బీజేపీ నాయకులు బానిస రాజకీయాలకు ప్రతినిధులుగా నిలువదలుచుకున్నారా లేక స్వేచ్ఛా భారతాన్ని కోరుతున్నారా అనేది స్పష్టం చేయాలి. జాతీయ
పతాకావిష్కరణను బహిష్కరించాలంటూ పిలుపు ఇచ్చిన నర్సింఘానంద్ ఉన్మాద వ్యాఖ్యలతో ప్రధాని మోదీ ఏకీభవిస్తున్నారా? లేక ఆ వ్యాఖ్యలను
ఖండిస్తున్నారా? గుజరాత్ తోపాటు బీజేపీ పాలిత రాష్ర్టాలు ఈ వ్యాఖ్యలను సమర్థిస్తున్నాయా? కేంద్రంలో, కొన్ని రాష్ర్టాలలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ విద్రోహకర వ్యాఖ్యలను ఖండించడం లేదెందుకు? నర్సింఘానంద్ పిలుపుతో ఏకాభిప్రాయం లేకపోతే అతడిని అరెస్టు చేయడం లేదెందుకు? స్వాతంత్య్ర వీరుల త్యాగాలను, ఆకాంక్షలను వీరు గౌరవించుకోదలుచుకోలేదా? దేశాన్ని మళ్ళీ వలస పాలనలోకి మళ్ళించదలుచుకుంటే, దేశ ప్రజలు అంగీకరించరు. తాము అనేక త్యాగాలు చేసి సాధించుకున్న స్వాతంత్య్రాన్ని కాపాడుకుంటారు. స్వాతంత్య్ర విలువలకు ప్రతీకయైన జాతీయ పతాకాన్ని గౌరవిస్తారు.
దేశ స్వాతంత్య్రం సందర్భంగా పతాక బహిష్కరణకు పిలుపా! అయినా అది బీజేపీ పాలకులకు వీనుల విందుగా ఉన్నట్టున్నది. బహిష్కరణ పిలుపు ఇచ్చిన ఉన్మాదిపై చర్యలు తీసుకోవడం లేదు. దేశ ప్రజలు ఇంటింటా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తుంటే ఉత్తర ప్రదేశ్కు చెందిన నర్సింఘానంద గిరి జాతీయ పతాకావిష్కరణను బహిష్కరించాలంటూ పిలుపు ఇచ్చాడు! అతడి వ్యాఖ్యల వీడియో వీడియో సోషల్ మీడియా ద్వారా ప్రచారమైంది. అయినా బీజేపీ పెద్దలకు అతడిపై చర్య తీసుకోవడానికి మనస్కరించడం లేదు. నర్సింఘానంద గిరిపై ఇప్పటికే విద్వేష ప్రసంగాలు చేసిన కేసులు ఉన్నాయి. ఇప్పుడు జాతీయ పతాకావిష్కరణను చావు బతుకుల సమస్యగా చిత్రీకరించాడు. ఇందుకు కారణాలు ఏమి చెప్పినా ఈ నర్సింఘానంద్ వం టి మతవాదులకు జాతీయ జెండా పట్ల, స్వాతంత్య్రోద్య మం పైనా మొదటి నుంచి వైముఖ్యం ఉందనేది చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుంది. ఇటీవలి వరకు మతశక్తులు జాతీయ జెండాను ఎగురవేయడానికి కూడా సిద్ధపడలేదు. ఇప్పుడు పతాకావిష్కరణకు వ్యతిరేకంగా పిలుపు ఇవ్వడం కూడా ఇదే దేశ వ్యతిరేక భావజాలాన్ని సూచిస్తున్నది. వీరు వ్యతిరేకించేది కేవలం జెండాను కాదు. జాతీయోద్యమ స్ఫూర్తి ని, స్వాతంత్య్ర యోధుల ఆకాంక్షలను వీరు తిరస్కరిస్తున్నారు. స్వాతంత్య్రోద్యమం ఆవిష్కరించిన ఆధునిక విలువలను, ప్రజాస్వామిక భావనలను వీరు దెబ్బతీయ తలుచుకున్నారు. అందులో భాగంగానే జాతీయ పతాకావిష్కరణను బహిష్కరించాలనే పిలుపు ఇవ్వడానికి తెగించారు.
జాతీయ పతాకం రంగులద్దిన గుడ్డ తునుక కాదు. దేశ ప్రజల ఆకాంక్షలకు, స్వాతంతంత్య్రోద్యమ విలువలకు ప్రతీక. స్వాతంత్య్ర కాంక్ష బలపడే కొద్దీ పతాక రూపకల్పనపై ఆసక్తి పెరిగింది. స్పానిష్ పెత్తనం నుంచి డచ్ ప్రజలు స్వతంత్రులై ఎగురవేసుకున్న మువ్వన్నెల పతాకం, ఫ్రెంచి విప్లవ బావుటా – ఇట్లా ప్రతి అంతర్జాతీయ చారిత్రక సన్నివేశం భారతీయుల హృదయాన్ని తాకింది. ఐరిష్ పోరాటమూ స్ఫూర్తినిచ్చింది. 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా భారతీయులు సమైక్యంగా ఉద్యమించారు. బ్రిటిష్ వారి విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటారు. ఆ క్రమంలో వందేమాతర అక్షరాలతో మూడు రంగులతో రూపుదిద్దుకున్నదొక పతాకం. నేటి పతాకానికి తొలి రూపం. జర్మనీలోని స్టట్గర్ట్లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్టు సమ్మేళనంలో 1907 ఆగస్టు 22న భారత స్వాతంత్య్ర పతాకంగా ఎగురవేశారు. దేశ పతాకమంటే సౌహార్దతకు, స్వాతంత్య్ర కాంక్షకు ప్రతీకనే తప్ప విద్వేషాలకు తావు లేదు. వందేమాతరం అనే నినాదం అంటే బ్రిటిష్ వారి విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశమంతా ముక్తకంఠంతో చేసిన సింహ గర్జన.
స్వాతంత్య్రోద్యమ చర్చలు పరిశీలిస్తే జాతీయ పతాక స్ఫూర్తి ఎంతటిదో అర్థమవుతుంది. వలస పాలకులు భారత సమాజాన్ని మత ప్రాతిపదికన విభజించాలనే ఎత్తుగడలు వేసినప్పుడు అందుకు ప్రతిస్పందనగా ఎరుపు (తరువాత కాషాయంగా మారింది), ఆకుపచ్చ రంగులు ఐక్యతకు చిహ్నంగా పతాకంపై చోటు చేసుకున్నాయి. ఆ తరువాత ఇతర మతాలకు ప్రతీకగా తెలుపు రంగును చేర్చాలని గాంధీ భావించారు. కానీ జాతీయోద్యమం మత విభేదాలకు అతీతంగా ఎదిగి అనేక ఆధునిక భావజాలాలు, ప్రగతి శీల భావనలు ముందుకు వచ్చిన దశలో ఈ రంగులు కొన్ని విలువలకు చిహ్నంగా మారిపోయాయి. అందుకే భిన్న మతాలకు గుర్తింపుగా రంగులు ఉండాలని భావించిన గాంధీయే తరువాత విలువలకు ప్రతీకగా రంగులను అభివర్ణించారు. జలియన్వాలా బాగ్ ఊచకోత అమరవీరులను స్మరించుకుంటూ 1923 ఏప్రిల్ 13న నాగ్పూర్లో కాంగ్రెస్ కార్యకర్తలు జరిపిన ఊరేగింపులో మొదటిసారిగా పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జెండా ఉద్యమాలు దేశమంతా చెలరేగిపోయాయి. జెండాలు పట్టుకున్నందుకు అనేక మంది అరెస్టయ్యారు. దీంతో జెండాలను ఎగురవేయవద్దని బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సత్యాగ్రహమైనా, ఖిలాఫత్ ఉద్యమమైనా జెండా ఒక ఉద్యమ సంకేతంగా మారింది. బ్రిటిష్ పాలకులు జెండాలు ఎగురనీయవద్దంటూ స్థానిక ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేశారు. స్వరాజ్య పతాకం కింద రైతులు, కూలీలు, విద్యార్థులు మొదలైన సకల వర్గాలు సంఘటితంగా సాగాయి. మహిళలను స్వాతంత్య్రోద్యమంలో భాగస్వాములను చేయడంలో పతాకం పాత్ర ఉన్నది. చరఖా, ఖాదీ వస్త్రం అనేవి స్వాతంత్య్రోద్యమంలో అవిభాజ్య భాగమయ్యాయి. స్వాతంత్య్ర కాంక్షలో భాగంగా ఇంటింటా చరఖాలు ఆడాయి. దీనినెవరూ నిషేధించడానికి వీలు లేదు. మహిళలు చరఖా పట్ల ఆసక్తి చూపారు. మువ్వన్నెల పతాకం రూపొందిన తరువాత ఉద్యమంలో మహిళా భాగస్వామ్యం భారీగా పెరిగింది. ఒక పతాకం అంటే ఉమ్మడి ఆకాంక్ష, సంఘటిత శక్తి, సమైక్య ఉద్యమం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మూడు రంగులైనా, అశోక చక్రమైనా శాంతికి, ధర్మానికి, త్యాగనిరతికి, సౌభాగ్యానికి చిహ్నంగా మారాయి. పతాకం ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా రూపొందింది. 75 ఏండ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే, ఆనాటి విలువలకు, ఆకాంక్షలకు కట్టుబడి ఉంటున్నామని అర్థం. వలసవాద భావజాలం నుంచి బయటపడి స్వేచ్ఛగా ఆలోచిస్తున్నామని చాటుకోవడం. పరాయి బతుకులనుంచి విముక్తి పొంది స్వేచ్ఛగా బతుకుదామని ప్రతినబూనడం.
‘మన మనస్సు స్వేచ్ఛగా ఉంటేనే అది నిజమైన స్వేచ్ఛ. మనసు స్వేచ్ఛగా లేకపోతే సంకెళ్ళు లేనప్పటికీ బానిసే తప్ప స్వేచ్ఛా మానవుడు కాదు. మనసు స్వేచ్ఛగా లేకపోతే – జైలులో లేనప్పటికీ ఖైదీయే తప్ప స్వేచ్ఛా మానవుడు కాదు. మనసు స్వేచ్ఛగా లేకపోతే – బతికి ఉన్నప్పటికీ మృతప్రాయుడే. మనసు స్వేచ్ఛగా ఉండటమే మనిషి ఉనికికి రుజువు’ అన్నాడు అంబేద్కర్. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అయిన తరువాత కూడా ఇంకా బ్రిటిష్ పాలకులు దట్టించిన విభజన రాజకీయాలను, విద్వేష బూజు భావనలను వదిలించుకోలేక, స్వేచ్ఛగా ఆలోచించలేక పోతున్నారంటే – అటువంటివారిని బానిసలు, ఖైదీలుగా, మృతప్రాయులుగా భావించవలసి ఉంటుంది.
– భూషణ్