కొత్తవారిని రానివ్వరు, పోయేవాళ్లను ఆపరు. ఇక పార్టీ గెలువడం లేదంటే ఎలా? మీరే చెప్పండని తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఏఐసీసీ పరిశీలకుడు దిగ్విజయ్సింగ్ సూటిగా ప్రశ్నించారు. అధ్యక్షుడిని మార్చాలంటారు.. ఇంఛార్జీని తొలగించాలంటారు. మీ కొట్లాటలు చూసే ఇటు (కాంగ్రెస్కు) వచ్చే వాళ్లు అటు (బీజేపీకి) పోతున్నారని క్లాస్ పీకారు.
డిగ్గీరాజా నుంచి ఉహించని ప్రశ్నల వర్షం కురువటంతో ఖంగు తిన్న సీనియర్ నేతలు, మీరు ఇంఛార్జీగా ఉన్నప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు అని నసిగారు. ‘అంటే నన్ను మళ్లీ రమ్మంటున్నారా? అక్కడ భారత్ జోడో ఉండగా, నాకెక్కడ కుదురుతుంది?’ అని దిగ్విజయ్ ప్రశ్నించారు. ‘భారత్ జోడో కో చోడో సాబ్, పహెలే టీపీసీసీకో జోడో’ అని ఓ సీనియర్ నేత ఇచ్చిన సలహాకు ఫక్కున నవ్విన డిగ్గీ రాజా, ‘ఏ బాత్, రాహుల్ తక్ పౌంచావుంగా’ అని హామీ ఇచ్చినట్టు గాంధీభవన్ వర్గాల కథనం.