ముదిరాజుల బాధలు తీర్చి వారి ఆత్మబంధువయ్యారు సీఎం కేసీఆర్. తెలంగాణలో ప్రతి ముదిరాజ్ బిడ్డ సంతోషంగా ఉండాలన్నదే ఆయన తపన. ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడ్డ ముదిరాజ్లు టీఆర్ఎస్ పాలనలోనే సర్వతోముఖాభివృద్ధి సాధించారు. నేడు వారు కడుపునిండా బువ్వ తింటున్నారంటే అది సీఎం కేసీఆర్ చలువేనన్నది జగమెరిగిన సత్యం.
ముదిరాజ్ల కలలు సాకారం కావాలంటే కేసీఆరే తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం మూలంగా ముదిరాజ్లకు ఉపాధి లేక బతుకు భారమై వలసబాట పట్టారు. తెలంగాణ కల సాకారం చేసిన ఉద్యమనేత కేసీఆర్ తన అమృత హస్తాలతో అందిస్తున్న సంక్షేమ ఫలాలు మా జీవన విధానాన్నే మార్చివేశాయి. రాష్ట్ర జనాభాలో 14 శాతానికిపైగా ఉన్న ముదిరాజ్ కులస్థులకు ప్రధాన వృత్తి చేపల వేట. టీఆర్ఎస్ ప్రభు త్వం వచ్చాక ముదిరాజ్ కులస్థులకు బడ్జెట్లో పెద్దఎత్తున నిధులు కేటాయించింది. అనేక రాయితీలు, వసతులు కల్పించింది. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలను బలోపేతం చేయడంతోపాటు ఉచితంగా చెరువుల్లో చేపపిల్లల పెంపకానికి చర్యలు చేపట్టింది. అంతేకాకుండా ప్రభుత్వం రాయితీపై వలలు, ద్విచక్ర వాహనా లు, రుణాలు అందిస్తున్నది. ముదిరాజ్ కులానికి చెందిన బండ ప్రకాశ్ను ఎమ్మెల్సీ చేసి, ముదిరాజ్ లకు పాలనలో ప్రాధాన్యం కల్పించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా 46,531 చెరువులను పునరుద్ధరించి పూర్వవైభవం తీసుకువచ్చింది. కాళేశ్వరం వంటి భారీ నీటి పారుదల ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో నీటి వనరులు బాగా పెరిగాయి. చెరువులు, కుంటలు, సరస్సులు, తదితర నీటి వనరుల్లో చేపల పెంపకం ద్వారా ముదిరాజ్ల ఆదాయం కూడా పెరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారులకు రూ.354 కోట్లతో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసింది. రూ.45 కోట్లతో 54 కోట్ల రొయ్య పిల్లలు పంపిణీ చేసింది. చేప పిల్లల పంపిణీ ద్వారా 4 లక్షలకు పైగా మత్స్యకారులకు లబ్ధి చేకూరింది.
సుమారు 26 వేల కోట్ల సంపద సృష్టి జరిగింది. స్వరాష్ట్రంలో మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయి. రాష్ట్రంలో 7.60 కోట్లతో 784 అధునాతన ఫిష్ మార్కెట్లు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వం ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకూ చర్యలు తీసుకుంటున్నది. తద్వారా ముదిరాజ్లకు అదనపు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆదాయం కూడా రెట్టింపవుతుంది. కోకాపేటలో 5 ఎకరాల విస్తీర్ణంలో 5 కోట్లతో ముదిరాజ్ భవన్ నిర్మాణానికి నిధులు కేటాయించారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ముదిరాజ్ బిడ్డకు మత్స్యకార సభ్యత్వం, ఏటా ఉచితంగా చేప పిల్లలు, రొయ్యల పంపిణీ చేస్తుంది. ఇప్పటికే ఇందుకోసం రూ.500 కోట్లు ఖర్చు చేసింది. రూ.75 కోట్లతో జిల్లాల్లో మత్స్యకారులకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం జరుగనున్నది. ప్రమాద బీమా 6 లక్షలకు పెంచింది. 3 నెలల్లోనే దాదాపు వెయ్యి కోట్లతో నూతన ముదిరాజ్ మత్స్యకార సొసైటీలు ఏర్పాటు చేసింది. మహిళా మత్స్యకారులకు రివాల్వింగ్ ఫండ్ కింద రూ.7.5 కోట్లు ఇచ్చింది. కేవలం కేసీఆర్ పాలనతోనే ఇదంతా సాధ్యమైందనడంలో సందేహం లేదు.
ఉమ్మడి రాష్ట్రంలో ముదిరాజ్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేదనే విషయం ప్రతి ముదిరాజ్ బిడ్డకు తెలుసు. 2014కు ముందు కేవలం 1.90 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరిగేది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగా నేడు అది 4 లక్షల టన్నులకు చేరుకున్నది. ఈ క్రమంలో రానున్నకాలంలో కేసీఆర్కు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి ముదిరాజ్ బిడ్డపైనా ఉన్నది.
(వ్యాసకర్త: ముదిరాజ్ సంఘం నాయకులు, జర్నలిస్టు)
యెన్నెబోయిన శ్రీనివాసరావు
98487 87211