141 కోట్ల 70 లక్షల జనాభాతో ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా భారత్ చైనాను అధిగమించిన రోజే.. ‘తెలంగాణ మాడల్’ ఆవశ్యకతను, ప్రాధాన్యాన్ని భారతదేశం మరింతగా గుర్తించటం విశేషం. ఈ చారిత్రాత్మక సందర్భానికి ఖమ్మం బహిరంగ సభ వేదికగా నిలిచింది. సభకు హాజరైన ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ పథకాలను తాము కూడా అనుసరిస్తామని లక్షలాది జనం ముందు ప్రకటించారు. బీఆర్ఎస్ తన తొలి అడుగులోనే సాధించిన ఘన విజయమిది.
కేసీఆర్ ఆలోచనలు, ఆచరణ ఎంత పకడ్బందీగా ఉంటాయంటే అవి సాకారం అవుతున్న దశలోనే వాటి గొప్పతనం సాధారణ వ్యక్తులకు అర్థమవుతుంది. తొలుత ఆ ఆలోచనల్ని విన్న కొందరికి అవి వట్టి మాటలుగా లేదా అసాధ్యమైన పనులుగా అనిపించవచ్చు. ఇంకా చెప్పాలంటే కొండను ఢీకొనే పొట్టేలు సామెత వారికి గుర్తుకొస్తుంది. అయితే, కేసీఆర్ వద్ద ఆ సామెత తిరగబడటమే విచిత్రం. ఆ పొట్టేలు కొండను ఢీకొని నిలబడటమే కాదు, క్రమక్రమంగా ఆ కొండనే తుత్తునియలు చేస్తుంది. అదే కేసీఆర్. అదే ఆయన సృష్టించిన చరిత్ర. ఇప్పుడు ఆయన సృష్టిస్తున్న చరిత్ర కూడా అదే.
22 ఏండ్ల కిందట కేసీఆర్ తెలంగాణ నినాదాన్ని ఎత్తుకొని, టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించినప్పుడు ఒక్కరిలో తప్ప మరెవ్వరిలోనూ ఆ నినాదం సాక్షాత్కారమవుతుందన్న విశ్వాసం ఉండి ఉండదు. ఆ ఒకే ఒక్కరు కేసీఆరే. తన మెదడు నిండా, తన హృదయం నిండా పరుచుకున్న, తన అణువణువునా నిలుపుకొన్న ఆ విశ్వాసాన్ని ఆయన మూడు కోట్ల మందికి విస్తరింపజేశారు. అప్పుడు ఆ విశ్వాసం కంటికి కనిపించని, మానసికస్థాయిలో మాత్రమే ఉండే ఒక ఆలోచన కాదు. అది మూడు కోట్ల మందితో కూడిన భౌతికశక్తి. అంతటి శక్తిని ఎదిరించేది ప్రపంచంలో ఏముంటుంది? ఏదీ ఉండదు. కాబట్టే, తెలంగాణ సాకారమైంది.
నేడు ఆయన వయస్సు 68 ఏండ్లు. ఫిబ్రవరి 17 వస్తే 69 వస్తాయి. ఈ వయస్సులో ఉన్న వాళ్లు ఎటువంటి సమస్యలు, చీకూచింతా లేకుండా జీవితాన్ని గడుపాలనుకుంటారు. కానీ, దేశంలో ఏ పార్టీ కూడా, ఏ నాయకుడు కూడా గట్టిగా ప్రశ్నించటానికే భయపడుతున్న నరేంద్రమోదీతో ఆయన పోరాటానికి దిగారు. ఎన్ని సమస్యలైనా రానీ, ఏమైనాగానీ, ఈ దేశాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం, దేశంలోని వనరులతో బంగారు భారతావనిని నిర్మిద్దాం అంటూ ఆయన పిలుపునిస్తున్నారు.
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుతామని కేసీఆర్ ప్రకటించినప్పుడు చాలామంది జనమే కాదు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు కూడా దాన్ని సీరియస్గా తీసుకోలేదు. అచ్చం, తెలంగాణ కోసం బయల్దేరుతున్నానని కేసీఆర్ నాడు ప్రకటించనప్పటి లాగానే. కానీ, కేసీఆర్ తన కార్యాచరణను కొనసాగిస్తూనే వచ్చారు. తెలంగాణ బిడ్డల హృదయధ్వనిగా రెండు దశాబ్దాలపాటు కొనసాగిన టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. ఢిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభించారు. ఏపీ అధ్యక్షుడిని ప్రకటించారు. అప్పటి వరకూ అపనమ్మకంతో, అనేక సందేహాలతో చూస్తున్న వారు కూడా ఏదో జరుగుతున్నదే అనుకునే పరిస్థితి వచ్చింది. సంక్రాంతి తర్వాత బీఆర్ఎస్ కార్యకలాపాలు వేగవంతమవుతాయని కేసీఆర్ ప్రకటించారు. దానికి నాందిగా ఖమ్మం బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభ జరిగే వరకు కూడా దాని ప్రభావాన్ని చాలామంది ఊహించలేకపోయారు.
సభకు తరలి వచ్చిన జన సముద్రాన్ని చూసి అతిథులు ఆశ్చర్యపోయారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్సింగ్ మాన్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, ప్రశంసిస్తూ.. ఈ సభకు హాజరైన ప్రజానీకం ఎక్కడి వరకు ఉన్నారో తెలుసుకోవటానికి కూడా కళ్లద్దాలు అవసరమయ్యేట్టు ఉ న్నాయని హర్షం వ్యక్తం చేశారు. తన ముందు, కుడి, ఎడమల ఎటువైపు, ఎంతవరకు చూసినా జనమే కనిపిస్తున్నారని, తన జీవితంలో ఇంత పెద్ద సభను చూడలేదని, ఈ సభకు వచ్చిన జనమే ఒక సంకేతమని అఖిలేష్ యాదవ్ చెప్పారు. బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ఇది. నాడు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో తొలిసారిగా కరీంనగర్లో ‘సింహగర్జన’ సభను కేసీఆర్ నిర్వహించారు. అప్పటి వరకూ తెలంగాణ నినాదాన్ని, టీఆర్ఎస్ను పెద్దగా పట్టించుకోని వాళ్లందరూ తల తిప్పుకొని చూసేలా ఆ సభ గర్జించింది. నేడు ఖమ్మం సభ కూడా అటువంటి పనే చేసింది. ఇది బలప్రదర్శన మాత్రమే కాదు, దేశం ముందు ఒక ప్రత్యామ్నాయాన్ని ఉంచిన సభ. ఒక భరోసాను ఇచ్చిన సభ.
రానున్న ప్రజాస్వామ్య పరిరక్షణ మహాయజ్ఞంలో తెలంగాణ నమూనానే చోదకశక్తిగా ఉండబోతున్నది. ఖమ్మం సభ ఈ విషయాన్ని సుస్పష్టంగా ప్రకటించింది. తెలంగాణలో జిల్లా స్థాయి కార్యాలయాలన్నింటినీ ఒకే చోట నిర్మిస్తున్న ‘సమీకృత కలెక్టరేట్ల’ విధానాన్ని తాము ఢిల్లీలో, పంజాబ్లో కూడా అమలు చేస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. ‘కంటి వెలుగు’ను సైతం అమలు చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలులో పెట్టిన పథకాలనే మోదీ ప్రభుత్వం కాపీ కొడుతున్నదని అఖిలేశ్ యాదవ్ కుండబద్దలు కొట్టారు. ప్రజోపయోగకరమైన ఎన్నో పనులు చేస్తూ కూడా తెలంగాణ ఎక్కువగా ప్రచారం చేసుకోవటం లేదని ప్రశంసిస్తూ, పనులే చేయని వాళ్లు ప్రచారాన్ని మాత్రం ఘనంగా జరుపుకొంటున్నారంటూ మోదీ సర్కార్కు చురక వేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా.. కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఘనంగా పేర్కొన్నారు. రైతుబంధు, దళితబంధులున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు.
మోదీ మీద, బీజేపీ మీద సమర శంఖాన్ని పూరించటం ఒక ఎత్తు. 141 కోట్ల ప్రజానీకానికి మేలైన, మెరుగైన ప్రత్యామ్నాయాన్ని ప్రకటించటం మరొక ఎత్తు. ఈ రెండింటినీ సమన్వయపరిచింది ఖమ్మం సభ. సీఎంలు, జాతీ య నాయకుల మాటలు, వారి ప్రసంగాలు దీనినే వెల్లడిస్తున్నాయి.
రానున్న రోజుల్లో దేశ ప్రజలకు కావలసిన ప్రత్యామ్నాయానికి తెలంగాణ నమూనానే కేంద్రబిందువుగా ఉండనున్నది. ఎనిమిదేండ్లలో తెలంగాణ సాధించిన విజయాలే మన తోటి భారతీయులకు నమ్మకం కలిగించే సజీవ వాస్తవాలు కానున్నాయి. కరువు కాటకాల తెలంగాణను పసిడి పంటల మాగాణిగా మార్చిన మన వ్యవసాయ విధానమే.. దేశమంతటా రైతురాజ్యం ఆవిర్భావానికి మూలసూత్రం అవుతుంది. ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలకు గమ్యస్థానంగా హైదరాబాద్ను నిలిపిన మన పారిశ్రామిక విధానమే దేశంలో నిరుద్యోగాన్ని తరిమికొట్టే తారకమంత్రం అవుతుంది. ఆరు దశాబ్దాల కలను, మూడు కోట్ల మంది ఆకాంక్షను సాకారం చేసి, తెచ్చుకున్న తెలంగాణను యావత్ దేశానికే ఆదర్శంగా నిలిపిన కేసీఆర్ నాయకత్వమే భారతదేశ అప్రతిహత ప్ర గతికి దారులు వేయనుంది. కులమతాల చిచ్చు లేని ప్రశాంత భారతానికి, ప్రపంచ అగ్రదేశాలతో పోటీ పడగల స్థాయికి చేరుకునే 21వ శతాబ్దపు అధునాతన భారతానికి కేసీఆర్ సారథ్యమే చుక్కాని కానున్నది.
ఆధునిక తెలుగు సాహిత్యంలో భూకంపం పుట్టించిన శ్రీశ్రీ కవితా సంపుటి మహాప్రస్థానానికి చెలం ముందుమాట రాస్తూ.. ‘నేడు విర్రవీగే కవులు ప్రతీ ఒక్కరూ శ్రీశ్రీ నీడ కింద నుంచొని తమ ఉనికిని సమర్థించుకోవలసిన గతి వొస్తుంది’ అంటూ భవిష్యత్తు అంచనా వేస్తారు. సరిగ్గా అలాగే జరిగింది. కేసీఆర్ విషయంలోనూ ఇప్పటికే ఒకసారి ఇది నిరూపితమైంది. తెలంగాణ విషయంలో తొలుత ఆయన లక్ష్యాన్ని సందేహించారు. ఆ తర్వాత ఆయనను పట్టించుకోనట్లుగా వ్యవహరించారు. అనంతరం విమర్శలకు దిగారు. చివరికి యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో వారు ఓడిపోయారు. కేసీఆర్ గెలిచారు. తెలంగాణను గెలిపించారు. బిందువులా బయల్దేరి సింధువుగా మారారు. నేడు ఆ సింధువు యావత్ దేశాన్ని పునీతం చేయటానికి బయల్దేరింది.
ప్రకృతిలో ప్రతీదీ ఘర్షణ, ఐక్యతలతో ఉనికిలో ఉన్నదని కారల్ మార్క్స్ గతి తార్కిక భౌతికవాదం మొదటి సూత్రం చెప్తుంది. ఈ విషయాన్ని మన దేశంలోని కమ్యూనిస్టులు ఎంత అర్థం చేసుకున్నారో గానీ.. కేసీఆర్ మాత్రం దీనిని పూర్తిస్థాయిలో ఆచరణలో పెడుతుంటారు. ఆయన చేసే యుద్ధం శత్రువులకు కూడా అంతుబట్టదు. ఎందుకంటే, వారితో ఐక్యతతోనే ఉంటారాయన. మరోవైపు, ఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో అలాగే జరిగింది. దానివల్లనే అంతటి మహా ఉద్యమం శాంతియుతంగా కొనసాగగలిగింది. బ్రిటిష్ వారితో మన జాతిపిత గాంధీజీ సరిగ్గా ఈ వ్యూహాన్నే అమలుపరిచారు. ఓవైపు వారితో సఖ్యతగా ఉంటూనే మరోవైపు వారిపై సమరం జరిపారు. పరాయి పాలన నుంచి విముక్తికి ఆయుధమే ఏకైక మార్గమని అనేక దేశాలు భావించి అదే దారిలో పయనిస్తున్న వేళ.. దానిని తృణీకరించారు బాపూజీ. ఆయన దార్శనికత వల్లనే నేడు మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన్ననలు అందుకుంటున్నది. లేకపోతే, ఏనాడో నియంతల పాలై, చీలికలు పేలికలయ్యేది.
గాంధీజీ వంటి మహనీయుడిపైనే అవాకులు, చెవాకులు పేలేవాళ్లు నేడు దేశాన్ని ఏలుతున్నారు. వారి నుంచి దేశానికి విముక్తిని సాధించకపోతే, దేశం కనీసం 200 ఏండ్లు వెనక్కి వెళ్తుంది. దీన్ని ఆపి తీరాల్సిందే. మరో స్వాతంత్య్రం పోరాటం చెయ్యాల్సిందే.
ఆ పోరాటానికి ఖమ్మం వేదికగా కేసీఆర్ శంఖారావం పూరించారు. దీని ప్రతిధ్వని అతి త్వరలోనే దేశమంతటా వినిపిస్తుంది. చీకట్లు తొలగిపోతాయి. సూర్యుడి కాంతిరేఖలు మళ్లీ మన ముఖాలను ప్రకాశవంతం చేస్తాయి. భయం పోతుంది… స్వేచ్ఛగా ఆలోచనలు వ్యక్తీకరించుకునే రోజులు మళ్లీ వస్తాయి. ఆ ఆలోచనల సంఘర్షణలోంచి పుట్టే అభివృద్ధి అమృతాన్ని తాగే రోజు తప్పక వస్తుంది. భారతీయుల గుండెచప్పుడుగా బీఆర్ఎస్ మారే రోజు వస్తుంది.
-కె.వి.రవికుమార్