‘కాంట్రాక్ట్’ అనే పదాన్ని అంటబెట్టి అధ్యాపకులను, ఉద్యోగులను బానిస సంకెళ్లతో బంధించింది నాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడైతే, ఆ బానిసత్వాన్ని పెంచి పోషించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ఇరువై మూడేండ్ల బానిస సంకెళ్లను తెంపి అధ్యాపకులతో పాటు యావత్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు విముక్తి కల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు చిరస్మరణీయ విజయాన్నందిస్తూ… విద్యావంతులకు విలువనిస్తూ.. గురువుల కు గౌరవం ఇస్తూ.. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే అధ్యాపకుల పట్ల ఉదార స్వభావాన్ని చాటారు ముఖ్యమంత్రి కేసీఆర్. వెట్టిచాకిరి, బానిసత్వం, శ్రమ దోపిడి నుంచి దేశ ప్రజలను కాపాడే సత్తా ఉన్న నాయకుడిగా దేశంలోనే పేరు గడించారు. చంద్రబాబు ప్రపంచబ్యాంకుతో చేసుకున్న ఒప్పందాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా ‘కాంట్రాక్ట్’ అనే పదం సృష్టించారు. ఒప్పందంపైన ఇతర ఉద్యోగులను, కాంట్రాక్టు లెక్చరర్లను సృష్టించి తక్కువ జీతంతో ఎక్కువ పని తీసుకొని శ్రమ దోపిడీకి గురిచేశాడు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ మూ ఇదే విధానాన్ని కొనసాగించింది. దీనివల్ల బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకొనే ప్రభుత్వ కళాశాలలు కుంటుపడ్డాయి. చదువు చెప్పే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయారు. సమయానికి జీతాలు అడిగినప్పుడు సెలవులు ఇవ్వకుండా, ఆర్థిక ప్రయోజనాలు కల్పించకుండా అధ్యాపకులను కట్టు బానిసలుగా, శ్రామికుల్లాగా చూశారు.
కూలిపోతున్న ప్రభుత్వ కళాశాలలకు పునర్వైభవం తీసుకువచ్చిన ఘనత కాం ట్రాక్టు అధ్యాపకులదేనని ఉద్యమ నాయకు డు కేసీఆర్ గ్రహించారు. కేవలం విద్యా విషయాలే కాకుండా ప్రభుత్వం విధించే ఇతర డ్యూటీలు కూడా చేస్తున్నారని, వయస్సు దాటిపోతున్న తరుణంలో ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయాలనే వారి ప్రధాన డిమాండ్కు కేసీఆర్ మద్దతు పలికారు. దశాబ్దం పాటు ఆంధ్రా పాలకుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కాంట్రాక్టు అధ్యాపకులు, ఇత ర శాఖల కాంట్రాక్టు ఉద్యోగులు న్యాయం కోసం పోరాటం చేస్తూ వచ్చారు. ఈ పోరాటాన్ని రాష్టవ్యాప్త చర్చగా మార్చడంలో కేసీఆర్ సఫలమయ్యారు. ‘కాంట్రాక్టు లెక్చరర్లు, డాక్టర్లు, టీచర్లు ఇలా.. ఒక కాంట్రాక్ట్ ముఖ్యమంత్రిని కూడా పెట్టుకోండని’ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మద్దతుగా అప్పటి నిరంకుశ పాలకులపై కేసీఆర్ వ్యంగ్యంగా బాణాలు విసిరారు. ఇందులో భాగంగానే కేసీఆర్ ‘తెలంగాణ లో కాంట్రాక్టు అనే పదం ఉండదు’ అన్నారు.
రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం… 2016లో రెగ్యులర్ జీవో 16 విడుదల చేశారు. ఈ సాహసోపేత నిర్ణయంతో యావత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అవధుల్లేని ఆనందానికి గురయ్యారు. ముఖ్యమంత్రి ఆశయాలను నీరుగార్చేందుకు, కాంట్రాక్టు ఉద్యోగుల పొట్టకొట్టేందుకు ప్రతిపక్ష నాయకులు కొందరు వారి అనుబంధ విద్యార్థులతో కలిసి కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాలను న్యాయస్థానాలకీడ్చారు. ఈ కుట్రలను గమనించిన తెలంగాణ కాంట్రాక్ట్ అధ్యాపక తదితర సంఘాలు సంఘటితమై ఐక్య కార్యాచరణ వేదికగా ఏర్పడి 2017లో గాంధీభవన్ ముట్టడి చేసి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించారు. తర్వాత 37,100 బేసిక్ వేతనం ఇస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కాంట్రాక్ట్ అధ్యాపకుల కుటుంబాల ఆకలిని తీర్చింది. 2020లో నూతన పీఆర్సీ ప్రకారంగా సమాన వేతనం 54,200 అమలుచేశారు. సెలవుల్లో, కరోనా లాక్డౌన్లలో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులకు పూర్తి బేసిక్ వేతనం ఇస్తూ ఆర్థికంగా ఆదుకున్నారు.
మాటతప్పని, మడమతిప్పని కేసీఆర్ చరిత్రలో చిరస్థాయిగా, స్వర్ణాక్షరాలతో లిఖించే విధంగా ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోని నిర్ణయం తీసుకున్నారు. రెండు దశాబ్దాల బానిస సంకెళ్లను తెంపుతూ అసెంబ్లీ సాక్షిగా ‘కాంట్రాక్ట్ ఉద్యోగులను మధ్యలో వదిలేయలేమని, అందుకే రెగ్యులర్ చేస్తున్నట్లు..’ అధికారికంగా ప్రకటించా రు. దీంతో యావత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆనందంలో మునిగారు. ఆయన చిత్రపటానికి ఊరూరా క్షీరాభిషేకం చేస్తూ తమ గుండెల్లో గుడి కట్టారు. ఈ తరుణంలోనే ప్రభుత్వ జీవో అమలుకోసం కాంట్రాక్టు ఉద్యోగులు వేచి చూస్తున్నారు. నూతన సచివాలయం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్యంగా ఈ రెగ్యులరైజేషన్ జీవోపై సంత కం చేసి కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపారు. మా త్యాగాలను, మానసిక వేదనను, ఆర్థిక పరిస్థితులను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి హరీశ్రావుకు జీవితాంతం రుణపడి ఉంటామని, ప్రభుత్వానికి మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ సందర్భంగా తమ కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
(వ్యాసకర్త: రాష్ట్ర కన్వీనర్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఫోరం)