నమ్మి నానవోస్తె పుచ్చి బుర్రలైనయట! మోదీ నాయకత్వంలోని ఎన్డీయేను రెండుసార్లు వరుసగా ఎన్నుకున్నందుకు దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నది. దేశానికి అప్పుల భారం పెరిగిపోతున్నది. కార్పొరేట్ సంస్థలకు పన్నులు తగ్గిపోతుంటే, సామాన్యుడికి పన్నుపోటు, ధరల భారం పెరిగిపోతున్నది. కేంద్రంపై దాదాపు రూ.121 లక్షల కోట్ల అప్పు ఉండటం ఆందోళనకరం. మోదీ అధికారంలోకి వచ్చే నాటికి రుణం రూ.57 లక్షల కోట్లు ఉంటే, ఈ ఏడేండ్లలో 64 లక్షల కోట్లకు పైగా అదనంగా వచ్చి చేరింది. దేశ జీడీపీలో రుణం దాదాపు 60 శాతానికి చేరుకున్నది. గత ఆర్థిక సంవత్సరం ఇది 51.6 శాతం కాగా ఒక్క ఏడాదిలో 8 శాతానికి పైగా పెరిగింది. కరోనా నుంచి కోలుకొనే నాటికి ఇది ఏకంగా 90 శాతానికి చేరుకోవచ్చన్న తీవ్రస్థాయి అంచనాలు కూడా ఉన్నాయి. జీడీపీలో అప్పుల వాటా 80-90 శాతానికి పెరగటం అనేది ఆర్థికంగా చితికిపోయిన ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో కనిపించే పరిస్థితి. భారత్తో పోల్చదగిన వర్ధమాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటి అరా మినహా దేశానికీ ఇంత అప్పు లేదు.
రుణాలు అసలే తీసుకోకూడదని కాదు. కానీ ఆ తీసుకున్న అప్పులతో అభివృద్ధి సాధించి, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని సంతరించుకోవాలి. అమెరికా, జపాన్ వంటి సంపన్నదేశాలు కూడా రుణాలు తీసుకుంటాయి. మౌలికరంగాల్లో ప్రభుత్వ, ప్రైవేటు మార్గాల ద్వారా పెట్టుబడులను పెంచి, తమ ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు గణనీయంగా పెంచుకుంటాయి. ఈ ఆర్థిక సూత్రాలకు మోదీ సర్కారు తీరు విరుద్ధంగా ఉన్నది. పెద్ద నోట్ల రద్దు వంటి అనాలోచిత విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ కరోనా రావడానికి ముందే కుదేలయింది. మాంద్యం ప్రపంచ దేశాలను కుదిపేసినప్పుడు కూడా బలంగా తట్టుకొని నిలిచిన ఆర్థిక వ్యవస్థ మనది. అటువంటి వ్యవస్థలను తొందరపాటు నిర్ణయాలు, అలవికాని విధానాల ద్వారా మనకు మనమే బలహీనపరచుకోవడమేమిటి?
మోదీ తొలిసారి ప్రధాని అయిన 2014లోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఈ ఏడేండ్లలో అభివృద్ధిలో పెద్దపెద్ద అంగలు వేస్తూ అనేక బహుళజాతి కంపెనీలకు వేదికగా నిలిచింది. విద్యుత్, వ్యవసాయం, చేతివృత్తుల వంటి భిన్న రంగాల్లో నిశ్శబ్ద విప్లవాలను సృష్టించింది. పారిశ్రామిక రంగమూ పరిఢవిల్లుతున్నది. పల్లెల్లో సంపద సృష్టి జరగడం, కొనుగోలు శక్తి పెరగడం విశేషం. కరోనా మహమ్మారి విరుచుకుపడి ఆర్థికరంగాన్ని కకావికలం చేసినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ దీర్ఘదృష్టితో తెలంగాణ అద్భుతమైన విజయాలను సాధించగలిగింది. ‘హెలికాప్టర్ మనీ’ విధానం ద్వారా ప్రజలను ఆదుకోవాలన్న కేసీఆర్ సూచనను కూడా మోదీ సర్కార్ పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరం. ఇకనైనా మోదీ ఆర్థిక వేత్తలతో, ముఖ్యమంత్రులతో చర్చలు జరిపి విధాన నిర్ణయాలు తీసుకోవాలి. దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారకుండా కాపాడాలి.