ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ‘టీమ్ ఇండియా’ పేరు చెప్పి సమాఖ్య స్ఫూర్తి గురించి నీతులు పలికారు. తర్వాతి కాలంలో కేంద్రీకృత అధికారం దిశగా ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తున్నారు. ‘బలమైన కేంద్రం- బలహీనమైన రాష్ర్టాలు’ ఉండాలని రాజ్యాంగ విరుద్ధమైన ఎజెండాకు తెర లేపారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కీలు బొమ్మలుగా మార్చుకోవాలని చూస్తున్నది.
‘బలమైన కేంద్రం’ నినాదంతోనే మోదీ విపక్ష పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసే చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీజేపీ చెప్పుచేతల్లో ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అదే విధంగా కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేయడమే కాకుండా, ఒక దశలో ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సాక్షిగా బలం నిరూపించుకొని మోదీ కేంద్రీకృత నియంతృత్వ విధానాలకు ఎదురొడ్డి నిలిచారు కేజ్రీవాల్.
ఒక వైపు విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసే కుట్రలకు పాల్పడుతూనే, మరోవైపు డబుల్ ఇంజిన్ సర్కార్ పేరిట కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే, రాష్ట్రంలో ఉంటే అభివృద్ధి జరుగుతుందనే ప్రచారానికి బీజేపీ నేతలు తెర లేపారు. ఈ కుట్రలను బద్ధలు కొడుతూ, ప్రాంతీయ పార్టీలకు దన్నుగా నిలుస్తూ దేశానికి దిశా, నిర్దేశం చేసేందుకే ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాతో కేసీఆర్ ముందుకు పోతున్నారు.
ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ పర్యటన చేశారు. పాట్నా వేదికగా జాతీయ మీడియా సమక్షంలో బీజేపీ ద్వంద్వ విధానాలను ఎండగట్టారు. దీంతో జాతీయ రాజకీయ ప్రత్నామ్నాయ ఎజెండాకు భారత ప్రజలే మార్గ నిర్దేశకులుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించినట్లయ్యింది.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఈ ఎదుగుదలను చూసి ఓర్వలేక నిధులు దక్కకుండా కట్టడి చేయాలని కేంద్రం కుట్రలు చేస్తున్నది. రాష్ర్టానికి న్యాయంగా రావాల్సిన పన్నుల వాటాను, ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ను విడుదల చేయడం లేదు. బీజేపీ అధికారంలో లేని ఏ రాష్ట్రంలోనైనా అక్కడి ప్రజల ప్రయోజనాలు కేంద్రానికి పట్టడం లేదు. ఉపాధి హామీ, తదితర ఇతర పథకాల కింద కేటాయించిన నిధులను విడుదల చేయడం లేదు. అంతేకాకుండా 15వ ఆర్థిక సంఘం ప్రకారం రాష్ర్టాలకు రావలసిన నిధుల వాటా నిర్ణయం సహేతుకంగా లేదు. ఈ కొనసాగింపే రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయటం. అంతటితో ఆగకుండా ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలను బలహీనపరిచేలా ప్రత్యక్ష, పరోక్ష కుట్రలకు తెరలేపుతున్నది. గవర్నర్ల ద్వారా రాష్ర్టాలను ఇబ్బందులకు గురిచేస్తున్నది. వివిధ రాష్ర్టాల్లో ప్రజాగ్రహానికి గురవుతున్న బీజేపీ, కేంద్రంలో ఉన్న తన అధికారంతో నియంతృత్వాన్ని చెలాయిస్తున్నది. రాజ్యాంగం హామీ ఇచ్చిన సమాఖ్య స్ఫూర్తిని కాలరాస్తున్నది.
‘ఆక్టోపస్’లా కేంద్రం తన కబంధ హస్తాలతో రాష్ర్టాలను చుట్టేస్తున్నది. రాష్ర్టాల హక్కులను ఒక్కొక్కటిగా హరిస్తున్నది. అలాగే అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో రాష్ర్టాలకు షరతులు పెడుతున్నది. రైతుల బోరుబావులకు మీటర్లు పెట్టాలని విద్యుత్ చట్ట సవరణ బిల్లు తీసుకొచ్చింది. మీటర్లు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వాలకే ఏటా రూ.5 వేల కోట్ల సాయాన్ని ఐదేండ్ల పాటు అందిస్తామని చెప్తున్నది. అయినా మీటర్లు పెట్టేది లేదని, రైతుల దగ్గర విద్యుత్ బిల్లులు వసూలు చేసేది లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. ఫలితంగా రాష్ట్రం రూ.25 వేల కోట్లు నష్టపోయింది. కేసీఆర్ రైతు అనుకూల విధానాలను ఆదర్శంగా తీసుకొని ఇటీవల 26 రాష్ర్టాల రైతు సంఘాల నాయకులు తెలంగాణలో పర్యటించి, రాష్ట్రంలో అమలవుతున్న రైతు విధానాలను వేనోళ్ల కొనియాడారు. తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రాష్ర్టాలు అనుసరించాలని కోరారు. మరోవైపు నదీజలాలపై కేంద్రం పెత్తనం చెలాయిస్తున్నది. సాగునీటి ప్రాజెక్టులను తన పరిధిలోకి తీసుకొని కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నది.
మోదీ ప్రభుత్వ విధానాలు ఇలా ఉంటే… బీజేపీ నేతల మాటలు, చేష్టలు దేశాన్ని అస్థిరం, విచ్ఛిన్నం చేసేవిగా ఉంటున్నాయి. మతపరమైన చిచ్చు రేపుతున్నాయి. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు, అంతకుముందు నుపూర్ శర్మ మాటలు ఓ ఉదాహరణ మాత్రమే.
ఏ నినాదాన్ని భుజానికెత్తుకున్నా.. దాన్ని నిజం చేసేవరకు విశ్రమించని చరిత్ర ముఖ్య మంత్రి కేసీఆర్ది. ఇందుకు తెలంగాణ ఉద్యమమే తిరుగులేని సాక్ష్యం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎలాంటి జటిలమైన సమస్య గురించైనా దేశ ప్రజలందరికీ తెలియచేయడంలో కేసీఆర్ను మించినవారు లేరు. ఇప్పుడు ‘తెలంగాణ మోడల్’ అభివృద్ధి, సంక్షేమాలను దేశవ్యాప్తం చేయడం లక్ష్యంగా చేసుకున్నారు. విద్వేష రాజకీయాలను తుత్తునియలు చేయడమే ఎజెండాగా పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలోనే కేసీఆర్ చేపట్టిన జాతీయ అజెండాలో ఈ దేశాన్ని అసలు సిసలైన ‘యూనియన్ ఆఫ్ స్టేట్స్’గా మార్చే సమాఖ్య స్ఫూర్తిని నిలిపేందుకు కంకణబద్ధులై కదులుతున్నారు. రాష్ర్టాలు బలపడినప్పుడే దేశం బలపడుతుందన్న కేసీఆర్ ఆలోచన, నాడు గాంధీజీ చెప్పినటువంటి గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలులాంటివి
అనే దానికి కొనసాగింపు.
ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో కుల, మతతత్వాలకు వ్యతిరేకంగా కేసీఆర్ ప్రతిపాదిస్తున్న జాతీయ అజెండాకు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఢిల్లీ కేంద్రంగా అధికారం చెలాయించే ఒక నియంతృత్వం కాకుండా సమాఖ్య స్ఫూర్తితో రాజ్యాంగ విలువల స్ఫూర్తి కొనసాగాలి. అప్పుడే సమాఖ్య స్ఫూర్తితో భారత్ ప్రగతి పథంలో ముందుకుపోయే అవకాశం ఉన్నది.
(వ్యాసకర్త: రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్)
– డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
95530 86666