తగ్గిందని బాధపడుతుంటే ఇప్పుడు ఉచిత చానల్స్ నుంచి క్యారేజ్ ఫీజు వసూలు చేసుకునే అవకాశం సన్నగిల్లింది. క్యారేజ్ ఫీజు కేవలం ఎమ్మెస్వోలు తీసుకుంటారు తప్ప కేబుల్ ఆపరేటర్లకు వాటా రాదు. నెట్వర్క్ కెపాసిటీ ఫీజులో మాత్రం ఎక్కువ వాటా కేబుల్ ఆపరేటర్లదే.
అదనపు టీవీలకు నెట్వర్క్ కెపాసిటీ ఫీజు తగ్గించటం వల్ల ఆదాయం కోల్పోయేది కేబుల్ ఆపరేటర్లే. ఇళ్లలో రెండో టీవీ వల్ల లాభపడేది పే చానల్ వాళ్లే. వారి చందాలో మాత్రం తగ్గింపు లేదు. ఒక ఇంట్లో రెండు టీవీలుంటే అదే సభ్యులు కోరుకున్న కార్యక్రమాలు విడివిడిగా చూసే వీలుంది. అయినా చందా రెండింటికీ చెల్లించాల్సిందే. బ్రాడ్కాస్టర్ల వ్యాపారం పెరగటానికి కేబుల్రంగం మెడలు వంచారు.
ఇక బ్రాడ్ కాస్టర్ల విషయానికొస్తే, ధర నిర్ణయాధికారం చానల్ యాజమాన్యానికి ఉన్నా ఆ చానల్ను బొకేలో పెట్టి ఇవ్వాలంటే గరిష్ఠ చిల్లర ధర రూ.19కు మించకూడదని ట్రాయ్ స్పష్టంచేసింది. బొకేలో ఉన్న చానల్స్ మొత్తం ధరలో 15 శాతం మించి డిస్కౌంట్ ఇవ్వకూడదు. కానీ మద్రాస్ హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా ట్రాయ్ ఆ డిస్కౌంట్ను అమలుచేయలేదు. మార్కెట్ శక్తులకు వదిలేస్తున్నట్టు చెప్పింది. మొత్తానికి బ్రాడ్కాస్టర్లు గరిష్ఠ ధర రూ.19ని వాడుకున్నారు. మొదటి టారిఫ్ ఆర్డర్కు ముందు 5, 6 రూపాయలున్న చానల్స్ కూడా ఒక్కసారిగా 19 వైపు చూశాయి. ఇష్టమొచ్చినట్టు బొకేలు తయారుచేశాయి.
ఈ గందరగోళం మధ్య ఎంపిక ఎలా ఉంటే బాగుంటుందో చందాదారులకు అర్థం కాలేదు. అర్థమయ్యేట్టు చేయటానికి ట్రాయ్ గాని, పంపిణీ సంస్థలు గాని, బ్రాడ్కాస్టర్లు గాని ప్రయత్నించలేదు. పంపిణీ సంస్థలే వినియోగదారుడి స్వేచ్ఛను తమ చేతుల్లోకి తీసుకొని ట్రాయ్ చెప్పిన బెస్ట్ ఫిట్ ప్లాన్ అమలుచేశాయి. కొన్ని సందర్భాల్లో ఆ బొకేలు తమకు అనుకూలంగా ఉండేలా చూడాలని బ్రాడ్కాస్టర్లు తమ సిబ్బంది ద్వారా ఎమ్మెస్వోలకు రకరకాల ఆఫర్లిచ్చారు. వినియోగదారుని అమాయకత్వాన్ని
ఇద్దరూ సొమ్ము చేసుకున్నారు.
ఉచిత చానల్స్ విషయంలోనూ ఎమ్మెస్వోలు తెలివి ఉపయోగించారు. ఉచిత చానల్స్లో స్థానిక చానల్స్ ఎక్కువగా చూపకుండా, చందాదారులు కోరుకుంటున్నారనటానికి ఆధారాలు లేకుండా చేశారు. ఏదైనా చానల్ను కనీసం 20 శాతం మంది కోరుకుంటే క్యారేజ్ ఫీజు వసూలుచేయకుండా చందాదారుకు అందించాలి. కానీ చందాదారు దరఖాస్తును నింపింది ఎమ్మెస్వో/ఆపరేటర్ కాబట్టి వీరు ఈ స్వేచ్ఛను హరించారు. తమ దగ్గర ఖాళీ లేదని, చందాదారులు కోరలేదని చెబుతూ కొన్ని చానల్స్ ఇవ్వకపోవటమో, ఇచ్చినా క్యారేజ్ ఫీజు వసూలు చేయటమో జరుగుతున్నది. మొత్తంగా చూసినప్పుడు చందాదారుల స్వేచ్ఛ బూటకం.
కొత్త టారిఫ్ను బ్రాడ్కాస్టర్లు వ్యతిరేకించటానికి కారణాలు.. 1.బొకేలో పెట్టాలనుకున్న చానల్ గరిష్ఠ చిల్లర ధర రూ.12కు మించకూడదు. ఇప్పటిదాకా ఇది రూ.19 ఉంది. దీనివల్ల బ్రాడ్కాస్టర్ల ఆదాయం 37 శాతం పడిపోతుంది. 2.బొకేలో పెట్టిన చానల్స్ మొత్తం ధరలు కలిపినా, బొకే ధరకు ఒకటిన్నర రెట్లు మించకూడదు. అంటే, ఇష్టమొచ్చినట్టు ధర పెంచి, బొకే ధర తక్కువగా నిర్ణయించి మొత్తం బొకే తీసుకునేట్టు చేయకూడదు. బొకేలో ఉన్న చానల్స్ అలా కార్టే సగటు ధరకు మూడు రెట్లు మించి ఆ బొకేలోని ఏ చానల్ ధర ఉండకూడదు. అయితే, ట్రాయ్ పెట్టిన ఈ నిబంధనను మాత్రం బొంబాయి హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో బ్రాడ్కాస్టర్లకు కొద్దిపాటి ఊరట లభించింది.
బొకేలో పెట్టకుండా ఎంత ధరైనా పెట్టుకునే అవకాశం బ్రాడ్కాస్టర్లకు ఉంది. కానీ, ఎక్కువమంది వాటి జోలికి వెళ్లకపోతే చానల్ అందుబాటు (రీచ్) పడిపోతుంది. రేటింగ్స్ తగ్గి ప్రకటనల ఆదాయం పడిపోతుంది. ఓటీటీ విజృంభిస్తున్న సమయంలో బ్రాడ్కాస్టర్లు ఈ సాహసం చేయలేరు. అందుకే ఇప్పుడు బ్రాడ్ కాస్టర్లకు ఇది కత్తిమీద సాములా మారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే, బ్రాడ్ కాస్టర్లు ఉద్దేశపూర్వకంగా ఒక ట్రక్కుకు సరిపడే డాక్యుమెంట్లు కోర్టుకు తీసుకురావటం పట్ల ఆగస్టు 6న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేయటం కొసమెరుపు. ఇప్పుడు 12 వ తేదీ నాటికి తప్పనిసరిగా కొత్త టారిఫ్ అమలు చేయాల్సి వస్తుంది.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు, మీడియా విశ్లేషకులు)
తోట భావనారాయణ