ఇటీవల వచ్చిన ఒక వార్త రాష్ట్ర ప్రజల్లో సంతోషాన్ని కలిగించింది. హైదరాబాద్ సంస్థానానికి చెందిన నాగుపాము ఆకృతిలో ఉన్న అద్భుతమైన చెక్కడాల సౌందర్యం గల నిజాం అలంకార కత్తి (తల్వార్) తిరిగి మన దేశానికి చేరుకోనున్నదనే వార్త అది.
నిజాం రాజరికానికి చెందిన 14వ శతాబ్దపు ఈ ఉత్సవ ఖడ్గం 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ జనరల్కు చేరింది. ఈ కత్తిని వేలం పాటలో బ్రిటిష్ జనరల్ కొనుగోలు చేశారనే వార్త కూడా ఉన్నది. హైదరాబాద్ నుంచి విదేశాలకు తరలిన లేదా విక్రయించబడిన ఈ కత్తి తిరిగి మన దేశానికి రావడానికి సిద్ధంగా ఉన్నది. బ్రిటన్లోని సుప్రసిద్ధ గ్లాస్గో మ్యూజియాలను నిర్వహించే గ్లాస్గో లైఫ్ సంస్థ, దేశానికి చెందిన ఏడు పురాతన వస్తువులను తిరిగి అందజేస్తున్నామని ప్రకటించింది. ఈ ఏడు వస్తువుల్లో నిజాంకు చెందిన కత్తి ఒకటి.
1724-1948 వరకు దక్కన్ రాజ్యాన్ని పాలించిన అసఫ్జాహీలు, దేశంలో ఉన్న 500 పైచిలుకు సంస్థానాల్లో అత్యంత ధనవంతులు. ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా పేరుపొందిన నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ వద్ద, తాను హైదరాబాద్ సంస్థానం నుంచి దిగిపోయేటప్పుడు, 6 వేల రకాల భిన్న డిజైన్లకు చెందిన అత్యంత విలువైన బంగారు ఆభరణాలుండేవట. వీటిలో 3 శాతం అంటే, 173 ఆభరణాలు మాత్రమే భారత ప్రభుత్వం గతంలో సేకరించి ఆర్బీఐ అధీనంలో ఉంచింది. వీటిలో ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద వజ్రమైన 185 క్యారెట్ల జాకబ్ డైమండ్ కూడా ఉన్నది.
1951లో నిజాం తన కుటుంబసభ్యులకు, ఛారిటీ కార్యక్రమాల నిర్వహణ కోసం 54 ట్రస్టులను ఏర్పాటుచేశారు. 1952లో 144 బంగారు, వజ్రాల ఆభరణాలతో కలిపి నిజాం జ్యువెలరీ ట్రస్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. నిజాం జ్యువెలరీ ట్రస్ట్ అధీనంలో ఉన్న ఆభరణాల్లో జాకబ్ డైమండ్తోపాటు, అనేక దేశాల నుంచి సేకరించిన ఆభరణాలు, కాంబోడియన్ మరకతాలు (పచ్చలు), బర్మాకు చెందిన కెంపులు, మేలురకపు ముత్యాలున్నాయి. నిజాం నివాసమైన కింగ్ కోఠిలో బకెట్ల కొద్దీ నాణ్యమైన ముత్యాలుండేవని అప్పట్లో నిజాం వద్ద జ్యువెలర్గా పనిచేసిన దినేష్ షా-గాజ్డార్ వెల్లడించాడు.
గ్లాస్గో లైఫ్ మ్యూజియం డాక్యుమెంటేషన్ ప్రకారం.. ఈ కత్తిని 1896-1911 మధ్యకాలంలో హైదరాబాద్ నిజాంగా ఉన్న 6వ అసఫ్ జా మహబూబ్ అలీఖాన్ ఢిల్లీ లేదా ఇంపీరియల్ దర్బార్లో 1903లో భారత చక్రవర్తిగా పదవీ స్వీకారం చేసిన కింగ్ ఎడ్వర్డ్ 7, క్వీన్ అలెగ్జాండ్రాల గౌరవార్థం ప్రదర్శించారు. మహబూబ్ అలీఖాన్ వద్ద ఉన్న ప్రధాని మహారాజా కిషన్ పెర్షాద్ దాన్ని ఎలా విక్రయించారనేది మిస్టరీగా మిగిలిపోయింది. అతను కత్తిని బ్రిటిష్ అధికారికి బహుమతిగా ఇచ్చి ఉండవచ్చనే అభిప్రాయం కూడా ఉన్నది. ఏదేమైనా, ఈ అలంకార సర్ప నమూనా తల్వార్ (కత్తి) తిరిగి భారత్కు అప్పగించనున్నట్టు గ్లాస్గో లైఫ్ మ్యూజియం అధికారులు ప్రకటించడంతో హైదరాబాదీల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
(వ్యాసకర్త: కన్నెకంటి వెంకటరమణ , 98499 05900, జాయింట్ డైరెక్టర్, సమాచార,పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్)