తెలంగాణ కొత్త సచివాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు సీఎం కేసీఆర్. ఈ కాలానికి తగ్గట్టు ఆధునిక సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లు ఎన్నో ఉన్నాయి. గతంలో సచివాలయం అంటే పైరవీకారులు, వివిధ సమస్యలపై ఆందోళన చేసేవారు ఎవరైనా, ఎప్పుడంటే అప్పుడు లోనికి దూసుకెళ్ళేవారు. కానీ ఇప్పుడా సమస్యలేదు. ముందస్తు అనుమతి ఉంటేనే సచివాలయంలోకి అనుమతి. కనుమరుగైన పాత సచివాలయానికి సంబంధించి కొన్ని జ్ఞాపకాలు.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ వెంటనే సచివాలయం వద్ద నిషేధాజ్ఞలు విధించి, ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ ఏర్పాటు చేసి , అక్కడే ధర్నాలకు అవకాశం కల్పించారు. అంతకు ముందు సచివాలయం చుట్టూ, ఎదురుగా, ఫుట్పాత్ పైన ఎక్కడ చూసి నా వివిధ సమస్యలతో ఆందోళనలు చేసే టెంట్లు, బాధితుల దీక్షలు కనిపించేవి. సచివాలయంలో ప్రెస్రూమ్ ఉండేది. అందులో అనేక చర్చలతో హాట్హాట్గా ఉండేది. కొందరు సీనియర్లు అక్కడున్న సోఫాలో కునికిపాట్లు పడుతుంటే మరికొందరూ ల్యాండ్లైన్ ఫోన్ను కబ్జా చేసేవారు. అప్పుడింకా సెల్ఫోన్లు రాలేదు. ఉచితంగా ల్యాండ్లైన్ అందుబాటులో ఉండడంతో ఒక్క క్షణం కూడా విరామం తీసుకోకుండా ఆ ఫోన్ పని చేస్తూనే ఉండేది.
ప్రెస్రూమ్ ఎదురుగా ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు చుట్టూ గ్రామాల్లో చావిడి మాదిరిగా ఓ పదిమం ది కూర్చునే అవకాశం ఉండేది. సచివాలయానికి పనికోసం వచ్చినా, పైరవీ కోసం వచ్చినా అటు నుంచి వె ళ్లాల్సిందే. అక్కడున్న అందరి కండ్లల్లో పడాల్సిందే. ఆ చెట్టు కొంతమందికి ఇబ్బందికరంగా మారిందని అసెంబ్లీలో చర్చ జరిగింది. దీనిపై ఫిర్యాదు కూడా చేశారు. ఆ తర్వాత చెట్టు చుట్టూ కూర్చోవడానికి అనువుగా ఉన్న ప్రాంతాన్ని కొంత తగ్గించారు. అయినా చాలామంది అక్కడే నిలబడి చర్చలు చేసేవారు. ప్రెస్రూమ్కు వెనుకవైపున ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎన్టీఆర్ ఛాంబర్ ఉండేది. నిజాంకాలంలో నిర్మించిన చెక్క మె ట్లు భలే ఉండేవి. ఎన్టీఆర్ ఇష్టంగా ఈ ఛాంబర్ను ఎంపిక చేసుకున్నారు. ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్ను దించేంతవరకు అదే ఛాంబర్లో ఉన్నారు.
ఎన్టీఆర్ను అధికారం నుంచి దించడానికి చంద్రబాబు నాయకత్వంలో తొలిసారిగా శాసన సభ్యుల, పార్టీ నాయకుల సమావేశం జరిగింది ఈ సచివాలయంలోనే. పోస్టాఫీసు పైన చంద్రబాబు ఛాంబర్ ఉం డేది. 1995 ఆగస్టులో తొలుత నల్లగొండ జిల్లాకు చెందిన నాయకులు బాబును కలిసి అభినందించారు. అనంతరం ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యేలు రాసాగా రు. ఏదో జరుగుతుందని విలేకరులు వచ్చే సరికి నాయకులందరినీ బయటకు పంపారు. లోపల ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఎవరికీ తెలియదు. కానీ 70 మంది అని ఓ అంకె ప్రచారంలోకి వచ్చింది. ఎలా అంటే కూర్చోడానికి ప్లాస్టిక్ కుర్చీలు తెప్పించారు. వాటిని లెక్కబెట్టిన ఓ జర్నలిస్ట్ 70 అని అంకె తేల్చారు. అలా 70 కుర్చీలను 70 మంది ఎమ్మెల్యేలుగా తేల్చేశారు.
ప్రెస్రూమ్లో ఉన్న ల్యాండ్లైన్ నుంచే రామోజీ రావుకు వాళ్ళ రిపోర్టర్ ఈ సమావేశానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేవారు. సాయంత్రానికి సచివాలయం నుంచి క్యాంపు వైస్రాయ్ హోటల్కు మారింది. నెలరోజుల్లో ఎన్టీఆర్ మాజీ అయిపోగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు సచివాలయంలోకి అడు గు పెట్టారు.
2014లో తెలంగాణ ఆవిర్భావం, ఎన్నికలు జరిగాయి. కొత్త ముఖ్యమంత్రికి సచివాలయ ఉద్యోగులు అభినందన సభ నిర్వహించడం ఆనవాయితి. ముఖ్యమంత్రిగా తొలిసారి సచివాలయానికి వచ్చిన కేసీఆర్కు సిబ్బంది ఘనస్వగతం పలికారు. సభ నిర్వహించారు. జూలై నెలలో ఎప్పుడూ లేనంత ఉక్కపోత. సభలో కేసీఆర్ ఇదే చెప్పారు. హైదరాబాద్ వాతావరణం ఇది కా దు ఎంత చల్లగా ఉండేది. చెట్లు పెంచి వాతావరణాన్ని మళ్ళీ చల్లగా ఉండేట్టు చేద్దాం అని. ఇప్పుడు నూతన సచివాలయంలో 30 శాతం స్థలం పచ్చదనానికి కేటాయించారు. నూతన సచివాలయం ఆధునికతతో పాటు పచ్చదనంతో కళకళ లాడుతున్నది.
-బుద్దామురళి
98499 98087