జీఎస్టీ విషయంలో విమర్శలే నిజమయ్యాయి. కేంద్ర, రాష్ర్టాల మధ్య ‘ఇచ్చి పుచ్చుకునే’ వైఖరి ఆవిరైపోయింది. జీఎస్టీ వల్ల రాష్ర్టాలకు వచ్చే పన్నుల ఆదాయం గణనీయంగా కోసుకుపోగా, కేంద్రం ఆదాయం మాత్రం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో జీఎస్టీ విధానానికి మరమ్మతులు తక్షణావసరం. జీఎస్టీ విధాన ఫలితాలపై ఆత్మావలోకనం అత్యవసరం.
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలుకు సంబంధించి చాలా అంశాలపైన గతంలో కేంద్రం, వివిధ రాష్ర్టాల ప్రభుత్వాల మధ్య బలమైన భేదాభిప్రాయాలు ఉండేవి. 2019 డిసెంబర్లో జరిగిన జీఎస్టీ మండలి 38వ సమావేశం వరకు వీటి గురించి ఓటింగ్ జరగలేదు. కానీ లాటరీల మీద విధించే పన్ను విషయంలో మొదటిసారి వాడీ వేడీ చర్చ జరిగింది. కానీ ఆ తర్వాతి ఏడాది చివరి నాటికి జీఎస్టీ పరిహారం చెల్లింపు విషయంలో కేంద్రం, వివిధ రాష్ర్టాల ప్రభుత్వాల మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలు వచ్చాయి. రాజ్యాంగం ప్రకారం వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేషన్ పన్ను, ఎక్సైజ్ పన్ను, కస్టమ్స్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్ కేంద్రం వసూలు చేయాలి. అంతర్ రాష్ట్ర కొనుగోళ్లు, అమ్మకం పన్ను వసూలు రాష్ర్టాల బాధ్యత.
గతంలో అంతర్ రాష్ట్ర వ్యాపారానికి సంబంధించిన అమ్మకం పన్ను టర్నోవర్ ట్యాక్స్గా, సర్ ఛార్జీలుగా, లగ్జరీ పన్నుగా…ఇలా వివిధ రూపాల్లో ఉండేది. కొన్ని రకాల వస్తువులకు ఒకటి కంటే ఎక్కువ సార్లు అమ్మకం పన్ను విధించేవారు. ఈ పన్ను తర్వాత కాలంలో విలువ ఆధారిత పన్ను(వ్యాట్)గా రూపాంతరం చెందింది. రాష్ర్టాల మధ్య జరిగే అమ్మకాలు కేంద్ర అమ్మకపు పన్ను విధి విధానాలకు లోబడి ఉండేవి.అయితే జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత పెట్రో, ఆల్కహాల్ ఉత్పత్తులు మినహాయించి మిగతా అన్ని వస్తు, సేవలపైన విధించే సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, రాష్ర్టాల వస్తు(కమోడిటీ) పన్నులను జీఎస్టీలో కలిపేశారు. దీనివల్ల రాష్ర్టాలు తమకున్న పన్ను అధికారాల్లో చాలా భాగాన్ని కేంద్రానికి బదిలీ చేయాల్సి వచ్చింది. దీనివల్ల పన్ను రేట్లు పెంచకుండానే కేంద్రానికి వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగిపోయింది. రాజ్యాంగంలో పేర్కొన్న విధానం ప్రకారం రాష్ర్టాలకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆదాయంలో 40 శాతం వాటా రావాలి. కానీ జీఎస్టీ అమలు వల్ల రాష్ర్టాలకు వచ్చే ఆదాయం తగ్గిపోయి ఈ అసమానత మరింత ఎక్కువైంది.
రాజ్యాంగంలో ప్రామాణిక పన్ను రేట్లు ఇవని నిర్దిష్టంగా పేర్కొనకపోయినప్పటికీ, జీఎస్టీకి సంబంధించి విస్తృతమైన చర్చల తర్వాత రాష్ర్టాలన్నీ ఒక ఏకాభిప్రాయానికి రావడం విశేషమైన విషయం. దీంతో మొదట జీఎస్టీ పన్ను రేట్లను 1, 4, 12.5 శాతంగా నిర్ణయించారు. కొన్నేళ్ల తర్వాత ఆ రేట్లను 2, 5, 14.5 శాతానికి పెంచారు. విస్తృతమైన విభిన్నత్వం కలిగిన భారత్ లాంటి దేశంలో ఏకీకృత పన్నుల విధానం అమలు చేయడం శ్రేయస్కరం కాదని అప్పట్లో తీవ్రమైన విమర్శ వచ్చింది. కొత్త పన్ను రేట్లు పాత పన్నుల విధానం ద్వారా వచ్చినంత ఆదాయాన్ని ఆర్జించలేవన్న విమర్శ కూడా అప్పట్లో వచ్చింది. కానీ నాటి పశ్చిమబెంగాల్ ఆర్థిక మంత్రి అశీమ్ దాస్గుప్తా ఛైర్మన్ గా ఉన్న కమిటీ రాష్ర్టాల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది.
భారత సమాఖ్య దృఢత్వానికి జీఎస్టీ ఒక ఉదాహరణ అని కొంత మంది వ్యాఖ్యానించారు. ఎన్నో చర్చలు, సంప్రదింపుల తర్వాత ఈ పన్నుల విధానాన్ని ఆవిష్కరించడం వల్ల వాళ్లు అలా వ్యాఖ్యానించి ఉండొచ్చు. అయితే జీఎస్టీ రూపు రేఖలను సమగ్రంగా చర్చించడమే నా ఉద్దేశం. గత నాలుగేళ్లలో ఈ పన్నుల విధానం అమలైన తీరుని పరిశీలిస్తే రాష్ర్టాల ఆదాయం పెరగలేదు, వ్యాపారాల నిర్వహణ అనుకున్నంత మేర సులభతరం కాలేదు. వృద్ధిలో ఆశించినంత సానుకూల ప్రభావం కనిపించలేదు. బాధాకరమైన విషయం ఏమిటంటే, ఇచ్చి పుచ్చుకునే వైఖరిలో సాగుతుందనుకున్న కొత్త పన్నుల విధానం ఆచరణలోకి వచ్చిన తర్వాత అసలు ఉద్దేశం కాస్త ఆవిరైపోయింది.
అంతిమంగా నేను చెప్పేదేమిటంటే జీఎస్టీ విధానానికి సమగ్రమైన మరమ్మతులు అవసరం. దీని వల్ల రాష్ర్టాల సమస్యలు పరిగణనలోనికి తీసుకోబడతాయి. ఆదాయ వృద్ధికి భ రోసా లభిస్తుంది. అప్పుడే జీఎస్టీ మండలి స మాఖ్య స్ఫూర్తికి నిలువుటద్దంలా నిలుస్తుంది.
– టి.ఎమ్.థామస్ ఐసాక్
(‘ది ప్రింట్’ సౌజన్యంతో)