సీబీఐ ప్రశ్నించింది.. ఈడీ నోటీసులు జారీ చేసింది.. రేపో మాపో అరెస్ట్ కూడా చెయ్యొచ్చు అన్న వార్తలతో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మార్మోగింది. అయినా మొహంలో చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం.. ఇవి నన్నేమీ చేయలేవు అన్న గుండె ధైర్యం.. విచారణను ఎదుర్కొంటా అన్న గాంభీర్యం.. హస్తినలో శాసనమండలి సభ్యురాలు కవిత పర్యటనలో కనిపించిన దృశ్యాలు.
గడిచిన రెండు రోజులుగా కవిత గురించి చక్కర్లు కొడుతున్న ప్రచారాన్ని చూస్తుంటే ఎప్పుడు ఏమౌతుందోనన్న ఉత్కంఠ అందరిలో చోటు చేసుకున్నా.. ఎక్కడా అధైర్యం అనేది కనీసం చూచాయగా కూడా ఆమెలో కనిపించలేదు. రాజ్యాంగ సంస్థలను చేతిలో పెట్టుకొని విపక్షాలను అణచివేయటానికి ప్రయత్నిస్తున్న బీజేపీపై ఆమె పూరించిన పోరాటం చూస్తుంటే.. ధిక్కారానికి ప్రతీకలుగా మన చరిత్రలో నిలిచిన సమ్మక్క-సారలమ్మ, రాణి రుద్రమదేవి, చాకలి ఐలమ్మ, అరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యంల వారసత్వం ప్రస్ఫుటిస్తున్నది. పైగా, చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి అంటూ దేశ రాజధానిలో కవిత దీక్ష చేపట్టటం బీజేపీ పాలకులకు సవాల్ విసిరే సందర్భమే.
వీటన్నింటినీ చూస్తుంటే 2001లో సీమాంధ్ర పాలనకు వ్యతిరేకంగా స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ మొదలుపెట్టిన ఉద్యమం గుర్తుకు వస్తుంది. బక్క పలుచనోడు ఏం చేస్తాడంటూ అప్పట్లో తన గురించి ఆంధ్ర నాయకులు అనుకునేవారని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చేసిన వ్యాఖ్య లు ఇక్కడ ప్రస్తావనార్హం. వారు ఎన్ని విమర్శలు చేసినా కేసీఆర్ స్వరాష్ట్ర లక్ష్యాన్ని సాధించటమేగాక, దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టారు. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేసుకోవచ్చు అన్న ధీమా మాత్రమే కవిత మొహంలో కనిపించింది. అంతేగానీ, మోదీ పంపిన ఈడీ నోటీసుల తాలూకు భయాందోళన కనిపించలేదు. తండ్రి కేసీఆర్ నుంచి పుణికిపుచ్చుకున్న నాయకత్వ లక్షణాలు ఈ క్లిష్ట సందర్భంలో ఆమెలో స్పష్టంగా గమనించవచ్చు. ‘మొదలు ఈడీ అధికారులు వస్తారు.. ఆ తర్వాత మోదీ వస్తారు’ అంటూ బీజేపీ సర్కార్పై విల్లు ఎక్కుపెట్టారు. ఓవైపు ఈడీ ముందు విచారణకు హాజరయ్యే ఏర్పాట్లు చేసుకుంటూనే, మరోవైపు అదే బీజేపీని నారీ లోకం ముందు తన దీక్ష ద్వారా దోషిగా నిలబెట్టారు.
బీఆర్ఎస్ పార్టీతో సహా స్వయానా కవిత తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్, సోదరుడు మంత్రి కేటీఆర్ కూడా ఈడీ అంశానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. మాట వినని వారిని లొంగదీసుకునేందుకు బీజేపీ పాలకులు ఎంచుకున్న మార్గమే కేంద్ర సంస్థల దుర్వినియోగం అంటూ కేసీఆర్, కేటీఆర్ తమ సహజ ధోరణిలో చెప్పారే తప్ప, ఎక్కడా ఏదో జరిగిపోతున్నదంటూ భయపడిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసి బీఆర్ఎస్ను దేశవ్యాప్తంగా విస్తరించకుండా నిలువరించగలం అని అనుకుంటే అది ముమ్మాటికీ బీజేపీ మూర్ఖత్వమే అవుతుంది.
ఓ వెలుగు వెలిగి ఆరిపోయిన పెద్ద పెద్ద నియంతల కంటే మోదీ గొప్పోడు కాడన్న భావనతో, ఢిల్లీ నడిబొడ్డున ప్రశాంతంగా దీక్ష నిర్వహించిన తెలంగాణ ఆడపడుచు కల్వకుంట్ల కవిత ముమ్మాటికీ ధిక్కారానికి ప్రతీకే. ఆమె ధైర్యం, స్థిరచిత్తాన్ని చూసి తెలంగాణ మహిళా సమాజం గొప్పగా స్పందించింది. మోదీ పంపిన ఈడీ ఎదుట కవిత హాజరు కావడంపై ప్రసార మాధ్యమాలు దృష్టి పెడితే, మహిళలు మాత్రం ఆకాశంలో సగమైన తమకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. తండ్రి కేసీఆర్ లాగే ఆయన తనయ కవిత లక్ష్యాన్ని సాధించి తీరుతారని పలువురు పేర్కొన్నారు. అందుకే కవితను ధిక్కారానికి ప్రతీకగా అభివర్ణిస్తున్నాం.
కాంచనపల్లి రమేష్బాబు
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)