కాంగ్రెస్ పార్టీ అధినేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు తోడుగా మరికొన్ని గ్యారెంటీలను రాష్ట్ర పర్యటనలో ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వరుస గ్యారెంటీలను ప్రకటిస్తున్నా వాటిపై తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఇంతవరకు సానుకూల స్పందన కనిపించకపోవడం గమనార్హం. వార్తా మాధ్యమాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. పర్యవసానంగా మారుమూల గ్రామాల్లోని ప్రజలకు సైతం విషయ పరిజ్ఞానం విరివిగా పెరిగింది. ఈ పరిణామాలతో ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీల అధినేతలు ఇచ్చే హామీలను ప్రజలు గతంలో వలె గుడ్డిగా నమ్మే పరిస్థితి ప్రస్తుతం లేదు. హామీలు ఇచ్చే వారి నిబద్ధత, కార్యదక్షతతో పాటు హామీల అమల్లో సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తాము ఎవరి హామీలు నమ్మవచ్చో ప్రజలు నిర్ణయించుకుంటున్నారు.
గత నాలుగు దశాబ్దాల్లో నాటి ఉమ్మడి రాష్ట్రంలో, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల ప్రభావం అమాంతం పెరిగింది. దీంతో బాధ్యతాయుతమైన స్థానిక రాష్ట్ర నాయకత్వం మాటకు ప్రజలు విలువనిచ్చే పరిస్థితి ఏర్పడింది. జాతీయ పార్టీల్లో కూడా రాష్ట్ర స్థాయిలో ప్రజలను ప్రభావితం చేసే రాష్ట్ర నాయకులు ఒక్కరైనా ఉన్నప్పుడే ఆ రాష్ర్టాల్లో జాతీయ పార్టీలు మనుగడ సాగించే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీ, తమిళనాడు, కర్ణాటక లాంటి దక్షిణాది రాష్ర్టాల్లో గత నలభై ఏండ్లుగా కొనసాగుతుండటం గమనార్హం. 2004, 2009 వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు విజయం సాధించి ఉమ్మడి రాష్ర్టాన్ని పదేండ్లు పాలించింది.
2004 ఎన్నికలకు ముందు అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో చేసిన పాదయాత్ర ద్వారా ప్రజలకు అనేక హామీలిచ్చారు. ఆయన మాటలను విశ్వసించిన ప్రజలు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టం కట్టారు. అలా రెండుసార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా ఇటీవల కర్ణాటక శాసనసభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానం ఐదు గ్యారెంటీలను హామీగా ఇచ్చింది. ఆ గ్యారెంటీల వల్లే కర్ణాటకలో విజ యం సాధించామని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. అందుకే తెలంగాణలోనూ ఆరు గ్యారెంటీల పేరుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గ్యారెంటీల వల్లే కర్ణాటకలో గెలిచామని భావించడం కాంగ్రెస్ అవగాహనా రాహిత్యాన్ని తేటతెల్లం జేస్తున్నది. తన అపార అనుభవంతో కర్ణాటక ప్రజలను ప్రభావితం చేయగలిగిన సిద్ధ్దరామయ్య లాంటి నేతకు డీకే శివకుమార్ లాంటి ఆర్థిక పుష్టి కలిగిన నేత ఆ ఎన్నికల్లో తోడయ్యా రు. కాంగ్రెస్ను గెలిపిస్తే ఆ ఐదు గ్యారెంటీలను తాము అమలు చేస్తామని వారిరువురు ప్రజలకు గ్యారెంటీ ఇచ్చారు. వారిని విశ్వసించిన కర్ణాటక ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారనేది అక్షర సత్యం.
ఎన్నికల సమయంలో రాష్ర్టాలకు వచ్చి ప్రజలకు హామీలనిచ్చే ఢిల్లీ నాయకులను ప్రజలు పరిగణనలోకి తీసుకునే పరిస్థితి దక్షిణాది రాష్ర్టాల్లో లేదనేది నిర్వివాదాంశం. ఆ పరిస్థితి ఇందిరా గాంధీతోనే ముగిసిందని కచ్చితంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం గత దశాబ్ద కాలంగా నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతుందనే వార్తలు దేశవ్యాప్తంగా బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న గ్యారెంటీ ఇప్పటి వరకు లేదు.
తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీల భాగస్వామ్యం అంతంత మాత్రం కావడంతో కేసీఆర్కే రెండుసార్లు తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ దశాబ్దానికి పైగా అలుపెరుగని వీరోచిత పోరాటం చేశారనేది జగమెరిగిన సత్యం. అందువల్లే తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ను పేటెంట్గా భావించి ప్రజలు కేసీఆర్కు రెండుసార్లు అధికారం ఇచ్చారు. కేసీఆర్ ఇచ్చిన హామీలతోపాటు, ఇవ్వని అనేక హామీలను కూడా నెరవేర్చారు. దీంతో ప్రజలు ఆయనకే వరుస అవకాశాలు ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్లో అనేక మంది పేరుపొందిన నేతలున్నారు. కానీ వారిలో రాష్ట్ర ప్రజలను ప్రభావితం చేయగలిగిన నిబద్ధత, అనుభవజ్ఞుడైన నేత ఒక్కరూ లేరు. మరోవైపు సిద్ధరామయ్యలాంటి సీనియర్ నాయకుడు కర్ణాటక ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారెంటీలను అమలుచేయటంలో విఫలమైనట్టు అనేకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కర్ణాటక రైతులు సైతం తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చే గ్యారెంటీలను అమలుపరిచే గ్యారెంటీ ప్రాతిపదిక ఏమిటీ? దానికి గ్యారెంటీ ఎవరు? అనే ప్రశ్నలు తెలంగాణ ప్రజల్లో మెదులుతున్నాయి. అలాగే రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులకు ఒక్కొక్కరికి రూ.5లక్షలు ఇవ్వటం కాంగ్రెస్కు ఎలా సాధ్యమవుతుంది. లక్షలాదిమంది విద్యార్థులకు లక్ష విలువచేసే ఎలక్ట్రిక్ బైక్ ఇవ్వటం సాధ్యమేనా? ఇది ఆర్థిక నిపుణులకు కూడా అంతుచిక్కటం లేదు. ఇవ్వేకాదు ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచటం సాధ్యమయ్యే పనికాదు.
ఇక ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఆ సమయంలో ఏ ఒక్క బీసీ నాయకుడికి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించలేదు. ఇటీవల బీసీలకు సీట్లు కేటాయించే విషయంలో పార్టీతో విభేదించి పొన్నాల లక్ష్మయ్య వంటి బీసీ నేత పార్టీని వీడారు. ఈ విషయాలను విస్మరించి కాంగ్రెస్ అధిష్ఠానం పదేపదే బీసీల గురించి ప్రస్తావించటం వల్ల ఒనగూడే ప్ర యోజనం ఏమీ ఉండదు. రాజకీ య పార్టీలు ఆమోదయోగ్యమైన హామీలు ఇచ్చినప్పుడే వాటి వల్ల పార్టీలకు లబ్ధి చేకూరుతుంది. అ లాకాకుండా తామేం చెప్పినా ప్ర జలు నమ్ముతారని భావిస్తే నవ్వు ల పాలుకావడం ఖాయం. ఇప్పు డు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలం గాణలో అలాగే ఉన్నది.
– కైలసాని శివప్రసాద్
94402 03999