23 ఏండ్లుగా తెలంగాణనే తన శ్వాసగా, ధ్యాసగా మార్చుకున్న మహా నాయకుడు మన కేసీఆర్. ఉద్యమ సమయంలో తెలంగాణ ఎట్లా తేవాలనే మథనం. పోరాటాన్ని ఎట్లా బలోపేతం చేయాలనే తపన. కేంద్రమంత్రి స్థాయి పదవిని సైతం గడ్డిపోచ వలె వదిలేసి ప్రజల కోసం నిలబడ్డ త్యాగం.
‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో’ అని ఆమరణ నిరాహార దీక్షకు దిగిన తెగువ. చివరికి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆరంభమయ్యేలా చేసిన పోరాట పటిమ. యాభై ఏండ్లుగా ఏ నాయకుడూ సాధించలేకపోయిన తెలంగాణను తన నాయకత్వంలో సాధించి ప్రజల హృదయాలు ఉప్పొంగిపోయేలా చేసిన మహోన్నత ఉద్యమకారుడు మన కేసీఆర్.
తెలంగాణ అవతరించిన తర్వాత ఈ రాష్ర్టాన్ని విఫల రాష్ట్రంగా మార్చేందుకు జరుగుతున్న కుట్రలను ఎట్లా ఎదుర్కోవాలని మథనపడ్డడు. రాష్ట్రం వచ్చిన ఏడాదిలోనే ఎమ్మెల్యేలను కొని, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తెలంగాణ వ్యతిరేక శక్తులు చేసిన ప్రయత్నంలో పాత్రధారి ఎవరో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఆ ప్రయత్నంలో డబ్బు సంచులతో పట్టుబడ్డ వ్యక్తిని తలకెత్తుకునే స్థాయికి జాతీయపార్టీ అని చెప్పుకొనే కాంగ్రెస్ దిగజారింది. ఇది కాంగ్రెస్ దౌర్భాగ్యం. కాంగ్రెస్ వలలో పడితే ఆ దౌర్భాగ్యం ప్రజల జీవితాలకు పడుతది. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ ప్రజలకు కావాల్సింది సమర్థుడైన ముఖ్యమంత్రి కానీ, స్వార్థంతో కన్ను మిన్నూ గానని కమీనా నాయకులు కాదు. ఈ పదేండ్లలో కేసీఆర్ తెలంగాణలో పేదరికాన్ని ఎట్లా తగ్గించాలె, అందుకోసం సంపదను ఎట్లా పెంచాలె, పెంచిన సంపదను పేదలకు ఎట్లా పంచాలె అనే తాపత్రయపడ్డడు. పేదల సంక్షేమం కోసం తపస్సు చేసిండు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఒకరేమిటి విధి వంచితులైన నిస్సహాయులందరూ కేసీఆర్ అనే పచ్చని చెట్టు కింద పదిలంగా బతుకుతున్నరు. ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో భద్రంగా జీవిస్తున్నరు.
కాంగ్రెస్ పాలనలో కూలిన వ్యవసాయాన్ని తిరిగి ఎట్లా నిలబెట్టాలె, ఆత్మహత్యలకు ఒడిగడుతున్న రైతన్నల జీవితాలను ఎట్లా గడ్డకు పడగొట్టాలెనని ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపిండు కేసీఆర్! రాలిపోతున్న రైతన్నలను చూసి ఎంత దుఃఖం ఎల్లబోసిండు! రైతన్న సంక్షేమం కోసం ప్రపంచమే మెచ్చిన పథకాలను తయారుచేసి తెలంగాణ సేద్యాన్ని సిరులు కురిపించేలా చేసిండు. ప్రతి పొలానికీ 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి, ప్రతి చెరువునూ నిండు కుండగా చేసి, తెలంగాణను భారతదేశ ధాన్యాగారంగా మలిచిండు. రైతన్న మెచ్చిన రాజ్యాన్ని తెచ్చిండు. అత్యంత తక్కువ వ్యవధిలో ప్రాజెక్టులు కట్టుకున్నం, ఇబ్బడి ముబ్బడిగా సాగును పెంచుకున్నం. దీనివెనుక కేసీఆర్ అనుక్షణం చేసిన మేధో మథనం ఉన్నది. పటిష్ఠమైన ప్రణాళికా రచన ఉంది. నిరంతర పర్యవేక్షణ ఉన్నది. అన్ని శాఖలనూ సమన్వయం చేసిన పరిపాలనా పటిమ ఉంది. అన్నింటికీ మించి తెలంగాణ రైతన్నల మీద గుండెల నిండా ప్రేమ ఉన్నది.
ఏ రాష్ట్రం ఇచ్చింది రైతులకు 72 వేల కోట్ల రూపాయలు? రైతు ఏ కారణం చేత మరణించినా పది రోజులు తిరగకముందే 5 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి ఇచ్చి ఏ ముఖ్యమంత్రి ఆదుకున్నడు? ఒక్క కేసీఆర్ తప్ప! దుక్కి దున్నినప్పటి నుంచి పంట అమ్మేదాక అడుగడుగునా రైతుకు రక్షణై నిలిచిండు. పండిన పంటనంతా కొనే రాష్ట్రం తెలంగాణ తప్ప ఇంకోటి ఉన్నదా. ఎన్నేండ్లకు రైతన్నల ముఖాల మీద చిరునవ్వులు చూస్తున్నం. ఈ పదేండ్ల కాలంలోనే కదా రైతు జేబులల్ల నగదు కళకళలాడుతున్నది. ఎరువులడిగితే లాఠీతో కొట్టిన పార్టీ, కరెంట్ అడిగితే కాల్చిచంపిన పార్టీ, ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా రైతుకు మూడు గంటల కరెంట్ చాలు అంటున్న పార్టీ, కౌలు రైతుకు అసలు రైతుకు పంచాయితీ పెడుతున్న పార్టీ.
నిన్నటికి నిన్న రైతు బంధు పైసలు ఖాతాల పడే మోపుకు ఈ నల్లమొకపు కాంగ్రెస్ నడిమిట్లకొచ్చి నోటికాడి బుక్క ఎత్తగొట్టె. రైతుబంధు ఆపితే ఏమొచ్చింది కాంగ్రెస్కు? ఓట్ల కోసం పంట పెట్టుబడి సాయం అందకుండా చేయల్నా? బీఆర్ఎస్ చేసే మంచిని అడ్డుకొని లాభం పొందాలనే కాంగ్రెస్ వికృత వ్యవహారాన్ని తెలంగాణ ప్రజలు పసిగట్టకపోతే ప్రమాదం. మోస పోతే గోస పడుతం. పదేండ్ల కేసీఆర్ కష్టం బూడిదల పోసిన పన్నీరవుతుంది. వేరే గ్యారెంటీలు ఏమో గానీ, కాంగ్రెస్ వస్తే కరెంట్ కాటగల్సుడు గ్యారెంటీ. ఇప్పుడు రైతులు ఇంట్ల పండుకున్నా పొలం పారుతున్నది. పొరపాటున కాంగ్రెస్సే గనుక వస్తే మళ్లా ఎన్కటి కథనే.
కొత్తగా పెండ్లి చేసుకున్న పిల్లగాడు కూడా పొలం కాడ పండుకోవాలె, కరెంట్ షాకులు కొట్టి రైతులు చచ్చిపోవాలె. కరెంటు ఖర్చు కారణం చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగంగా మార్చాలనే నీచమైన కుట్ర కాంగ్రెస్ కడుపులో ఉన్నది. అదే జరిగితే మళ్లా ఎస్సారెస్పీ కాల్వలల్ల తుప్పలు, తుమ్మలు మొలుస్తయి. మానేరు నుంచి సూర్యాపేట దాకా మళ్లా పొలాలు పడావు పడుతయి. ఆర్థికంగా దివాలా తీసినమని చెప్పి పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేయరు. అప్పుడు మహబూబ్నగర్ నుంచి తాండూరు దాకా కృష్ణా నీళ్లను తేవాలనే కేసీఆర్ కలను కాంగ్రెస్ అడ్డుకుంటది.
కాంగ్రెస్ నాయకుల అవినీతి దాహం వల్ల పండుగైన వ్యవసాయం మళ్లా దండుగైతది. కోరికోరి కొరివితోని తల గోక్కుంటమా! పాపకారి కాంగ్రెస్కు ప్రభుత్వం అప్పజెప్పుతమా! జన్మల చేయొద్దు ఆ పని.
కేసీఆర్ స్థాపించిన రైతు రాజ్యాన్ని కాపాడుకుంటే రాబోయే రోజుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వస్తయి. రైతులే చిన్నతరహా పరిశ్రమలకు ఓనర్లు అవుతరు. పంట అమ్మిన పైసలే కాదు, దాని నుంచి తయారయ్యే ఉత్పత్తుల ద్వారా కూడా రైతులకు ఆదాయం వస్తుంది. ప్రతి మండలానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ పెట్టుకుంటం. గ్రామీణ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించుకుంటం. కాంగ్రెస్ నిరుద్యోగ యువతను భ్రమల్లోకి నెట్టి తన పబ్బం గడుపుకోవాలని చూస్తున్నది. నిజానికి బీఆర్ఎస్ ఇచ్చినన్ని ఉద్యోగాలు దేశంలో ఇంకే రాష్ట్రం ఇయ్యలేదు. ఇది కాంగ్రెస్ నాయకులకు నేను చేస్తున్న ఓపెన్ ఛాలెంజ్. దమ్ముంటే నిరూపించాలి. తప్పుడు ప్రచారం చేసి యువతను తప్పుదోవ పట్టించాలని చూస్తున్న మీ కుళ్లు కుతంత్రాలు బద్దలుగాక తప్పదు. ప్రజలు మిమ్మల్ని చీకొట్టి తరిమి కొడుతరు జాగ్రత్త. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ మహిళలకు అప్పటిదాక ఉన్న తిప్పలన్నీ పోయినయి. కాంగ్రెస్ పాలనలో పబ్లిక్ నల్లాల దగ్గర పంచాయితీ పెట్టుకొని బిందెడు నీళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితులున్న మాట నిజం కాదా. వ్యవసాయ బావుల దగ్గరికి నడిచిపోయి బిందె మీద బిందె పెట్టుకొని మోసుకొని తెచ్చుకున్న మాట నిజం కాదా. ట్యాంకర్లు లేకుండా ఒక్క ఎండకాలం అన్నా గడిచిందా. ఇవాళ ఆ తిప్పలన్నీ మాయమైపోయినయి. నడింట్లకు నల్లాల ద్వారా తియ్యటి నీళ్లు వస్తున్నయి. నీళ్ల గురించిన రంధి ఇప్పుడు ఏ ఆడకూతురుకు లేదు. కాంగ్రెస్ పాలనలో గర్భిణులను దవాఖానలకు తీసుకుపోదామంటే అంబులెన్సులు దిక్కుండెనా. ఎడ్ల బండి మీదనో ట్రాక్టర్ మీదనో తీసుకుపోయేటోళ్లు కదా. అది ఆ ఆడబిడ్డకు ఎంత అవస్థ. పడుకుంటాలేసుకుంటూపోతే దవాఖానల్లో డాక్టర్లు ఉండకపోదురు. నర్సులు ఉండకపోదురు. బెడ్స్ ఉండకపోవు.
ఇవాళ కన్నతండ్రి వంటి కేసీఆర్ పాలనలో అమ్మ ఒడి వాహనాలు వచ్చి పదిలంగా దవాఖానకు చేర్చుతున్నయి. దవాఖానలన్నీ చక్కటి సౌలతులతో మంచి సేవలందిస్తున్నయి. డాక్టర్లకు కొరత లేదు. సురక్షితంగా సహజ పద్ధతిలో ప్రసవం చేసి పన్నెండు వేలో, పదమూడు వేలో చేతికిచ్చి కేసీఆర్ కిట్టు ద్వారా 16 వస్తువులు ఇచ్చి ఆటో కిరాయి ఖర్చు కూడా లేకుండా మళ్లా అమ్మ ఒడి వాహనంలోనే ఇంటికి చేరుస్తున్నరు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది తెలంగాణ వైద్య వ్యవస్థ.
కాంగ్రెస్ పాలనలో ఉన్నవి ఐదే ఐదు మెడికల్ కాలేజీలు. ఇవాళ జిల్లాకో మెడికల్ కాలేజీ వచ్చింది. వాటికి అనుబంధంగా పెద్దాసుపత్రులు వచ్చాయి. ఇంత పెద్ద విషయాన్ని కనుమరుగు చేయాలన్నది కాంగ్రెస్ కుట్ర. ఏడాదికి పదివేల మంది డాక్టర్లు తయారయ్యే స్థాయికి తెలంగాణను తీసుకుపోయినం అంటే అది ఎంత పెద్ద ముచ్చట. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ ఘనత సాధించలేదు. ఒకప్పుడు తెలంగాణలో మూడే మూడు డయాలసిస్ సెంటర్లు ఉండే. నేడు 103 డయాలసిస్ సెంటర్లున్నయి. వైద్యరంగం విస్తృతమైంది. బలోపేతమైంది. ప్రతి నియోజకవర్గానికి వంద పడకల దవాఖాన వచ్చింది. ఇంకొక్క రెండు మూడేండ్లల్ల వైద్య వ్యవస్థ పూర్తిగా స్థిరపడుతది. ఎవరికి ఎంత పెద్ద జబ్బు వచ్చినా ఉచితంగా వైద్యం మందులు దొరుకుతాయి. ఈ సమయంలో కొంచెం అటూ ఇటూ అయినా మళ్లా పాత కథనే వస్తది. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని మళ్లా పాత పాటలే పాడుకోవాలె.’ దుర్మార్గపు కాంగ్రెస్ వచ్చుడెందుకు? మనం దురవస్థల పాలుకావడం ఎందుకు? కంటి వెలుగైన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకుందాం.
‘తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది’ అనే స్థాయికి సంక్షేమాన్ని, ప్రగతిని తీసుకపోయినం. ప్రజల తలసరి ఆదాయం, కొనుగోలు శక్తిని పెంచినం. నేడు తెలంగాణలో కరువులు లేవు, ఆకలి చావులు లేవు, ఏ కుటుంబమూ, ఏ ఒక్కరోజు పస్తులుండాల్సిన దయనీయ పరిస్థితి లేదు. పరిశుభ్రత, పచ్చదనం ఉట్టిపడే విధంగా ఆదర్శ గ్రామాలను రూపుదిద్దినం. పట్టణాల్లో చక్కని మౌలిక వసతులు ఏర్పాటు చేసినం. సకల హంగులతో జిలా ్లకేంద్రాలను తీర్చిదిద్దినం. కళ్లు చెదిరిపోయే అభివృద్ధితో హైదరాబాద్ విశ్వనగరంగా రూపాంతరం చెందింది. విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధి ఫలితాలు గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణకు దక్కుతున్నాయి. ప్రతిపక్షాలు కాళ్లల్ల కట్టెలు పెడుతున్నా, కేంద్రం సహకరించకున్నా ఇంత గొప్ప ఫలితాలు సాధించినం.
కేసీఆర్ మనసులో తెలంగాణ గురించి ఎన్నో కలలు, మరెన్నో భవిష్యత్తు ప్రణాళికలున్నయి. కేరళ రాష్ట్రం వలె తెలంగాణలో కూడా నూరు శాతం అక్షరాస్యత సాధించాలె. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే ప్రక్రియ మరింత బలోపేతం కావాలె. క్వాలిటీ మ్యాన్ పవర్, క్వాలిటీ ప్రొడక్షన్, ఎఫీషియంట్ సప్లయి చైన్ మెకానిజం తయారు చేసుకోవాలన్నది కేసీఆర్ భవిష్యత్తు సంకల్పం. తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మెండుగా పెంచుకొని పేదరికాన్ని తగ్గించుకోవాలె. ఆదివాసీ, దళితుల నుంచి అగ్రవర్ణాల దాకా ఏ వర్గంలోనూ పేదరికం లేని తెలంగాణను ఆవిష్కరించుకోవాలె.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, ఇంకా కొన్ని తెగని పంచాయితీలున్నయి. ఈ పంచాయితీలను నెగ్గుకు రాగలిగిన నేత కేసీఆర్ మాత్రమే. ఎవరికీ ఏ అవకాశం ఇయ్యొద్దని శాంతిభద్రతలను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నం. పంచాయితీలు పూర్తిగా తొలగిపోయేంత వరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రులను దించడానికి హైదరాబాదులో మతకల్లోలాలు రేపిన చరిత్ర కాంగ్రెస్ది. సకల మతాలను సమాదరిస్తూ, కేసీఆర్ గంగా జమునా తహజీబ్ను పరిరక్షిస్తున్నరు. ఎటువంటి అల్లర్లు, అలజడులు లేకుండా సుస్థిర పాలన, సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుంది. జాతీయపార్టీల రూపంలో వచ్చే ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక రాష్ర్టాల పెత్తనం మన తెలంగాణ నెత్తిన ఎందుకు రుద్దుకోవాలి. తెలంగాణ స్వాభిమానాన్ని, స్వావలంబనను కాపాడుకోవాలంటే, బీఆర్ఎస్ను కాపాడుకోవాలి.
ఓటుకు నోటు కేసులో డబ్బుతో పట్టుబడ్డ పీసీసీ అధ్యక్షుడికి తెలంగాణ అంటే ఇసుమంతైనా ప్రేమ లేదు. అతను విలువలు లేని తనానికి బ్రాండ్ అంబాసిడర్. అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ అతను తెలంగాణ ద్రోహే అనే విషయం దాచేసినా దాగని సత్యం. రాజకీయ స్వార్థమే తప్ప తెలంగాణ పట్ల నిబద్ధత లేని వ్యక్తిని నెత్తిన మోస్తున్న కాంగ్రెస్ దౌర్భాగ్యానికి చింతించడం తప్ప మరేం చేయలేం.
ఆ దిగజారుడు కాంగ్రెస్ను ఓడగొట్టడమే తెలంగాణ ప్రజల తక్షణ కర్తవ్యం. బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ భద్రంగా ఉంటది, భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటది. కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష. ‘దీక్షా దివస్’ స్ఫూర్తితో…
-తన్నీరు హరీశ్రావు
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామాత్యులు