రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి గిరిజన సామాజిక వర్గానికి అవకాశం కల్పించింది తామేనని బీజేపీ గొప్పలు చెప్పుకొంటున్నది. అందుకే తాము మారుమాట్లాడకుండా మద్దతు ప్రకటించినట్టు కొన్ని పార్టీలు ప్రకటించాయి. అత్యున్నత రాష్ట్రపతి పీఠంపై గిరిజన మహిళను కూర్చొబెట్టాలన్న బీజేపీ నిర్ణయం వెనుక పెద్ద గూడుపుటాని దాగి ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. బీజేపీకి గిరిజనుల పట్ల ప్రేమ కంటే వారి ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టాలన్న వ్యూహం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న గుజరాత్తో పాటు వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్థాన్, త్రిపుర, కర్ణాటక రాష్ర్టాలు అత్యధికంగా గిరిజన జనాభా కలిగి ఉన్నాయి. గిరిజన జనాభా అధికంగా కలిగిన టాప్-10 రాష్ర్టాల్లో ఆరు రాష్ర్టాలకు వచ్చే రెండేండ్లలో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపిక వెనుక అసలు మర్మం ఇదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పొలిటికల్ కామెడీలో బండి సంజయ్కి మించినవారు లేరేమో అనిపిస్తుంది. తన మాటలకు జనం ఏమనుకుంటారన్న మొహమాటం కూడా లేకుండా మాట్లాడుతుంటారు. మోదీ, అమిత్ షా హైదరాబాద్కు వస్తున్నారని కేసీఆర్ గజగజా వణికిపోతున్నట్టు ఆయన మీడియాతో అన్నారు. ఆయన చెప్పినదాని ప్రకారం దేశవ్యాప్తంగా కేసీఆర్ పర్యటించినప్పుడు బీజేపీ అగ్రనేతలు కూడా వణికిపోయారని భావించాలా? ఉత్తర, దక్షిణాలకు సెంటర్గా ఉంటుందని తమ జాతీయ సమావేశాలకు హైదరాబాద్ను ఎంపిక చేసుకున్నట్టు ఆ పార్టీ నాయకులే ఢిల్లీలో వెల్లడించారు. మరి బండి సంజయ్ ఏమో టీఆర్ఎస్ను దెబ్బతీయడానికే హైదరాబాద్ను ఎంచుకున్నట్టు చెప్తున్నారు. బండి డైలాగులు వింటుంటే ఏప్రిల్ ఒకటి విడుదల సినిమాలో చిన్నారావు (మల్లికార్జునరావు) డైలాగులు గుర్తుకొస్తా యి. అందులో దివాకరం (రాజేంద్రప్రసాద్) పరిస్థితి ఏం బాగలేదు… బ్లడ్ ఎక్కిస్తున్నారు.. పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంది.. అని చిన్నారావు అంటారు. ఆయనకు పొజిషన్ బాగలేకపోతే? మీకెందుకు దెబ్బలు తగిలాయి? అని భార్య అతన్ని ప్రశ్నిస్తుంది. బండి మాటలు వింటే ఎవరికైనా ఈ సీన్ గుర్తుకు రాక మానదు.
– వెల్జాల