‘ఆకాశం అంటుకొనే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగమింకొక వైపు, అవినీతి, బంధుప్రీతి చీకటి బజారు, అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు?’ అని ప్రశ్నించారు మహాకవి శ్రీశ్రీ. ధరల తాకిడిలో కొట్టుకుపోతున్న సామాన్యుడి పరిస్థితి మోదీ సర్కార్కు ఏ మాత్రం కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ ధరను మళ్లీ మొన్న రూ.50 పెంచింది. మే నుంచి ఇలా పెరగటం మూడోసారి కాగా, గత ఏడాది కాలంలో వంటగ్యాస్ ధరను ఏకంగా రూ.244 పెంచి ఏ మాత్రం కనికరం లేకుండా సామాన్యుల బతుకులపై దాడికి తెగబడింది.
పెంచిన ప్రతీసారి దాదాపు రూ.50లకు తగ్గకుండా కేంద్రం భారం మోపుతున్నది. గతంలో మార్చి 22న సిలిండర్ ధర రూ.50 పెరిగింది. మళ్లీ మే 7న మరో 50 పెరగగా, మే 19న మాత్రం రూ.3.50 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మార్చి నుంచి మొత్తంగా ఒక్కో సిలిండర్పై రూ.153.50 పెంచాయి. ఇలా గతేడాది జూన్ నుంచి ఇప్పటివరకు చూస్తే సిలిండర్ ధర రూ.244 ఎగబాకింది. ప్రస్తుతం వంటగ్యాస్ సబ్సిడీ కేవలం ఉజ్వల పథకం కింద కనెక్షన్లు జారీ అయినవారికే అందుతున్నాయి. ఇదిలా ఉంటే, దేశీయ ఇంధన అవసరాల్లో దాదాపు 85 శాతం విదేశాల నుంచి దిగుమతిపైనే భారత్ ఆధారపడిన సంగతి తెలిసిందే. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడంతో దిగుమతుల కోసం భారత్ భారీగా చెల్లింపులు చేయాల్సి వస్తున్నదని మోదీ సర్కార్ తన చర్యలను సమర్థించుకుంటున్నది.
బీజేపీ అధికారంలోకి వచ్చేనాటికి 2014 మార్చి 1న సిలిండర్ ధర రూ.416గా ఉండే ది. ఇప్పుడు అది రూ.1,105లకు చేరింది. లోలోపల మగ్గిపోవడం తప్ప, ఈ భారీ పెరుగుదలకు ప్రభుత్వాలను నిలదీసే చైతన్యం సగటు మనిషికి లేదు. ఎదిరించే తెగువ విపక్షాలకు లేదు. తగ్గించాలనే ఆలోచన, నియంత్రించాలనే నిబద్ధత పాలకులకు లేదు.
పెట్రోల్ ధరలు కూడా ఇదేతీరున దాదాపు రెట్టింపునకు ఎగబాకాయి. కరోనా కష్టాలు, ఉపాధి లేమికి తోడు నిత్యావసర ధరల పెరుగుదలకు అడ్డులేకుండా పోయింది. డీజిల్, ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ ఉంటే తట్టుకునే శక్తిని సగటు భారతీయుడు కోల్పోతున్నాడు. పన్నుల విషయంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వాలు-రాష్ర్టాలపై కేంద్రం దుమ్మెత్తి పోసుకోవడం తప్ప, ధరల నియంత్రణకు, సమస్యల పరిష్కారానికి ఉమ్మడిగా చర్చించి నిర్ణయాలు తీసుకున్న దాఖలాల్లేవు. అదేమంటే కరోనా కాలంలో, ఆహార ధాన్యాలు, ఉచిత సరుకులు అందజేస్తూ కొవిడ్ కట్టడి కోసం వ్యాక్సిన్లు, ఆరోగ్యపరమైన మౌలిక వసతుల కోసం కోట్ల రూపాయలు ప్రజల కోసం వెచ్చిస్తున్నామని కేంద్రం అంటున్నది. అసలు కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా సహాయం అందట్లేదని రాష్ర్టాలు చెప్తున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంప్రదింపులే లేవు. ఆ మాటకొస్తే దేశంలో ఫెడరల్ స్ఫూర్తి కనుమరుగై చాలా కాలమైంది. ఆడబిడ్డల కంట కన్నీరు రాకుండా అల్పాదాయ వర్గాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించడం కోసమే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని తీసుకొచ్చామని గొప్పలుచెప్తూ వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం, ఆడబిడ్డల నెత్తిన గ్యాస్బండ రూపంలో మరింత గుదిబండను మోపి కన్నీరు పెట్టిస్తున్నది. పైగా ప్రజలకు దక్కాల్సిన సబ్సిడీలకు కోతలు విధిస్తూ సామాన్యుల జీవితాల్లో మంటలు రేపుతున్నది. ప్రజలకు ఇచ్చే రాయితీలో భారీగా కోతలు కోస్తున్న కేంద్రం ఖజానాపై సబ్సిడీ భారాన్ని భారీగా తగ్గించేసుకుంటున్నది.
2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం గ్యాస్ సబ్సిడీకి రూ.29,627 కోట్లు ఇవ్వగా 2020-21కు వచ్చేసరికి దాన్ని రూ.25,520 కోట్లకు తగ్గించింది. ఇక 2021-22లో ఈ మొత్తం రూ.12,480 కోట్లకు పడిపోయింది. 2022-23లో ఇది రూ.5,813 కోట్లుగానే ఉన్నది. అంతేనా కరోనా రాకముందు వరకూ సిలిండర్ ధర పెరిగితే సబ్సిడీ కూడా పెరిగేది. కానీ 2020 మే నుంచి ఆ విధానానికీ స్వస్తి పలికింది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.1000 దాటిపోగా రాయితీ మాత్రం రూ.40 ఇస్తున్నది. అంటే వంట గ్యాస్ సబ్సిడీకి కేంద్రం దాదాపుగా మంగళం పాడినట్లే.
ఇక ఎల్పీజీ ధరలు ఎందుకు పెంచుతున్నారన్నదానికి కేంద్రం ఇప్పటివరకు స్పష్టమైన సమాధానమే ఇవ్వలేదు. అంతర్జాతీయంగా ధరలు పెరగడం వల్లే చమురుసంస్థలు గ్యాస్ ధరలను పెంచుతున్నాయని ప్రకటించినా అందులో వాస్తవం లేదు. 2014-21 మధ్యకాలంలో అంతర్జాతీయంగా ఎల్పీజీ ధర 31 శాతం తగ్గగా అదేకాలంలో రిటైల్ ఎల్పీజీ ధర 110 శాతం పెరిగింది. లబ్ధిదారులకు అందాల్సిన ప్రభుత్వ పథకాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయన్న కారణంగా నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టారు. కానీ నగదు బదిలీ విధానంలో లబ్ధిదారులకు అందాల్సిన సబ్సిడినే భారీగా తగ్గిస్తుండటం ఆశ్చర్యకరం.
దేశంలో ఉజ్వల పథకం లబ్ధిదారులు 8 కోట్ల మంది ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది మరో కోటి గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామని ప్రకటించింది. అయితే సిలిండర్ ధరలు భారీగా పెరిగిపో తుండటంతో 2022 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 3.2 కోట్ల మంది ఉజ్వల లబ్ధిదారులు గ్యాస్ రీఫిల్ చేయించుకోలేదని ప్రభుత్వమే వెల్లడించింది.
నాదెండ్ల శ్రీనివాస్
96764 07140