మొగుడు తిట్టినందుకు కాదు…తోడి కోడలు చూసిందనే బాధ అన్నట్లుగా ఉంది టీపీసీసీ ప్రస్తుత పరిస్థితి. తమ వార్ రూమ్పై పోలీసులు దాడి చేసి హార్డ్ డిస్కులను పట్టుకెళ్లినందుకు కాంగ్రెస్ నేతలకు బాధ లేదట. అందులో ఉన్న సమాచారం బయటకు లీక్ అయితే ఎలా అన్న భయం పట్టుకుందట. ఇప్పటికే తనపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు… కొందరేమో పార్టీకి గుడ్బై చెప్పారు… మరి ఈ సమాచారం లీక్ అయితే ఏంటి పరిస్థితి అని టీపీసీసీ అధినేత రేవంత్ రెడ్డి భయపడుతున్నారట.
వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి నియోజకవర్గాల వారీగా ఎవరికెంత పట్టుంది, ప్రత్యామ్నాయంగా ఎవరిని ప్రోత్సహించాలి, టికెట్ ఎవరికిస్తే గెలిచే అవకాశాలుంటాయి తదితర సమాచారమంతా ఆ హార్డ్ డిస్కుల్లో ఉందట. సర్వేల ద్వారా ఎప్పటికప్పుడు సేకరించిన సమాచారాన్ని పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు పార్టీ పెద్దలు మాణిక్కమ్ ఠాగూర్, కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి లాంటి ముగ్గురు, నలుగురికి మాత్రమే షేర్ చేస్తారట. ఇదంతా రేవంత్ రెడ్డి కనుసన్నల్లో జరుగుతుంది.
హార్డ్ డిస్కులోని సమాచారాన్ని పోలీసులు బయటకు లీక్ చేస్తే.. ఇక కాంగ్రెస్ కొంప కొల్లేరే అవుతుందని ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారట. అందుకే పోలీసులు హార్డ్ డిస్కులను ఇలా పట్టుకెళ్లారో లేదో… తమ పార్టీ డాటాను పోలీసులు ధ్వంసం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అంటే తన మాటల్లోని మర్మాన్ని అర్థం చేసుకొని డిస్కుల్లోని సమాచారాన్ని లీక్ చేయకుండా వాటిని ధ్వంసం చేయండని రేవంత్ రెడ్డే పరోక్షంగా పోలీసులకు సంకేతాలు ఇచ్చినట్టు ఉందని గాంధీభవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
– వెల్జాల