మత సామరస్యానికి ప్రతీక అయిన తెలంగాణ నుంచి సామూహిక జాతీయ గీతాలాపన జరగటంలో మళ్లొక్కసారి మన జాతీయ సమైక్యతను చాటి చెప్పినట్లవుతుంది. బడిలో, గనిలో, కార్ఖానాల్లో, యంత్రాలను నడిపే శ్రమజీవుల నెత్తుటి నరాలు, చెలకల్లో, చేనుల్లో, అడవుల్లో, మైదానాల్లో, అంతస్తుల ఆకాశహర్మ్యాల సౌధాలలో, గృహాల్లో, సామూహిక జనసాంద్రత తిరిగే రోడ్లు, వేగంగా నడిచే కార్లు, బస్సులు, లారీలు, పలు వాహనాలు, హైదరాబాద్ నగరంలో నడిచే మెట్రో రైలు, సిటీ బస్సు ఎక్కడికక్కడ నిర్ధారించిన సమయానికి- ఒక్కసారిగా సామూహికంగా ఎక్కడివారక్కడ సామూహిక జాతీయ గీతాలాపన చేస్తారు.
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ నేలంతా పులకరించే అపురూపమైన ఆవిష్కరణ జరగబోవటం మరువలేనిది. దేశం కోసం త్యాగం చేసిన త్యాగధనులను స్మరించుకుంటూ, ఆ సమరయోధుల ఆకాంక్షల సాక్షిగా మనందరం కలిసి ఒక్కటిగా ఉన్నాం. దేశమంతా ఒక్కటిగా ఉంటాం. భిన్నమతాల, భిన్నకులాల, భిన్నభాషల, భిన్న ఆలోచనల భావాల సమూహాలన్నీ ఒక్కటిగా కలగలిసి మతసామరస్య మహాక్షేత్రంగా విలసిల్లుతున్నామని చాటడానికి సామూహిక జాతీయ గీతాలాపన ఒక ప్రతీకగా నిలుస్తుంది. ఇందులో అందరం కలిసి పాల్గొందాం. మన విభిన్నమైన కళలు, సంస్కృతులు, భాషలు, యాసలు, కట్టుబాట్లు, సంప్రదాయాలు, నమ్మకాలు, అన్నింటిని కలగలుపుకొని మనమంతా ఒకటేననే ఐకమత్యానికి ప్రతీకలుగా నిలుద్దాం. మనుషులంతా ఒక్కటేనని చాటిచెబుదాం. ఎవరెవరు ఏయే భాషలు మాట్లాడుతున్నా, ఎవరెవరి ఆహారపు అలవాట్లు, ఎట్లెట్ల ఉన్నా, ఎవరెవరి వేషధారణలు విభిన్నంగా ఉన్నా, విభిన్న సంస్కృతుల, కళల ఐకమత్య చిహ్నంగా సామూహిక గీతాలాపన చేసుకోవటం మన జాతికి జవం, జీవం, బలంగా నిలిచిపోతుంది. అడవి పొత్తిళ్లలోని గిరిజన, గోండు, చెంచు తదితరాల ఆదివాసీ కంఠాల నుంచి, పచ్చటి పల్లెలు, జనారణ్యాలైన మహానగరాల నుంచి, తెలంగాణలోని భూభాగమంతా సామూహిక కంఠంగా మారి జాతీయ గీతాలాపన చేయబోతున్నది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల కోట్ల గొంతుల సామూహిక గీతాలాపనగా ఒకే ఒక సమయంలో మహోన్నత సామూహిక రాగాలాపన చేయబోతున్నది.
వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఎస్పీ, సీపీల సమన్వయంతో సీఎం కేసీఆర్ సామూహిక గీతాలాపనకు పిలుపునిచ్చారు. అదేరోజు జిల్లాలో కవి సమ్మేళనాలు జరపాలని నిర్ణయించారు. అందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారుల భాగస్వామ్యంతో కవి సమ్మేళనాలు జరిపి వజ్రోత్సవ స్ఫూర్తిని 33 జిల్లాల్లో చాటిచెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సామూహిక జాతీయ గీతాలాపనకు ప్రజలందరూ సామూహిక భాగస్వామ్యంతో కొనసాగించాలి. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల్లో సుమారు 80 లక్షలకు పైగా విద్యారంగానికి సంబంధించిన విద్యార్ధులున్నారు. వీళ్లందరి ఉత్సాహవంతమైన పాత్ర కూడా ఈ అంశానికి కొత్త శోభనిస్తుంది.
సామూహిక జాతీయ గీతాలాపనను చేయటమంటే మనమంతా కలసిమెలసి వర్ధిల్లే లౌకికతత్వ భారత్ను చెక్కు చెదరనీయకుండా చూడటం కోసం ప్రతిన చేయటమే అవుతుంది. దేశ స్వావలంబన ఆర్థికాభివృద్ధి, యువతలో దేశ పునర్నిర్మాణం, మత సామరస్యాన్ని పకడ్బందీగా పునః ప్రతిష్ఠించటం చేయాలి. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధిస్తూ బహుళ జాతులతో, బహుళ జనుల సమ్మేళనంతో దేశం ఐకమత్యంగా వర్ధిల్లే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జాతీయ గీతాలాపనను చేయాలి. భారతీయులంతా ఒక్కటే మమ్ముల్ని ఎవరూ వేరు చేయలేరని మన ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పే విధంగా స్ఫూర్తిదాయకంగా సామూహిక జాతీయ గీతాలాపన చేయాలి. ఇది తెలంగాణ నేలపై ఉన్న ప్రతి ఒక్కరూ కడు నిబద్ధతతో క్రమశిక్షణతో దేశభక్తిని గుండెల నిండా నింపుకొని ఈ మట్టి సాక్షిగా మేమంతా ఒక్కటే, భారతీయులమంతా సహోదరులమని చాటిచెప్పే కోట్లాది కంఠాల సామూహిక జాతి స్వరంగా ఈ జాతీయ గీతాలాపన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి సామూహిక ఐక్యతా గానం తెలంగాణ అంతా మార్మోగాలి.
రాజకీయాలకు అతీతంగా విమర్శలకు దిగకుండా మనమంతా ఒక్కటేనన్న స్ఫూర్తిని చాటేవిధంగా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనాలి. ప్రతి కుటుంబం, ప్రతి వాకిలి ఇందులో భాగస్వాములు కావాలి. రహదారులపై వాహనాలలో ఉన్నట్టయితే నిలిపివేసి, నిర్దేశించిన సమయంలో 52 సెకన్లు జాతీయ గీతాలాపన చేయాలి.
మనపై నుంచి మేఘపథంలో నడిచే మెట్రోరైల్ కూడా నిర్దేశించిన సమయానికి ఆగి స్టేషన్ల పేరు చెప్పే మెట్రో మైకులన్నీ జాతీయ గీతాలాపన చేస్తాయి. ప్రయాణీకులు జాతీయ గీతాలాపన చేస్తారు. విమానాశ్రయాల్లో నిర్దేశించిన సమయానికి భిన్నభాషల వాళ్లు, విభిన్న దేశాల వాళ్లు సామూహిక జాతీయగీతాలాపనలో పాల్గొనేటట్లు ఇండియన్ ఎయిర్ లైన్స్ హైదరాబాద్ విభాగం వారు కూడా చేస్తే బాగుంటుంది. ‘సర్వేజనా సుఖినోభవంతు’ అన్నట్లుగా ఈ జాతి బిడ్డలుగా అందరం కలిసి ముక్తకంఠంతో నా భారతదేశంలోని ఐకమత్యాన్ని ఎవరు చెదరగొట్టలేరని, గాంధీ భావజాలం ఈ దేశానికి ఇప్పటికీ ఆధునిక వేదంగా వర్ధిల్లుతూనే ఉంటుందని, చాటిచెప్తూ దేశ ప్రజల సౌఖ్యమే మన గీతమని జాతీయగీతాన్ని ఆలాపిద్దాం. దేశం కోసం త్యాగం చేసిన వీరుల విజయగాథలనే సామూహికంగా గొంతెత్తి పాడుకుందాం. జన సమూహాల ఐకమత్యమే మన జాతికి బలమని సమైక్య కంఠాలపై ప్రతిధ్వనిద్ధాం. ప్రజలకు జయము కలగాలని గానం చేద్దాం. అవును భారత భాగ్యవిధాతలకు జయము, మీకు జయము, నిత్య జయము. జయహే! జయహే! జయహే! జయ జయ జయ జయహే! జైహింద్.
(వ్యాసకర్త: జూలూరు గౌరీశంకర్ చైర్మన్,తెలంగాణ సాహిత్య అకాడమీ)