కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో తనకున్న సంఖ్యా బలంతో ప్రజా ప్రయోజనాల కంటే తనకు అనుకూలమైన కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చే బిల్లులనే చట్టాలుగా మారుస్తున్నది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపోతున్నా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తూ, కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న కేంద్రం వైఖరిని నిలదీయడానికి టీఆర్ఎస్ ఎంపీలు సిద్ధమయ్యారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత శాసన ని ర్మాణ వేదిక పార్లమెంట్. దేశ ప్రజల అవసరాల మేరకు పార్లమెంట్ శాసనాలను రూపొందిస్తుంది, సరి చేస్తుంది, రద్దు చేస్తుంది. ప్రభుత్వాలకు మార్గ దర్శనం చేస్తుంది, నియంత్రిస్తుం ది. ప్రజల ప్రాతినిధ్యానికి ప్రతిరూపంగా పాలన సాగే విధంగా చూస్తుంది. కానీ బీజేపీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్లమెంట్లో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నది. తనకున్న సంఖ్యా బలంతో కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చే బిల్లులనే చట్టాలుగా మారుస్తున్నది. దేశంలో సగానికి పైగా రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఈ దేశ పౌరుల బతుకులను బాగుచేసే ఏ ఒక్క నిర్ణయం, చట్టమూ చేయలేదు. పేదలు మరింత పేదరికంలోకి వెళ్తే… కార్పొరేట్ల సంపద రెండు, మూడు రెట్లు పెరిగింది. ఇదేనా రాజ్యాంగ స్ఫూర్తి?
ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. ఈ సమావేశాల్లో మొత్తం 19 బిల్లులు చర్చకు రానున్నాయి. వీటిలో 16 కొత్త బిల్లులు, 3 పాత బిల్లులు ఉన్నాయి. అటవీ సంరక్షణ సవరణ బిల్లు-2022, కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సవరణ) బిల్లు, నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు, ఓల్డ్ గ్రాంట్ రెగ్యులేషన్ బిల్లు, కంటోన్మెంట్ బిల్లు, నాలుగు రాజ్యాంగ సవరణ బిల్లులతో సహా వివిధ బిల్లులను ఆమోదించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఇందులో అడవులపై కార్పొరేట్ పెత్తనం పెంచే అవకాశం ఉన్న అటవీ సంరక్షణ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. ఈ మేరకు లోక్సభ బులెటిన్ కూడా విడుదల చేసింది. అటవీ సంరక్షణ చట్టం1980 ప్రకారం రూపొందించిన ప్రస్తుత అటవీ సంరక్షణ నియమాలను సవరించడానికి ‘అటవీ సంరక్షణ నియమాలు2022’ పేరుతో కేంద్ర పర్యావరణం, అట వీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2022 జూన్ 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సవరణల బిల్లును చట్టంగా మార్చనుంది. ఇది అమల్లోకి వస్తే రియల్ ఎస్టేట్ చేపట్టే భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు, ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనులకు నిబంధనల్ని సడలిస్తారు. అడవుల్లో నివసించే ఆదివాసీలు, గిరిజనులు, ఇతరుల అనుమతి అవసరం లేకుండా భూముల కేటాయింపు జ రుగుతుంది. వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం ఆ భూము ల్ని ఇకపై ఇష్టానుసారంగా వాడుకునే వెసులుబాటు ఉంటు ంది. ఆదివాసీలకు నష్ట పరిహారం చెల్లించే విధానాన్ని కేంద్ర ం రియల్ ఎస్టేట్ మాఫియాకు అనుకూలంగా మార్చింది.
దేశ భద్రతకు విదేశీ ముప్పు పొంచి ఉందన్న నిఘా సంస్థల హెచ్చరికలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చైనా చొరబాట్లను సీరియస్గా తీసుకోవడం లేదు. విదేశాంగ విధా నం కూడా ఆశించినంత స్థాయిలో లేదు. మరోవైపు ఆల్ ఇండి యా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)పై సైబర్ దాడి జరిగి లక్షలాది మంది డేటా చోరీ అయింది. వరుసగా తొమ్మిది నెలలుగా ఆరు శాతానికి పైనే ద్రవ్యోల్బణం నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి నినాదాలతో మోదీ సర్కారు నిరుద్యోగులను వంచించింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగకపోవడంతో అత్యధిక నిరుద్యోగిత నమోదవుతున్నది. నవంబర్లో నిరుద్యోగ రేటు 8 శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) పేర్కొన్నది. తెలంగాణలో మాత్రం నిరుద్యోగ రే టు తగ్గి నవంబర్లో 6 శాతంగా నమోదైంది. ఇది రాష్ట్రంలో కేసీఆర్ ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలను, ఉపాధి అవకాశాల పెంపును సూచిస్తున్నది.
ఈ నేపథ్యంలో రైతులకు కనీస మద్దతు ధర, సమాచార హక్కు చట్టం, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి కల్పన పథ కం, సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులు, ఆర్థికంగా వెనుకబడినవారికి 10 శాతం రిజర్వేషన్లు, గుజరాత్లో మోర్బీ వంతె న కూలిపోవడం, రూపాయి విలువ పతనం, జీడీపీ క్షీణత, కశ్మీర్ పండిట్లపై దాడులు మొదలైన విషయాలను పార్లమెంట్లో లేవనెత్తాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. తెలంగాణకు అడుగడుగునా అన్యాయ ం చేస్తూ, కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పార్లమెంట్ సమావేశాల్లో గళమెత్తాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులకు సూచించారు. కేంద్రం నిరంకుశ విధానాలను, కేంద్ర దర్యాప్తు సంస్థల వేధింపులను ఉభయ సభల్లో నిలదీయాలని, ఇతర పార్టీలతో కలిసి పోరాడాలని మార్గదర్శనం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలనుకొని అడ్డంగా దొరికిన బీజేపీ నేతల కుట్రలను పార్లమెంటులో ప్రస్తావించి దేశ ప్రజలకు తెలిసేలా చేయాలని ఆదేశించారు. వీటితోపాటు రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చడం, రాష్ర్టానికి రావాల్సిన బకాయిల విడుదలలో జాప్యంపైనా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో కేంద్రాన్ని ఎండగట్టనున్నారు. నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేయనున్నారు.
– బచ్చు శ్రీనివాస్
93483 11117