లాభాల బాటలో నడుస్తున్న సింగరేణిని ప్రైవేటు పరం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుటిల యత్నం చేస్తున్నది. సింగరేణిలోని నాలుగు బ్లాకులను వేలం వేసి కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కుట్రకు తెరలేపింది. దీన్ని సింగరేణి కార్మికులు, టీబీజీకేఎస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేటీకరణ నిలిపివేయాలని ఆందొళనలు చేస్తున్నారు. మోదీ సర్కార్ వెనక్కి తగ్గేదాకా పోరాడుతామని హెచ్చరిస్తున్నారు.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేయటం పనిగా పెట్టుకున్నది. లాభాల్లో ఉన్న వాటిని కూడా కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. అందులో భాగంగానే ఇప్పుడు మోదీ కన్ను లాభాల్లో ఉన్న సింగరేణిపై పడింది. తెలంగాణకే మణిహారమైన సింగరేణిని తొలుత నాలుగు బ్లాకుల వేలంతో మొదలు పెట్టి క్రమేపీ సింగరేణి సంస్థ మొత్తాన్ని ప్రైవేటీకరించే పనికి పూనుకున్నది. వచ్చే ఐదేండ్లలో 12 కొత్త బొగ్గు బావులను ప్రారంభించుకొని, 100 మిలియన్ టన్నులకు బొగ్గు ఉత్పత్తి స్థాయికి చేరనున్న పరిస్థితుల్లో, కేకే-6 అండర్ గ్రౌండ్ గని, శ్రావణపల్లి ఓసీ బ్లాక్, సత్తుపల్లి వద్ద గల జేవీఆర్ ఓసీ-3, కోయగూడెం ఓసీ-3 బ్లాకులను వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించటం గర్హనీయం.
సింగరేణి ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ కేంద్రానికి పలుసార్లు లేఖ రాసినా, కేంద్ర బొగ్గ మంత్రి త్వశాఖకు విన్నవించినా పట్టించుకోకపోవటం శోచనీయం. పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ ఎంపీలు నిలదీసినా, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసినా కేంద్రం పెడచెవిన పెడుతున్నది. సింగరేణి కార్మికులు సమ్మెకు దిగినా మొండివైఖరి మార్చుకోకపోవటం మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాన్ని చాటుతున్నది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచీ తెలంగాణ రాష్ట్రంపై కక్షతో వ్యవహరిస్తున్నది. దేశంలోనే అగ్రగామిగా ఉన్న సింగరేణి సంస్థ నుంచి 4 బొగ్గు బ్లాకులను వేలం వేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన ఏ ఒక్క హామీని కూడా కేంద్రం నెరవేర్చలేదు. ఏ రంగంలోనూ రాష్ర్టానికి ఒక్క చిల్లిగవ్వ ఇచ్చిన పాపాన పోలేదు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తరుణంలో తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి సంస్థను నష్టాల బాట పట్టించి, ప్రైవేటీకరణ పేరుతో గనులను వేలంవేసి, సంస్థ మనుగడనే ప్రశ్నార్థకంగా చేసే పైశాచిక చర్య మోదీ ప్రభుత్వం చేస్తున్నది.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కృషితో గడిచిన ఏడేండ్లలో 16 వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. సింగరేణి ప్రైవేటీకరణ జరిగితే ఇకపై కారుణ్య నియామకాలుండవు. పరోక్షంగా సింగరేణిపై ఆధారపడిన వారిపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. అనుబంధ సంస్థ అయిన సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి, రాష్ట్రంలోని రెండువేలకు పైగా పరిశ్రమలకు బొగ్గును అందిస్తూ అండగా నిలుస్తున్నది సింగరేణి. అలాంటి సంస్థను నిర్వీర్యం చేయడంతో రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని కూడా దెబ్బతీసే దుర్మార్గ ఆలోచనకు మోదీ ప్రభుత్వం పూనుకున్నది.
సింగరేణి సంస్థ గత ఏడేండ్లలో 450 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నుంచి 670 లక్షల టన్నులకు ఎదిగింది. అమ్మకాలు, లాభాలు, అభివృద్ధిలో సింగరేణి సంస్థ గణనీయమైన వృద్ధి సాధించింది. సింగరేణి ప్రైవేటు పరం అయితే అనేక విధాలుగా కార్మికులు, రాష్ట్రం నష్టపోవాల్సి వస్తుంది. కార్మికుల ఉద్యోగపరమైన రక్షణ కరువవుతుంది. పర్యావరణానికి ప్రైవేట్ కంపెనీ లు ప్రాధాన్యత ఇవ్వవు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా పాటించరు. కొత్త గనులు రావు. వారసత్వపు ఉద్యోగాలు ఉండవు. కార్మికులకు న్యాయంగా అందవలసిన హక్కులు, బోనస్లు, అలవెన్స్లకు గండి కొడతారు.దేశ సంపద ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే వారు మాత్రమే అభివృద్ధి చెందుతారు. కార్మిక సోదరుల గురించి కొట్లాడే కార్మిక సంఘాల హక్కులను కాలరాస్తారు.
133 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రఉన్న సింగరేణిలో 4 బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేసే వరకూ కార్మికులు పోరా టం చేయటానికి సిద్ధమయ్యారు. బొగ్గు బ్లాక్ల వేలాన్ని అడ్డుకునేందుకు కార్యాచరణ ప్రణాళికతో ముందుకుపోతున్నారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 2న అన్ని గనుల వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనాలు, శవయాత్రలు నిర్వహించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి ఉద్యోగులు, కార్మికులు సంతకాల సేకరణ చేపట్టారు. ‘బీజేపీ హటావో.. సింగరేణి బచావో..’ అంటూ నినదిస్తున్నారు. బొగ్గుగనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ జీఎం కార్యాలయాల ఎదుట ప్రజల, కార్మిక ప్రతినిధులుగా ఎమ్మెల్యేలు దీక్షలు చేపడుతున్నారు. సింగరేణి సంస్థ రక్షణ కోసం సుదీర్ఘపోరాటంతో, ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని కార్మికులు ప్రతినబూనుతున్నారు. వారి పోరాటానికి యావత్ తెలంగాణ తోడుగా నిలువాలి. మన కొంగుబంగారం సింగరేణిని కేంద్రం కబంధహస్తాల నుంచి కాపాడుకోవాలి.
-కొమ్మెర రామమూర్తి