ఓ ఇరువై ఐదేండ్ల కిందనుకుంటా.. ‘అద్దుల్లా.. గీ జరంల బాయికాడికేం బోతవ్ తియ్’ అంటున్న నా పెండ్లాం లక్ష్మితోని.. ‘మనకేమో మగవోరడు లేకపాయె? ఇద్దరాడివిల్లల్నేమో అత్తగారింటికి సాగదోల్తిమి, కరెంటు పాడుగాను మజ్జాన్నమేమో రాదు, ఈ మబ్బుల మూడింటికి వొయి కరెంటు వెట్టకుంటే అటు పొలం ఎండిపోతది, ఇటు మోటర్ కాలిపోతది..’ అనుకుంటా పానం శాతగాకున్నా.. నెత్తిమీంచెల్లి ఓ శెద్దరి కప్పుకొని బాయికాడికి బైలెల్లిన.
ఇట్లా శిమ్మశీకట్ల బాయికాడికి వోవుడు అలవాటే గని.. ఆ రోజెందుకో పానం సవసవా అనేసరికి లక్ష్మి అద్దనుడు వెట్టింది. దాని మాటిని బాయికాడికి పోకున్నా ఐపోవు. మబ్బుల మూడింటికి ఎవ్వలుంటరు, ఎవ్వలుండరు. ఇగ నా బాధ చెప్పరానిది. అసోంటి బాధ పగోనిగ్గూడ రావొద్దు.
కరెంటు మోటర్ ఒత్తొద్దామని మీటర్ డబ్బా కాడికి వోయిన. అంతే పానం గిర్రుమని తిరిగి కిందవడ్డా. ఏమైందో, ఏమోనని కండ్లు దెర్సి సూసేసరికి బాయిల వడి ఉన్న. కొంచెం ఈతొచ్చు గావట్టి ఆయాళ్ల బతికి బైట వడ్డ. బాయిలున్న ఫుట్వాల్ పైపును దొరుకవట్టుకొని.. ఓరి కిట్టయ్య రారో, ఓరి ఎల్లయ్య రారో అని కీకలేసుడు షురూ జేసిన. ఆ కీకలు నాయి నాకే ఇనవడ్తున్నయి గని వాళ్లకు మాత్రం ఇనవల్లే.. ఇగ ఆ నాత్రి నాకు నరకం కనవడ్డదనుకోర్రి. శిక్కగున్న శీకటి పల్సగైతున్నది.. అంటే ఆరు, ఆరున్నర గొడ్తున్నదనుకొని మళ్లోసారి ‘ఓరి బాలయ్యో.. ఓరి చంద్రయ్యో… ఓరి రాజిరెడ్డిగా’ అని మొత్తుకునుడు షురూ జేసిన. కిష్టారెడ్డి, ఎల్లారెడ్డి, చింతల చంద్రయ్య, కుర్మ బాలయ్య అందరు కట్టగట్టుకొని అచ్చిర్రు. మంచం కోళ్లకు నాలుగు తాళ్లు కట్టి బాయిలకిడ్శిర్రు. ఆ మంచం మీద బాయి గడ్డకెక్కేసరికి ఏడు గొట్టింది. ఆ రోజు నా పానం పోయినంత పనైంది.
ఓ పదిహేనేండ్ల కిందనుకుంటా.. మాకు షిఫ్టుల కింద కరెంటు ఇస్తుండె అప్పటి ప్రభుత్వం. అద్దుమనాత్రి 12 గంటలకు కరెంటు బంజేసొద్దామని బాయికాడికి వోయిన. పోంగ మంచిగనే వోయిన గని, పోయిరాంగనే ఆ తేలు పాడుగాను కరెస్టు కాలు మీద కాటేసింది. అదసలే నల్ల తేలు. నాకిగ ఒగ మంట గాదు.
నా ఎరుకల నల్ల తేలు కుట్టి సచ్చిపోయినోళ్లు వందలకమాన మంది ఉన్నరు. ఇప్పుడే దవాఖానకు వోయినా పాము కాటుకు మం దు, తేలు కాటుకు మందు, కుక్క కాటుకు మందు దొరుకుతున్నది గనీ, ఇప్పట్లెక్క అప్పు టి దవాఖాన్లల్ల మందా, మాకా..? ఇగ అద్దు మ నాత్రి తేలు మంత్రం ఏసేటాయ్నె దగ్గరికి వోయినం. నా నమ్మకమో.. లేక అదృట్టమో గనీ నల్ల తేలు కుట్టినా బతికి బైటవడ్డ.
నా పేరు వంగల రాజిరెడ్డి, మాది కన్నారం జిల్లా, గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి ఊరు. మా బాపు నర్సింహారెడ్డి ఒక్కడే. ఆయనకు నేనొక్కన్నే. మా బాపు పోంగ పోంగ పన్నెండెకరాల భూమి, రెండు బాయిలు అప్పజెప్పి వోయిండు. నాకు ఇద్దరాడివిల్లలు. తలా నాలుగెకురాల భూమిచ్చి లగ్గం జేసిన. వాళ్లకూ పిల్లలైండ్రు. వాళ్ల సంసారం వాళ్లకైంది. నేనూ, లక్ష్మీ ఇద్దరం ఓ నాలుగెకురాల భూమిల ఎవుసం జేసుకుంటా పబ్బం గడుపుతున్నం. అనాది నుంచి మాది రైతు కుటుంబమే. ఎంత పెద్ద రైతుకైనా, ఎన్ని పైసలున్నోనికైనా అదాతుకు పది రూపాలు గూడ అందయి. మన మంత్రం మనకు వారదన్నట్టు.. ఒక్కోపారి మన పైసలే గనీ మన ఆపతికి అక్కర్రాకుంటయితయి. నా డబ్బు ఏండ్ల జీవితంల ఇసొంటి అనుభవాలు మస్తుగున్నయి. అందుకే అక్కెరకు పనికొస్తయని ఇన్ని పైసల్ ఎప్పుడూ అకౌంట్ల ఉంచుకుంటా. ‘రైతుబంధు, ఆసరా’ పథకాలే నాకు అకౌంట్ల పైసలు జమజేసుడు నేర్పినయి. అవును, నాకు పసలుకు 21,531 రూపాలు రైతుబంధు పైసలు నా అకౌంట్ల వడ్తయి. అవి పో ను నెలనెలా 2,016 రూపాల ఆసరా పింఛన్ అకౌంట్ల జమయితది. అవట్లనే అకౌంట్లుంటయి, ఏమన్న అవసరానికి పనికొస్తయని అన్లకెళ్లి రూపాయి గూడ ముట్ట.
ముప్పై ఏండ్ల కింద తెచ్చిన బాయి మోటార్ మొన్నెందుకో బాగ సతాయించుడు వెట్టింది. పెండ నీళ్లు, బురద నీళ్లు ఎన్ని బకీట్లు వోసినా బాయిలకెళ్లి నీళ్లిగ్గుతలేదు. అర్రే ఎమైందిరా బై అని బాయి మోటర్లు మంచిగజేసే మా సత్తన్నకు ఫోన్గల్పిన. ఇట్ల విషయం జెప్పిన్నో లేదో, ఆయన నిమిషాల మీన్నే అచ్చిండు బాయికాడికి. మోటర్ను చెక్జేసి ‘మోటర్ కరాబైంది గాదె రాజిరెడ్డన్నా’ అని జెప్పవట్టిండు. కొత్త మోటర్ కొనుక్కరావాల్నంటే ఎంతలేదన్నా ఓ నలభై వేలు గావాలె.. గన్నిగనం పైసలు నా దగ్గర లేకుండె. నా పెద్దల్లుడు టీచర్ నౌఖరి జేత్త డు.. చిన్నల్లుడు బిజినెస్ జేసుకుంటడు. లచ్చ రూపాలు గావాల్నంటే క్షణంల గొడ్తరు వాళ్లు. ‘ఛల్ ఇంత బతుకు బతికి అల్లుళ్లను అప్పడుగుతమా’ అని ఆలోచిస్తా ఉంటే బ్యాంకుల దాసుకున్న రైతుబంధు, పింఛన్ పైసల్ యాదికొచ్చినయి.
ఎంబటే ఇంటిమోకాన వోయిన. కొత్త దోతి సుట్టుకుంటా.. ‘లక్ష్మీ.. గా ఏటీఎం కారటియ్యే’ అంటే తీసుకొచ్చి జేబుల వెట్టింది. ఏటీఎం కారట వట్టుకొని ఎక్సెల్ బండి మీద కన్నారం వోయిన. కొత్త మోటర్ గావాల్నని దుఖానమాయ్ననడిగితే మొత్తం 35,007 రూపాల లెక్కజెప్పిండు.
నిమిషం ఆలోచన జేయకుండా జేబులకెళ్లి కారట తీసిచ్చిన. కొత్త మోటర్ ఆటోలొచ్చింది. నేను నా బండిమీదొచ్చిన. గుండ్లపల్లి స్టేజీ రాంగనే ఆటో ఆపి కలరు దుకాన్లకు వోయిన. ఓ శిన్న కలర్ డబ్బా కొనుక్కొచ్చి కొత్త మోటర్ మీద ‘జై కేసీఆర్, జై రైతుబంధు, జై ఆసరా పింఛన్’ అని రాపిచ్చిన. నేను నియ్యతిగళ్ల మనిషిని. అవును మరి, అన్నం వెట్టినోన్ని అట్టిగనే మర్శిపోతమా?
– గడ్డం సతీష్ 99590 59041