Telangana | తెలంగాణ గురించి ఏమీ తెలియని నడ్డా మొదలు కొత్తగా తెలంగాణ నా మెట్టినిల్లు అని రాజకీయం మొదలుపెట్టిన షర్మిల వరకు అందరూ తెలంగాణ ఉద్యమ ఆశయాల గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణకు గ్యారంటీలు అంటూ ఊదరగొడుతున్నారు. ఈ తొమ్మిదేండ్లలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఒక్కటీ నెరవేరలేదని కాంగ్రెస్ నాయకులు ఊరూరా శోకాలు పెట్టారు. తెలంగాణ ఆకాంక్షలను కేసీఆర్ సమాధి చేశారని దుమ్మెత్తిపోశారు. అంత మాట్లాడారు కాబట్టి కాంగ్రెస్ నాయకులు తుక్కుగూడ వేదికగా నిర్వహించిన సభలో ప్రజలకు ఇచ్చే గ్యారెంటీల్లో ఆ ఆకాంక్షలు ప్రతిఫలిస్తాయని అంతా ఊహించారు. కానీ ఆ గ్యారంటీల్లో ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి ఒక్క పదం కూడా లేదు.
కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలు చూస్తే తెలంగాణ ఉద్యమం 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కోసమో, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కోసమో జరిగినట్లు కాంగ్రెస్ భావించిందనుకోవాలా? ఇవే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలని కాంగ్రెస్ అనుకుందనుకోవాలా? రాజు వేషం వేస్తే చాలదు. రాజులాగా ప్రవర్తన కూడా ఉండాలి. తెలంగాణ అంటే చాలదు.. తెలంగాణను అణువణువునా ఆవహించుకోవాలి. ఈ భృత్య కాంగ్రెస్ గణానికి అంత సీనెక్కడిది?
నీళ్ల నిర్వాకం ఒక్కటే చాలు..!
తెలంగాణ ఉద్యమ ఆశయాల్లో మొదటిది నీళ్లు. 1952 నుంచి 2014 వరకు సింహభాగం పాలన సాగించిన కాంగ్రెస్ నీటి పారుదల రంగంలో చేసిన నిర్వాకం గురించి చెప్పుకోకపోతే తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ ధోరణి అర్థం కాదు. ఏపీ ఏర్పడకముందు తెలంగాణలో గంగాళాల వలె ఉన్న చెరువులు సమైక్య రాష్ట్రంలో తాంబాళాల్లా మారిపోయాయి. నిజాం రాజ్యంలో నిర్ణయించిన ప్రాజెక్టులు ఆగిపోయాయి. పెద్ద మనుషుల ఒప్పందంలో నీటిపారుదల రంగంలో రక్షణలు అమలుకాలేదు. భూగర్భ జలాలు అడుగంటాయి. బోరు బావుల పాలైన వ్యవసాయం రైతుల ఆత్మహత్యలకు కారణమైంది.
తొమ్మిదేండ్లలోనే ఎంత మార్పు?..
తెలంగాణ వచ్చింది. దేవుని దయ వల్ల కాంగ్రెస్ కాకుండా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కేవలం తొమ్మిదేండ్లకే ఈ రోజు వరి పంట రికార్డు స్థాయిలో వచ్చింది. దీనికి కారణం ఏమిటో కాంగ్రెస్ చెప్పాలి. నీటి వసతి ఉన్న వ్యవసాయ భూముల విస్తీర్ణం 117 శాతం పెరిగింది. 62.48 లక్షల ఎకరాల నుంచి 135 లక్షల ఎకరాలకు పెరిగింది. 2014-15 నాటి వరి పంట 45.71 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి, ప్రస్తుతం 202 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఇదంతా ఎట్లా సాధ్యమైందో కాంగ్రెస్ లేక బీజేపీ జవాబు చెప్పాలి. కానీ ఆ దబాయింపు సెక్షన్కు ఈ అభివృద్ధి పట్టదు. అభివృద్ధి కోణం ప్రజాకోణం అనేది ఆ పార్టీల డీఎన్ఏలో మచ్చుకు కూడా లేదు.
వారిది పల్లేర్లు మొలిపించిన పాలన
తెలంగాణ ఏర్పడకముందు నీటిపారుదల రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేశాయో పరిశీలిస్తే కానీ, ఈ ద్రోహం అర్థం కాదు. వారి పాలనలో చెరువుల్లో ఇసుక మేట వేసి పొలాలు బీళ్లు పడ్డాయి. చెరువులు ఎండటంతో భూగర్భ జలాలు కూడా అడుగంటి ఒకప్పుడు ఊరూరా ఉన్న మోట బావులు, రాట్నం బావులు, దిగుడు బావులు అన్నీ ఎండి పోయాయి.
‘పల్లే పల్లెనా పల్లేర్లు మొలిసే నా పాలమూరులోనా.. మన తెలంగాణలోనా’ అని పాడుకున్న దైన్యానికి కారణమెవరు? కృష్ణా నదీ జలాలు తరలించుకుపోయినప్పుడు కిమ్మనకుండా ఉన్నదెవ్వరు? కృష్ణా నది తడపకపోవటంతో నల్గొండలో పెరిగిన ఫ్లోరోసిస్కు కారణమెవరు? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబుగా ఎవరి చూపుడువేలైనా తిరిగేది కాంగ్రెస్ వైపే.
సాగరమంత మోసం
1930లో హైదరాబాద్ ప్రభుత్వం, చీఫ్ ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్జంగ్ ఆధ్వర్యంలో కృష్ణానదిపై ఏలేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టి తెలంగాణకు నీళ్లివ్వాలని పథకాలను సిద్ధం చేసింది. కానీ, ఆంధ్రాలోని నందిగామ వాసి, ప్రణాళికా సంఘం సభ్యుడు కే.ఎల్.రావు ప్రాజెక్టును ఏలేశ్వరం నుంచి నందికొండకు మార్పించడంతో నాగార్జునసాగర్ పేరిట తెలంగాణకు జరిగిన మోసం మొదలై చాలా ఏండ్లు కొనసాగింది. 1954లోనే ఈ మోసం జరిగినా, ఆఫ్ట్రాల్ ఓ అధికారి ఇంతమంది కండ్లు గప్పి మోసం చేస్తున్నా… మన కాంగ్రెస్ పాలకులకు అర్థం కాలేదు. ఆంధ్రా-హైదరాబాద్ జాయింట్ ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం తెలంగాణకు ఎత్తిపోతలు అంటే లిఫ్టుల ద్వారా సాగునీరు అందించాల్సిన విషయం 1969 వరకు గుర్తుకురాలేదు. ఆ తర్వాత రకరకాల కారణాలతో అసలు లిఫ్టులే ఏర్పాటు కాలేదు. చివరికి తెలంగాణలో ఆయకట్టును తగ్గించడం, తెలంగాణకు నీరందించే ఎడమ కాలువలో బెడ్ లెవెల్ తగ్గించడం, ప్రవాహం కంటే ఎక్కువ ఎత్తులో తూములను కట్టడం వంటి మోసపూరితమైన విధానాలను ఒక్క నేతా ప్రశ్నించలేదు. సచివాలయంలో సీట్లు, జేబుల్లో నోట్లు వారిని మాట్లాడనివ్వలేదు.
జల విజ్ఞానం లేని నేతలు…
1954లో బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మోసాన్ని అర్థం చేసుకోలేక పోయిందనుకుంటే, 1971లో నాగార్జునసాగర్ పూర్తయేంత వరకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా ఎందుకు పట్టించుకోలేదన్నదానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ మీదే ఉన్నది. ఇప్పుడు నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం దీనికి జవాబు చెప్పాలి. అసలు జలవిజ్ఞానం లేని నాయకులు తెలంగాణకు ప్రాతినిథ్యం వహించడం ఈ ప్రాంత దౌర్భాగ్యం. నాగార్జునసాగర్ విషయంలో ఎన్నిరకాల వివక్ష జరిగిందంటే, కృష్ణా తీరంలో తెలంగాణ వైపు ముంపునకు గురైన 47 గ్రామాల్లో చారిత్రక ఆధారాల కోసం సమగ్ర సర్వే కూడా చేయలేదు. 1954 నుంచి 1956 వరకు నాగార్జునసాగర్ జలాశయంలో మునిగిపోనున్న ఏలేశ్వరంలో మాత్రమే తవ్వకాలు జరిగాయి. ఇక 1956 తర్వాత సర్వే చేయలేదు. అందుకే నాగార్జునసాగర్లో మునిగిన ప్రాంతాల్లో ఒక్క ఏలేశ్వరం తప్ప మిగతా అన్ని గ్రామాలు తన చరిత్రను గర్భంలోనే దాచేసుకొని నీట మునిగాయి. ఇక్ష్వాకుల చరిత్ర కృష్ణకు రెండు వైపులా ఉన్నా ఆంధ్రా వైపు పథకం ప్రకారం తవ్వకాలు జరిగి నాగార్జున కొండ మీద కొలువై చారిత్రక వారసత్వంగా మిగిలింది. కానీ, తెలంగాణ వైపు చరిత్ర నాగార్జున సాగర గర్భంలో శాశ్వతంగా నిమజ్జనమై పోయింది.
పాలమూరు వెతల కారకులెవరు?
అప్పర్ కృష్ణా, భీమా ప్రాజెక్టులు, తుంగభద్ర కాల్వల నిర్మాణం కోసం నిజాం ప్రభుత్వం నుంచి 1951లో వెల్లోడి నేతృత్వంలోని సివిల్ గవర్నమెంట్ వరకు పథకాలు వేసి, చివరికి కేటాయిపులు కూడా సాధించినా, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో అన్ని పథకాలు అటకెక్కినాయి. దీనికి కారణం నీలం సంజీవరెడ్డి. చరిత్ర మొత్తంలో తెలంగాణేతర కాంగ్రెస్ నాయకుల అక్రమాలకూ, దాష్టీకాలకు తెలంగాణ నాయకులు ఆక్షేపణను తెలపడం అటుంచి, వారి అడుగులకు మడుగులొత్తినారనే చెప్పాలి. అందుకే మలిదశ ఉద్యమకాలంలో రాజోలిబండపై బాంబులు వేసైనా రాయలసీమకు నీళ్లు తీసుకుపోతామని అంటే తెలంగాణ ఉద్యమకారులే ఎదిరించారు కానీ ఒక్క కాంగ్రెస్ నాయకుడూ చాలెంజ్ చేయలేదు. గోదావరి మీద కూడా ఇచ్చంపల్లి, పెన్గంగ, దేవనూరు, ప్రాణహిత ప్రాజెక్టులను ఆపేసి, పోచంపాడును కుదించిన వాడు నీలం సంజీవరెడ్డి. ఒకవైపు ఆంధ్రా కాంగ్రెస్ నాయకులు కుట్రలతో అన్యాయం చేస్తే, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తమ చేతగానితనంతో ఆంధ్రా ముఖ్యమంత్రుల కరుణ కటాక్షాల కోసం వెంపర్లాడారు. అందుకు ఉదాహరణ తెలంగాణకు చెందిన మంత్రులే భారీ నీటి పారుదల శాఖ ఎక్కువ కాలం నిర్వహించినప్పటికీ తెలంగాణ నేల నీటికి నోచుకోలేదు.
వినపడని చెరువుల గోస..
చిన్న నీటి పారుదలకు తక్కువ కేటాయింపులిచ్చి తెలంగాణలో చెరువులను మేట వేసేలా, ఎండిపోయేలా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలది. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత మిషన్ కాకతీయ చేపట్టి చెరువులను పునరుద్ధరించారా లేదా చెప్పాలి. చెరువులు ఎండితే భూగర్భ జలాలు కూడా అడుగంటాయి. ఇప్పుడు తెలంగాణలో పెరిగిన భూగర్భ జలాలకు కారణం ఈ మిషన్ కాకతీయ కంట్రిబ్యూషన్ ఎంతో ఉన్నది.
పచ్చని తెలంగాణ చెపుతున్న సాక్ష్యం
కేసీఆర్ ఒక్క ఎకరానికైనా నీళ్లిచ్చిండా? అని బహిరంగసభల్లో అడిగించుకొని ఓట్లడుగుతున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులకు పల్లెలే సాక్ష్యం చెప్తాయి. ఇంతకుముందు ఉత్తర తెలంగాణలో జొన్నలు మాత్రమే పండే భూముల్లో ఇప్పుడు నీటి వసతి ఎంత వచ్చిందంటే ఇప్పుడు ఆ జొన్నలు పండించడమే కష్టంగా మారింది.
కేవలం రెండు, మూడు నెలలు నిండి ఉండే చెరువులు ఇప్పుడు ఏడాది పొడుగునా నీళ్లతో ఉండటం ఒక సంతోషకరమైన దృశ్యం కాదా? ఇంతకుమునుపు వానలు పడినప్పుడే పొంగి చప్పబడే ఏరులు ఇప్పుడు కనీసం ఆరు నెలల పాటు చెరువులకు, నదులకు మధ్య సజీవ సంబంధంగా ప్రవహిస్తున్న దృశ్యం నిజం కాదా? ఎన్నికల కాలంలో కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా తెలంగాణ నేల అబద్ధం చెప్పదు. పచ్చటి పొలాలు, నిండిన చెరువులు, పారుతున్న ఏరులు, నదులు జరిగిన మోసానికి, వివక్షాపూరిత కాలానికి సాక్ష్యాలు.