Ration Cards | తెల్ల రేషన్కార్డు ఉన్నవారికి మాత్రమే ఆరు గ్యారెంటీల ఫలాలు అందుతాయని కాంగ్రెస్ సర్కార్ నిబంధనలు పెట్టడంతో ఎంతోమంది పేదలు ఆందోళన చెందుతున్నారు. అర్హులైనప్పటికీ చాలామంది సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో అందరికీ లబ్ధి చేకూరుస్తామని చెప్పి.. ఇప్పుడు మాటమార్చడం సరికాదు. ప్రజాపాలన అని చెప్పుకొంటూ ఇలా చేయడం రేవంత్రెడ్డి సర్కార్కు తగదు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మొదటినుంచి గందరగోళంగానే ఉన్నది. పాలనలో ఒక పద్ధతి అంటూ లేకుండాపోయింది. పేరుకే ప్రజాపాలన అని చెప్తున్నారు గానీ, ప్రజాపాలన కాదిది. ప్రజలు ఆందోళనలకు గురయ్యే పాలన ఇది. రేషన్కార్డులు ఇవ్వకుండానే గృహజ్యోతి తదితర పథకాలకు తెల్లకార్డు ఉన్నవారే అర్హులని పేర్కొనడం ఎంత వరకు సమంజసం? అధికారమే లక్ష్యంగా హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికళ వేళ అరకొరగా పథకాలు ఇచ్చి మరోసారి లబ్ధి పొందాలని చూస్తున్నది. కొంతమందికే ఇచ్చి అందరికీ ఇచ్చామని ప్రచారం చేసుకోవాలని భావిస్తున్నది. ప్రతి పథకానికి రేషన్కార్డు ప్రామాణికం అయినప్పుడు మొదటగా కొత్త రేషన్కార్డులను మంజూరు చేసి ఆ తర్వాతే పథకాలను ప్రారంభించాలి కదా! లక్షల మంది లబ్ధికి దూరమవుతుంటే అది ప్రజాపాలన ఎలా అవుతుంది?
కేసీఆర్ పదేండ్ల పాలనలో కొత్తగా ఒక్క రేషన్కార్డు కూడా మంజూరు చేయలేదని కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేశారు. పదేపదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లారు. అబద్ధాలు చెప్పి.. చెప్పి.. అదే నిజమనే భావన కలిగించారు. కానీ, వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వం సుమారు ఆరు లక్షలకు పైగా కొత్త రేషన్కార్డులు మంజూరు చేసింది. అయితే ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ నాయకులు పూర్తిగా విఫలమయ్యారు. ‘మేం వస్తే అందరికీ రేషన్కార్డులు ఇస్తాం’ అని నమ్మబలికిన కాంగ్రెస్ ఆయా వర్గాల ఓట్లను కొల్లగొట్టింది. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కొత్త రేషన్కార్డులు ఇవ్వడంలో జాప్యం చేస్తుండటంతో అనేకమంది సంక్షేమ పథకాలను అందుకోలేకపోతున్నారు. రేషన్కార్డులు ఇచ్చాకే పథకాలను అమలు చేసి పేదలకు న్యాయం చేయాలి.
ప్రజాపాలన పేరిట దరఖాస్తులు తీసుకున్నప్పుడు కూడా గందరగోళం నెలకొంది. మొదట్లో రేషన్కార్డు ఉన్నవారు మాత్రమే దరఖాస్తులు చేయాలని చెప్పారు. ఈ నిర్ణయంపై రేషన్కార్డు లేని వారి నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో తెల్లకాగితాలపై ‘రేషన్కార్డు కావాలి’ అని రాసివ్వాలని చెప్పారు. ఇప్పుడు ఆ తెల్లకాగితాలు ఎక్కడు ఉన్నాయో తెలియడం లేదు.
రేషన్కార్డులు లేకపోయినా అర్హులైనవారికి సంక్షేమ పథకాలు అందించాలి. వెంటనే కొత్త రేషన్కార్డులు మంజూరు చేయాలి. తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏ పథకమూ అమలయ్యే సూచనలు కనిపించడం లేదు. ఎన్నికలయ్యాక పట్టపగలే చుక్కలు చూసే రోజులు రావొచ్చు. మరోసారి మోసపోతే మనమే గోసపడతాం. అందుకే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలి.
– గుండమల్ల సతీశ్ కుమార్ 94931 55522