ప్రభుత్వం అనేది నిరంతరం కొనసాగేది. పార్టీలు మారినప్పుడల్లా ప్రభుత్వం మారదు. ఆ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుంది అంతే. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత సర్కారు తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించడం మామూలే. ఆ కోవలోనే కాంగ్రెస్ సర్కారు తీసుకున్న ఓ నిర్ణయంతో గృహలక్ష్మి లబ్ధిదారులకు అన్యాయం జరిగింది. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే గృహలక్ష్మికి సంబంధించిన జీవోను రద్దు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా వేలమంది రోడ్డెక్కారు.
గృహలక్ష్మికి సంబంధించి లబ్ధి కాపీని అందుకున్న పేదలు తమ పాత పెంకుటిల్లు, రేకుల షెడ్లను పీకేశారు. కొంతమంది పునాదులు వేసుకోగా, మరికొంతమంది పిల్లర్లు పోసుకొని ఉన్న గూడును కోల్పోయి, నిలువ నీడ లేకుండా రోడ్డున పడ్డారు. ఇల్లు పూర్తి చేయలేక వారంతా నానా అవస్థలు పడుతున్నప్పటికీ సర్కార్కు మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు.
మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోడ్ పేరిట కొన్ని నెలలు గడిచిపోతాయి. ఆ తర్వాత వారిని పట్టించుకునే వారెవరు? వారంతా వానకు తడిసి ముద్దవ్వాల్సిందేనా? మేధావులు, ప్రతిపక్ష నాయకులు గృహలక్ష్మి లబ్ధిదారుల దుస్థితిని ప్రపంచానికి తెలియజేయాలి. ఈ పరిస్థితిపై మీడియా కథనాలు ప్రచురించి సమస్యను వెలుగులోకి తీసుకురావాలి. తద్వారా హైకోర్టు దృష్టిలో పడే అవకాశం ఉంది. లేదా హైకోర్టు అయినా సుమోటోగా స్వీకరించి సదరు జీవోను సరి చేసి న్యాయం చేయాలి. వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించకపోతే లబ్ధిదారులు రోడ్లపైకి రాకతప్పదు.
– అడప రాజు