తెలంగాణ ఉద్యమం పల్లెల్లోకి చొచ్చుకుపోవటానికి, విస్తరించటానికి, బలపడటానికి నీళ్ల నినాదమే ఆయుధం అయింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నీళ్లే ఆధారం. రైతులు, కూలీలు, కులవృత్తులు, చేతివృత్తులు, సబ్బండ జాతులన్నీ కలిస్తేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. ఈ వ్యవస్థకు మూలం వ్యవసాయం. నీళ్లుంటేనే పల్లె పచ్చగా ఉంటుంది. నీళ్ల విలువేంటో తెలిసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్లో ఏటా రూ.25 వేల కోట్ల నిధులు ప్రాజెక్టులకు కేటాయించి, కోటి ఎకరాల మాగాణికి జీవం పోసిండు. గోదావరిలో మనకొచ్చే 954 టీఎంసీల వాటాలో చుక్క నీళ్లు కూడా వృథాగా పోకుండా జల ప్రాజెక్టులను మలిచిండు. ఇప్పుడు నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను బలవంతంగా తీసుకుపోయి కావేరిలోకి మళ్లించి దిగువ రాష్ర్టాల్లో ఓట్ల సాగుకు మోదీ సర్కారు తహతహలాడుతున్నది.
Telangana | కృష్ణా నదిలో 79 శాతం పరీవాహక ప్రాంతం తెలంగాణలోనే ఉంది. అంటే ముప్పావు వంతు జలాల వాటా తెలంగాణకు దక్కాలే. కృష్ణానది నీటి లభ్యత 811 టీఎంసీలు. ఈ లెక్కన కనీసం 600 టీఎంసీలు తెలంగాణకు రావాలే. కానీ, అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం తెలంగాణకు 161 టీఎంసీలు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ వాటాను 111కు కుదించింది. పోయిన నీళ్లు ఎలాగు పోయాయి, కనీసం ఉన్న గోదావరి జలాలనైనా పోతం చేసుకుందామంటే కేంద్రం తెరమీదకు తెచ్చిన నదుల అనుసంధానంతో మళ్లీ తెలంగాణను ఎండబెట్టే కుట్రకు తెరదీసినట్టు కనబడుతోంది.
ఒడిశా రాష్ట్రంలోని మహానదిలో 360 టీఎంసీలు, గోదావరిలో 530 టీఎంసీలు మొత్తం కలిసి 890 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని కేంద్ర జల సంఘం లెక్కలు గట్టింది. నిబంధనల ప్రకారమైతే.. ఏ నది జలాలైనా పరీవాహక ప్రాంత ప్రజల ప్రస్తుత, కనీస భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని లెక్కలు గట్టాలి. అంటే మరో 30 ఏండ్ల నాటికి పెరగనున్న జనాభా, వారికి అవసరమైన నీటి పరిమాణాన్ని అంచనా వేసి నిర్ధారించాలి. ఆ తర్వాతే మిగులు జలాలను గుర్తించాలి. కానీ, కేంద్రం మాత్రం 20 ఏండ్ల కిందట 75 శాతం నీటి లభ్యతతో తీసిన లెక్కలతో మిగులు జలాలు చూపిస్తున్నది. ఆ లెక్కలు ఇప్పటి నీటి లభ్యతతో ఎలా సరిపోలుతాయి? ఈ తొండి లెక్కలతోనే మహానదిని గోదావరితో కలిపి, గోదావరిని కృష్ణానది మీదుగా కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న కావేరి నదికి అనుసంధానం చేయాలని చూస్తున్నది.
నిజానికి అవి తెలంగాణకు ఎవరూ దిక్కు లేనప్పుడు తీసిన లెక్కలు. కేసీఆర్ వచ్చాక లెక్క మారింది. భవిష్యత్తు అవసరాలపై కేసీఆర్కు పక్కా ప్రణాళిక ఉంది. నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల కింద 433.04 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద 475.79 టీఎంసీలు, చేపట్టబోయే ప్రాజెక్టుల కింద 45.38 టీఎంసీలు మొత్తం కలిపి 954 టీఎంసీల జలాలు మనకు అవసరమవుతాయని నిగ్గు తేల్చారు. ఇంక మిగులు జలాలు ఎక్కడున్నాయి. గోదావరిపై కాళేశ్వరం, కంతనపల్లి, తుపాకుల గూడెం, దుమ్ముగూడెం, దేవాదుల ప్రాజెక్టులకు రూపం వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు చేతికి అందింది. గోదావరి నీళ్ల వినియోగం పెరిగింది. నదిని ఎత్తిపోసి కోటి ఎకరాలకు కేసీఆర్ నీళ్లు అందించారు. కాంగ్రెస్ పాలకులకు ఇంకా జలాల గణాంకాలు అర్థం కావటం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుల గేట్లకు మూతపెట్టి.. కాంగ్రెస్ పార్టీ గేట్లు ఎత్తటం ఎట్లా అనే అంశం వద్దనే వారు ఆగిపోయారు.
నదుల అనుసంధానం అనేది ఇప్పటి ముచ్చటేమీ కాదు. 1960లో తొలిసారి ఈ అంశం చర్చకు వచ్చింది. 4,200 కిలోమీటర్ల పొడవైన హిమాలయ ప్రాంత కాల్వలను, 9,300 కిలోమీటర్ల పొడవైన దక్షిణ ప్రాంత కాల్వలను ఢిల్లీ పట్నాల వద్ద కలపాలని కెప్టెన్ దస్తూన్ తొలిసారి ప్రతిపాదించారు. ఆ తర్వాత 1972లో అప్పటి కేంద్ర మంత్రి, ఇంజినీరు కేఎల్ రావు.. కావేరి-గంగా నదులను అనుసంధానం చేయాలనే ప్రతిపాదన చేశారు.
సోన్, నర్మద, పెన్గంగ, ప్రాణహిత, గోదావరి, కృష్ణా నదుల మీదుగా కావేరి నదితో అనుసంధానం చేయాలని సూచించారు. ఈ రెండు కూడా ఆచరణ సాధ్యం కాదని అప్పట్లోనే పార్లమెంట్ తేల్చి చెప్పింది. అప్పట్లోనే సాధ్యం కాదని తేల్చిన అంశాన్నే మోదీ ప్రభుత్వం పట్టుకొని వేలాడుతున్నది.
గోదావరి నీళ్లను తరలించాలంటే.. ముందుగా మహానదిని తీసుకొచ్చి గోదావరితో అనుసంధానం చేయాలి. మహానది మిగులు జలాలను గోదావరి నీళ్లతో కలపాలి. అది నిబంధన. కానీ, మహానదిలో అసలు మిగులు జలాలే లేవని, లేని మిగులు నీళ్లను తరలిస్తే ఊరుకునేది లేదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెగేసి చెప్పారు. అయినా మోదీ సర్కార్ ఆగటం లేదు. దక్షిణాది రాష్ర్టాల్లో జల యుద్ధాలు సృష్టించి, నెత్తుటేర్లు పారించి, ఆ రక్తంతో కమలం పూల సాగుబడి చేయాలని మోదీ పాచికలు వేస్తున్నారు. రాష్ర్టాల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోకుండా మొండిగా నదులను అనుసంధానం చేసి తెలంగాణ మాగాణాన్ని ఎండబెట్టి గోదావరి జలాలను కృష్ణా, కావేరిలకు పంపించే ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు.
మోదీ దక్షిణాది రాష్ర్టాల మధ్య నీటి కయ్యాలు పెట్టే బదులు పశ్చిమ కనుమలపై దృష్టి పెట్టాలి. పశ్చిమ కనుమల్లో ఏటా కుంభవర్షాలే కురుస్తాయి. అది స్థిరమైన వర్షపాతం. ఏటా వేల కోట్ల క్యూసెక్కుల జల ప్రవాహం ఉంటుంది. ఇందులో 90 శాతం నీళ్లు పశ్చిమంగా ప్రవహించి వృథాగా అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. పైగా అంతా గుట్టలు, లోయలతో కూడిన ప్రాంతం కాబట్టి వ్యవసాయ భూమి, నివాస ప్రాంతాలు కూడా తక్కువే. ఈ నీళ్లకు కట్టలు వేసి, మలిపితే భారత ఉపఖండాన్ని సస్యశ్యామలం చేయవచ్చు. మోదీ ముందుగా ఈ జలాల వినియోగంపై దృష్టి పెట్టాలి. వీటిలో 25 శాతం వంతు నీళ్లను ఒడిసిపట్టుకుని, తూర్పు దిశగా తీసుకువచ్చి మహానదిలోకి మళ్లిస్తే ఆ జలాలు గోదావరి, కృష్ణాల మీదుగా కావేరి నదిని తడుతాయి. అప్పుడు నాలుగు నదులేమిటి? దక్షిణ భారతంలోని నదులన్నింటినీ అనుసంధానం చేయవచ్చు.
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు