edit
ట్రింగ్ ట్రింగ్..
‘రేవంత్ రెడ్డేనా సార్?’
‘అవును, నేనే చెప్పయ్యా..’
‘నిన్నటి నుంచి తిరుగుతున్న, గంజాయి ఎక్కడా దొరకతలేదు సార్..?’
‘దానికి నేను ఏం జెయ్యాలి?’
‘మొన్న స్టేట్మెంట్ ఇచ్చిండ్రు కదా సార్ మీరు. హైదరాబాద్లో ఏ గల్లీకెళ్లినా డ్రగ్స్, గంజాయి గుప్పుమంటుందన్నారు కదా?’
‘అవును చెప్పినా…’
‘మీకు గుప్పున వాసన వచ్చిన గల్లీ అడ్రస్ ఏదో చెప్తే పోయి తెచ్చుకుంటా.. ప్లీజ్ చెప్పండి సార్…’ ఫోన్ కట్… ‘నా నంబర్ వానికెవ్వడు ఇచ్చిండ్రా?!’
నీతి: రాజకీయ నాయకులు అడ్డగోలుగా స్టేట్మెంట్లు ఇస్తే, ఇలాంటి ఫోన్లే వస్తాయి. తస్మాత్ జాగ్రత్త..!
ఢిల్లీలో జీ-23 నేతలు అక్కడ గులాంనబీ ఆజాద్ ఇంట్లో భేటీ అయిన సమయంలోనే సరిగ్గా ఇక్కడ (హైదరాబాద్) జీ-13 నేతలు మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. జీ-23 నేతల భేటీని టీవీలో లైవ్లో చూస్తూ, ‘వాళ్ల సంగతి మనకెందుకు కానీ.. మనమేం చేద్దాం చెప్పండ’ని హన్మంతన్న అడిగారు. ‘వాళ్లు అక్కడ ఏం జేస్తుండ్రో… ఇక్కడ మనం అదే చేద్దామ’ని సీనియర్ నాయకుడు ఒకరన్నారు. అర్థంగాక మిగతావాళ్లు నోళ్లు వెళ్లబెట్టారు. ‘అదే అన్నా నేను చెప్పేది.. అక్కడ వాళ్లు రాహుల్గాంధీని తప్పుకోమంటున్నారు.., ఇక్కడ మనం రేవంత్రెడ్డిని వద్దంటున్నాం అంతే తేడా’ అని సదరు నేత వివరించినట్టు సాగిన ఈ ముచ్చట గాంధీభవన్ దాకా పాకింది. ఢిల్లీలో కాంగ్రెస్ అసమ్మతీయుల జట్టును జీ-23గా పిలుస్తుండగా… ఇక్కడి అసమ్మతి నేతలకు జీ-13గా గాంధీభవన్లో పేరు ఖాయం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి అసమ్మతి సెగ రోజురోజుకు ఎక్కవ కావడంతో చివరికి ఆయనే రంగంలోకి దిగారు. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో రంగంలోకి దిగక తప్పలేదని పార్టీ వర్గాలంటున్నాయి. అసమ్మతీయుల వెనుక ఉండి నడిపించేది ఒకరిద్దరు పార్టీ నాయకులేనని నిర్ధారణ అయిందంట. అసమ్మతి పొగబెట్టిన నాయకులంతా ఇటీవల ఒక వేదిక మీద ఉండటంతో వారివైపు చూస్తూ… ‘అయ్యా, నేను సీఎం అభ్యర్థిని కాదు, కాబోను కూడా. సీఎంను చేసేటోడ్నే తప్ప.. సీఎం అయ్యేటోడ్ని కాద’ని చేతులెత్తి దండం పెట్టి మరీ వేడుకుంటున్నారట. నేను సీఎం క్యాండిడేట్ను అవుతానేమోనన్న భయంతో అసమ్మతి కుంపటి రాజేసిన నాయకులకు పరోక్షంగా సంకేతం ఇస్తేనైనా చల్లబడుతారని ఇలా స్పష్టంగా చెప్పాల్సి వచ్చిందని బండి తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలిసింది.
– వెల్జాల