వెయ్యి ఏండ్ల కింద దక్కన్ పీఠభూమిలో ఎగసిపడిన సామాజిక కెరటం బసవేశ్వరుడు. అది కర్ణాటక ప్రాంతం కావడంతో దానికి ఆనుకుని ఉన్న ఆ ప్రాంతమంతా ఆ చైతన్య ఒరవడి పరంపర కొనసాగింది. సరిగ్గా వెయ్యి ఏండ్ల తర్వాత అదే ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్ ఈ మూడు నియోజకవర్గాలు అపర భగీరధుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో జల చైతన్యాన్ని పొందుతున్నాయి. బసవేశ్వర సంగమేశ్వర జలధారలే దీనికి సజీవ సాక్ష్యాలై నిలుస్తున్నాయి.
నాటి నిజాం రాజ్యం, నేడు ప్రత్యేక స్వయంపాలిత రాష్ట్రంలో అత్యంత వెనకబడిన పై మూడు నియోజకవర్గాల్లో మంజీర జలాలు ఆర్థిక వనరుల కొత్తజీవితపు రంగుల వసంతపు తరంగాన్ని తీసుకురానున్నాయి. 2014 తర్వాత ప్రత్యేక తెలంగాణలో తనదైన ముద్రతో సరికొత్త జల వ్యూహాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం రచించుకున్నది. దాని ప్రతిఫలంగానే సంగమేశ్వర, బసవేశ్వర పురుడోసుకున్నాయి. గత పాలకులకు ఈ ప్రాంతం గురించి పట్టింపులేదు.చెంతనే నిండుకుండలా సింగూరు జలాలు కనిపించినా గుక్కెడు నీళ్లకోసం కిలోమీటర్ల పాదయాత్ర పొద్దు-మాపు అమ్మలకు, అక్కలకు తప్పేది కాదు. వేల ఎకరాల భూములు, వందల గ్రామాలు ప్రాజెక్ట్ కోసం త్యాగం చేస్తే ఈ ప్రాంత ప్రజలకు చుక్కనీరు అందలేదు. మేడి, కాడీ సంపూర్ణ జలాలను ఆస్వాదించిన సందర్భం ఈ ప్రాంత చరిత్రలోనే లేదు. సింగూరు నీళ్లతో జీవితాల్లో మార్పు వస్తుందని ఆశించిన ఇక్కడి ప్రజల కల నెరవేరకపోవడంతో వేలమంది హైదరాబాద్కు లేదా ముంబైకి వలస వెళ్లారు. పండగలకు పబ్బాలకు తప్పించి గ్రామాలకు రానివారు వేలల్లో ఉన్నారంటే ఎంతమంది వలసవెళ్లారో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలప్పుడు హైదరాబాద్ నుంచి 30 వేలకు పైగా జనం ఓట్లు వేయడానికే వచ్చి పోయేవారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చరిత్ర పునఃలిఖించడం మొదలైంది. ఇందుకు ఆధారం సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టులు. ఈ ప్రాజెక్ట్ కింద 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు రాబోతున్నది. అందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాలు గణనీయ అభివృద్ధిని సాధించబోతున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతం కోనసీమను తలదన్నే రీతిలో విరాజిల్లబోతున్నది. ముందు చెప్పినట్టు బతుకు దెరువు కోసమై ముంబై, హైదరాబాద్ లాంటి నగరాలకు వలసవెలుతున్న ప్రజలకు సంగమేశ్వర, బసవేశ్వర ఉజ్వల భవిష్యత్తును ఇవ్వబోతున్నాయి. సంకల్పం, కార్యసాధన, స్వయం పాలనకు సంపూర్ణ నిర్వచనం కేసీఆర్. దానికి ప్రతిబింబమే ఈ ఎత్తిపోతల. ఇది ఈ ప్రాంత వాసుల కష్టాలను, కన్నీళ్ళను ఎత్తివేసి, సిరులను, సుఖ సంతోషాలను దరి చేర్చబోతున్నది. ఈ ప్రాంత కరువు, వలసల జీవన స్థితి గతులు ప్రధాన వార్తలు. రాబోయే రోజులలో దీనికి భిన్నమైన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక ఉత్తేజిత పురోభివృద్ధి దృక్కోణాలు ప్రధాన స్రవంతిలో పతాక స్థాయిని అందుకుంటాయని అనడంలో సందేహం లేదు. ప్రఖ్యాత కవిపండితులు పంపన, మల్లినాథ సూరి, సామాజిక కవి పండితులు పోతనా మాత్యులు విశ్వసించిన సమదృష్టి చరిత్ర సంగారెడ్డి జిల్లాలో సగర్వంగా పచ్చని పంట పొలాలై, నీటి తెమ్మరులై, పసిడికాంతుల వరి వెన్నులై, చిరుధాన్యాల నాణ్యతకు అంతులేని నిధులై, సంగమేశ్వర జలపాతమై ఈ ప్రాంత జనవాహినిని పునీతం చేయబోతున్నది.
దృఢ సంకల్పుడు, భరత జాతి ముద్దుబిడ్డ కేసీఆర్ సీఎం అయ్యాక కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, ఈశాన్యం నుంచి అరేబియా సముద్రం వరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజోపయోగ పనులు చేస్తూ ఖ్యాతినొందారు. ఈ ఆధునిక కథానాయకుడే మెతుకు ప్రాంతంపై అపారమైన కరుణార్ద్ర హృదయంతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలను ఈ ప్రాంతవాసులకు అంకితమిస్తున్నారు. రాళ్లు రప్పలతో గట్టు ప్రాంతంగా ఉండే మా చేలలో నీళ్లు చూడాలని తహతహలాడుతున్న నాలాంటి ఈ ప్రాంత బిడ్డల ఆశ నెరవేరబోతున్నందుకు పట్టరాని సంతోషంగా ఉన్నది. అంతేకాదు.. ఈ ప్రాంత బిడ్డగా.. మొట్టమొదటిసారి అందోల్లో స్థానికుడిని ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత.. నా హయాంలో ఈ ప్రాజెక్టు రావడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.
పలనాడు సీమలోని కరువు కాటకాలు చుక్కనీరులేక అల్లాడుతున్న జనాన్ని చూసి ప్రఖ్యాత తెలుగు కవి పండితులు శ్రీనాథుడు ‘తిరిపమున కిద్దరాండ్రా పరమేశా.. గంగవిడుము పార్వతిచాలున్’ అని చాటు పద్యాల రూపంలో తన వేదనను వ్యక్తం చేశారు. నాటికీ నేటికీ పలనాడు అలాగే ఉన్నది. రతనాల సీమ రాయలసీమపై ప్రముఖ కవి విద్వాన్ విశ్వం పెన్నానదిని తలపోస్తూ చుక్కనీరు లేక వలపోస్తున్నామని తన గోసను వెళ్ళగక్కారు. ఒకటీ అరా మినహా అక్కడా అదే స్థితి. కానీ, తెలంగాణ కేసీఆర్ పాలనలో తత్భిన్నమని నిరూపించుకున్నది. ఇంతటి నిష్టాగరిష్ఠుడు సాక్షాత్తు పరమేశ్వర స్వరూప అపర భగీరథుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ తానున్నట్లు భరోసానిస్తూ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలను అత్యంత వెనుకబడిన అశేష జనవాహినికి అంకితమిస్తున్న చారిత్రక సందర్భమిది. వందల ఏండ్లుగా కన్నీళ్లు, కరువు కాటకాల ధాటికి విలవిలలాడిన జన సమూహం పక్షాన మీకు వినమ్ర నమస్సుమాంజలులు.
– క్రాంతి కిరణ్
వ్యాసకర్త: ఎమ్మెల్యే, అందోల్