ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆత్మబంధువుగా అడుగడుగునా ఆదుకుంటున్నారు. పుష్కలంగా సాగునీరు, నిరంతర కరెంటు, సకాలంలో విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి సాయం అందిస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో పల్లెపల్లెనా ధాన్యలక్ష్మి నర్తిస్తున్నది. వ్యవసాయం ప్రణాళికాబద్ధంగా సాగించాలని కేసీఆర్ భావిస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం అధికారాలను కేంద్రీకరించుకుంటున్నదే కానీ, తదనుగుణమైన బాధ్యతను నిర్వర్తించడం లేదు. రైతుల పంటలకు లాభదాయకమైన ధర లభించేలా చేయడం, దేశంలో ఆహార ధరలను స్థిరీకరించడం, ప్రజా పంపిణీ వ్యవస్థకు ధాన్యం అందించడం వంటి లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఎఫ్సీఐని సాధనంగా వాడుకోవడమే లేదు. కేంద్రం పారదర్శకంగా వ్యవహరించడం లేదు. రాష్ర్టాలతో కలుపుగోలుగా ఉంటూ చర్చించడం లేదు.
తెలంగాణ అవతరణ తర్వాత వ్యవసాయరంగ సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషిచేసింది. వ్యవసాయానికి మూలమైన సాగునీరు కోసం బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు, అనుబంధ ప్రాజెక్టులు, కాలువలతో సాగునీటి సమస్యను తీర్చింది. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ జరగడంతోపాటు భూగర్భ జలాలు పెరిగి రాష్ట్రం సస్యశ్యామలమైంది. ఆ క్రమంలోనే రైతుకు అండగా నిలిచేందుకు రైతుబంధు పథకంతో ప్రభుత్వం పెట్టుబడి భారాన్ని తీర్చింది. ఈ విధంగా సాగుకు కావలసిన అన్నిరకాల అవసరాలను సకాలంలో తీరుస్తూ రైతుకు అండగా ఉంటున్నది.
వ్యవసాయానికి మరో మూలాధారం విద్యుత్తు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. దాని కోసం బోరుబావుల దగ్గర రాత్రింబగళ్లు పడిగాపులు కాసేది. నాణ్యత లేని కరెంటుతో మోటార్లు, స్టార్టర్లు కాలిపోయేవి. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా అందిస్తున్నది. దుక్కి దున్నినప్పటి నుంచి అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచుతున్నది. భూసార పరీక్షల ఆధారంగా ఆయా ప్రాంతాలకు అవసరమైన ఎరువులను సరఫరా చేస్తున్నది. ఎవుసానికి విత్తనమే ప్రధానం. విత్తనం బాగుంటేనే పంట బాగుంటుంది, గతంలో విత్తనాల కొరత రైతులను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం విత్తన రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. నాణ్యమైన విత్తనాలను అందించడమే లక్ష్యంగా ముందడుగు వేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో విత్తనాల కోసం రైతులు పడ్డ గోస వర్ణనాతీతం. విత్తనాల కోసం దుకాణాల దగ్గర రోజుల తరబడి నిలుచునే పరిస్థితులుండేవి. దీనికి తోడు నకిలీ విత్తనాల బెడద రైతులను తీవ్రంగా దెబ్బతీసేది. భూమిని నమ్ముకున్న రైతు నకిలీ విత్తనాలతో నిండా మునిగిపోయేవాడు. ఇలా రైతులు నష్టపోతున్నా నాటి ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవరించాయే కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం విత్తనాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. విత్తనాల కొరత అనే మాటే వినిపించకుండా చేసింది.
ప్రతి సీజన్లో ఎన్ని విత్తనాలు అవసరమవుతాయో ముందుగానే అంచనా వేసి వాటిని సమకూరుస్తున్నది. రాష్ట్రంలో ఏటా అన్నిరకాల విత్తనాలు కలిపి సూమారు 25 లక్షల క్వింటాళ్ల వరకు అవసరమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో విత్తనాలను సమకూర్చుతున్నది. సీజన్కు ముందే ఏ జిల్లాలో ఏ రకం విత్తనాలు, ఎంత అవసరమవుతాయో గుర్తించి సరఫరా చేస్తున్నది. దీంతో పాటు నకిలీ విత్తన ముఠాల పీచమణిచి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపింది. నకిలీ విత్తనాల నివారణ కోసం సీజన్కు ముందే విజిలెన్స్, పోలీస్, వ్యవసాయశాఖ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నాసి, నకిలీ విత్తనాలను అరికడుతున్నది. నకిలీ విత్తన ముఠాలపై పీడీ యాక్ట్ అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం ప్రపంచ విత్తన భాండాగారంగా ఎదిగింది. ఇటీవలే ఐరాస అనుబంధ ‘ఆహార, వ్యవసాయ సంస్థ’(ఎఫ్ఏవో) తెలంగాణను ప్రపంచ విత్తన భాండాగారంగా గుర్తించడం గమనార్హం. విత్తనోత్పత్తికి తెలంగాణ ప్రాంత వాతావరణం అనుకూలంగా ఉండటం కలిసొచ్చింది. దీంతో తెలంగాణలో విత్తనరంగం మరింత అభివృద్ధి చెందింది. దాదాపు 400 జాతీయ, అంతర్జాతీయస్థాయి విత్తన కంపెనీలు, ప్రాసెసింగ్ ప్లాంట్లు హైదరాబాద్ చుట్టుపకల నెలకొని ఉన్నాయి. దేశ విత్తన అవసరాలకు కావలసిన దాదాపు 60 శాతం విత్తనాలు తెలంగాణ నుంచే సరఫరా అవుతున్నాయి. హైదరాబాద్లో అధునాతన విత్తన ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉండటం వల్ల పది రాష్ర్టాల్లో పండిన విత్తనాలు కూడా మన దగ్గర ప్రాసెసింగ్, ప్యాకింగ్తో ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
మూల విత్తన తయారీలో రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, జాతీయ, అంతర్జాతీయ ICAR వ్యవసాయ పరిశోధన సంస్థలు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, విత్తన ధ్రువీకరణ సంస్థ, వ్యవసాయశాఖ ముఖ్య భాగస్వాములుగా ఉన్నాయి. విత్తనాభివృద్ధి సంస్థ 3-8 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నది. విత్తన ధ్రువీకరణ సంస్థ 18-20 లక్షల క్వింటాళ్ళ విత్తనాలను ధ్రువీకరించి రాష్ట్ర రైతులకు అందిస్తున్నది. ఇతర రాష్ట్రాలకు, దేశాలకు విత్తనాలు సరఫరా చేస్తున్నది. విత్తనాభివృద్ధిలో 50 వేల మంది నైపుణ్య కార్మికులకు 2 లక్షల మంది నైపుణ్యం లేని కార్మికులకు, 50 వేల మంది ఇతర కార్మికులకు ఉపాధి లభిస్తున్నది. ఈ విధంగా రాష్ట్రంలో విత్తనరంగ అభివృద్ధి రైతుల కష్టాలను తీర్చింది. దీనివెనుక రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఎనలేనిది. ఎరువులు, చీడపీడల నుంచి పంటల రక్షణ కోసం క్రిమిసంహారక మందులను ప్రభుత్వం అందుబాటులో ఉంచుతున్నది. దీంతో పంట దిగుబడి పెరిగింది.
పంట కోతల సమయానికి అవసరమైన వరికోత యంత్రాలను అందుబాటులో ఉండేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. విస్తారంగా పెరిగిన సాగుతో కూలీల కొరత తీవ్రమైంది. ఇతర ప్రాంతాల నుంచి కూలీలు మన ప్రాంతానికి వచ్చినా అవసరమైన మేర అందుబాటులో లేని స్థితి. దీంతో వరికోత యంత్రాల వాడకాన్ని ప్రోత్సహించింది. కరోనా సమయంలో కూడా అంతా లాక్డౌన్ ఉన్నా వ్యవసాయ అనుబంధ యంత్రాలను బాగు చేయటం కోసం మెకానిక్, రిపేరింగ్ షాపులను తెరిచి ఉంచేవిధంగా చర్యలు తీసుకున్నది.
తెలంగాణ చరిత్రలో మున్నెన్నడూ ఎరుగని పంట దిగుబడి వచ్చింది. వరి దిగుబడిలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానం దక్కించుకున్నది. దేశానికే ధాన్యాగారంగా మారింది. ఈ పంటను ప్రభుత్వమే గ్రామాల్లోని పంటకల్లాల దగ్గరే కొనుగోలు చేసింది. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి ప్రతిగింజనూ కొనుగోలు చేసి, వారం రోజుల లోపే రైతుల అకౌంట్లో డబ్బులు జమచేసింది. కరోనా కష్టకాలంలో కూడా ధాన్యాన్నంతా కొని తెలంగాణ ప్రభుత్వం రైతు రక్షక ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నది.
ఇలా అన్ని దశల్లో రైతుకు అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కనీస నైతిక బాధ్యతగా కేంద్రం చేయూతనందించాలి. ధాన్య ఉత్పత్తిని ఆహ్వానిస్తూ ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలి. కానీ మోదీ ప్రభుత్వం వడ్లను కొనబోమని చెప్పి ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న తెలంగాణ రైతుల బతుకుల్లో చీకట్లు నింపుతున్నది. ఏ సీజన్ పంట కొంటారో, ఎంత కొంటారో కూడా కేంద్రం చెప్పకుండా రైతులను అయోమయంలో పడేయటం గర్హనీయం.
డా.కె.కేశవులు