‘ఒక్క చాన్స్’ అంటూ కాంగ్రెస్ గుప్పించిన ఆరు హామీలను చూస్తుంటే ‘ముసలి పులి-బంగారు కంకణం’ కథ గుర్తుకురాక మానదు. ఆశ చూపి అమాంతంగా మింగేయడం వయసుడిగిన కాంగ్రెస్ పులికి అలవాటే. కానీ తెలంగాణ ఓటర్లు ఆశ చూపితే బుట్టలో పడిపోయేంత అమాయకులు కారు. మరోవైపు కర్ణాటక సక్సెస్ మీద తెలంగాణ కాంగ్రెస్ మరీ ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్టే కనిపిస్తున్నది. అక్కడ ఎడాపెడా హామీలు గుప్పించారు. ‘అన్నభాగ్య’ పథకం కింద పేద కుటుంబాలకు ఐదేసి కిలోల చొప్పున బియ్యం పంపిణీ పట్టాలెక్కలేదు. బియ్యం ఇయ్యలేక కిలోకు రూ.34 చొప్పున డబ్బు లెక్క కట్టిస్తున్నారు. మిగతా హామీలు కూడా నత్తనడకన నడుస్తున్నాయి. కాంగ్రెస్ పరిపాలన తీరుతెన్నులు చూసి ఓడిపోయిన బీజేపీ లేచి కూర్చుంది. వంద రోజుల పాలనపై ఏకిపారేసింది. అసలు కర్ణాటకలో బీజేపీ కొంప ముంచింది మతతత్వం, అవినీతి.
బీజేపీపై వ్యతిరేకతతో ప్రత్యామ్నాయం లేక అక్కడి ప్రజలు కాంగ్రెస్ను గెలిపిస్తే మూడునెలల్లో హామీలు అమలు చేయలేక మూలకు పడింది. అవినీతి ఆరోపణలతో స్కాంగ్రెస్ అనే ముద్దుపేరును సార్థకం చేసుకున్నది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ హామీల దస్త్రం దులిపింది. కర్ణాటకలో ఇచ్చిన ఐదు హమీల తరహాలోనే మరొకటి చేర్చి ఆరు హామీలంటూ తెలంగాణ ఓటర్లకు వల వేస్తున్నది. ఆ హామీలకు ‘గ్యారెంటీలు’ అని పేరుపెట్టడమే వారి చిత్తశుద్ధిలేమిని పట్టిచ్చే విషయం. వారంటీ తీరిపోయిన పార్టీ ఇచ్చే గ్యారెంటీలు ఎందుకో తెలుసుకోలేనంత ఎడ్డోల్లు కాదు తెలంగాణ ప్రజలు. తాము అధికారంలో ఉన్నచోట అమలుచేయలేని హామీలను ఇస్తూ వంచనే తమ నైజమని చాటుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. పైగా ఆ గ్యారెంటీలు ఏవీ కొత్తవి కావు. ఇదివరకే తెలంగాణ సర్కారు అమలు చేస్తున్నవాటిని ‘అర్రాసు’ పాట తరహాలో ఇంకొంచెం పెంచి ఇస్తామని అంటున్నది.
కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ కొలతలు పెట్టుకొని గెలిచిన పార్టీ కాదు. తెలంగాణ సాధించాం. బంగారు తెలంగాణ సాధిస్తామని ధీమాగా ఓటరు ముందుకువెళ్లి అండదండలు అందించమని కోరింది. మొదటి విడత తర్వాత రెండో విడతకు వెళ్లేముందు తమ పాలన చూసి ఓటెయ్యమని బీఆర్ఎస్ అడిగింది. సంపద పెంచడం, నలుగురికీ పంచడం అనే విధానంతో ముందుకువెళ్లింది. అభివృద్ధిని పట్టాలెక్కించి సంక్షేమాన్ని సరైన మార్గంలో నడిపింది. హామీ ఇచ్చినవీ, ఇవ్వనివీ అమలుచేసింది. ఉచిత కరెంటు, సాగునీటితో వ్యవసాయాన్ని పండుగగా మార్చింది. రైతుబంధుతో రుణ బాధలు లేకుండా చేసింది. రైతు బీమాతో కుటుంబాలకు ధీమా కల్పించింది. కరెంటు కష్టాలు కడతేర్చి, నీటి ఎద్దడిని తరిమికొట్టింది. అందుకే ఇవ్వాళ తెలంగాణ పచ్చగా కళకళలాడుతున్నది. పింఛన్లతో నిస్సహాయులకు తోడునీడగా నిలిచింది. కులవృత్తులకు బలం చేకూర్చింది. విద్య, వైద్యరంగాల అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కల్పనలో ఆదర్శంగా నిలిచింది. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, తాజాగా బడిపిల్లలకు ఉదయం పూట అల్పాహారం సమకూరుస్తూ అన్నివర్గాల ఆలనాపాలనా చూసుకుంటున్నది.
‘మక్కీకి మక్కీ మేరె భాయ్ లిక్కీ’ అన్నట్టుగా కాంగ్రెస్ ఇప్పుడు కాపీకి తెగబడింది. వారికంటే నేను ఒకటి ఎక్కువే ఇస్తా అనే మారుబేరాలకు ఒడిగట్టింది. పింఛన్ రూ.2500కు పెంచుతాననడం, రైతుబంధు రూ.15 వేలు ఇస్తాననడం అలాంటివే. ఇక గ్యాస్బండ రూ.500కు ఇస్తామంటున్నారు. ఇది కేంద్రం చేతుల్లో ఉండే వ్యవహారం. ధర ఎలా తగ్గిస్తారో చెప్పలేదు. సొంతంగా భరించాలంటే కష్టమే. ఉచ్చిలికిపోయి ఎక్కువ నష్టానికి చీటీ పాడుకోవడం లాంటిదే ఇది. ఒక అంచనా ప్రకారం కాంగ్రెస్ ఇచ్చే హామీలు అమలు చేయాలంటే మొత్తంగా మన రాష్ట్ర బడ్జెట్ వాటికి కేటాయించినా సరిపోదు. బడ్జెట్ను దాటి హామీలు ఇస్తున్నారంటేనే వారిలో నిస్పృహ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
కాంగ్రెస్ గ్యారెంటీ హామీలకు రూ.2.9 లక్షల కోట్లు కావాలి. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ రూ.2.77 లక్షల కోట్లు మాత్రమేననేది గమనార్హం. అమలు సాధ్యం కాని హామీల వల్ల రాష్ట్ర భవిష్యత్తు అంధకారమవుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రజలు కూడా ఈ హడావుడి హామీలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎక్కడో లెక్క తప్పిందనే పితలాటకం కాంగ్రెస్ నేతల్లోనే మొదలైందంటే ఈ హమీల కథ అర్థమైపోతుంది. ఆదాయం పెంచే మార్గాలు చూపకుండా ఇష్టారాజ్యంగా హామీలు ఇవ్వడం కాంగ్రెస్కు కొత్తకాదు. మాట ఇచ్చి ధోఖా చేయడం ఆ పార్టీ నైజమే. తెలంగాణ సాధించుకునే విషయంలో ఇక్కడి ప్రజలకు అది అనుభవైకవేద్యమే. తెలంగాణ బిడ్డల ఉసురు తగిలి మూలనపడ్డ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెప్తే ఎవరు నమ్ముతారు? మంత్రి కేటీఆర్ అన్నట్టుగా.. తెలంగాణ అమాయక గడ్డ కాదు. దాచి దాచి దయ్యాల పాలు చేయదు’.