కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దశాబ్దకాలంగా ప్రజల ఆలోచనలను దారిమళ్లిస్తూ, వారి మెదళ్లపై థాట్ పోలీసింగ్ చేస్తూ యథేచ్ఛగా పాలన సాగిస్తున్నది. 2014, 2019, 2024 మూడు లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తీసుకువచ్చిన మ్యానిఫెస్టోలు పూర్తిగా ఒకదానికొకటి విరుద్ధమైనవి. గతంలో ప్రకటించిన రెండు సార్వత్రిక ఎన్నికల మ్యానిఫెస్టోల్లోని అంశాలు ఇక భారతదేశ దరిద్రాన్ని సమూలంగా మార్చేలా కనిపిస్తాయి. కానీ దేశాన్ని బీజేపీ పదేండ్లు పాలించినా ఎలాంటి వెలుగులు రాకపోగా.. దేశం ప్రజల పరిస్థితి మరింత దిగజారింది.
బీజేపీ నేతలు ఎన్నికల సందర్భంగా ఇచ్చే ప్రకటనలు, వ్యాఖ్యానాలు మీడియాకు పెద్ద పెద్ద శీర్షికలు పెట్టేందుకు సరిపోతాయి. కానీ, వాస్తవానికి వాటివల్ల ఈ దేశ ప్రజలకు ఒరిగింది శూన్యం. ఈ దేశానికి సర్వరోగ నివారిణి బీజేపీ ఒక్కటేనని మోదీ-షా ద్వయం భారత ప్రజల మెదళ్లలో ఎక్కించజూస్తున్నది.
2004 నుంచి 2014 వరకు సాగిన కాంగ్రెస్ పదేండ్ల పాలనతో ఈ దేశ ప్రజలు విసిగిపోయారు. ఇదే అదనుగా భావించిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ పక్కా ప్రణాళికతో తామే ఈ దేశానికి ప్రత్యామ్నాయం అనే ధోరణితో 2014 ఎన్నికల్లో ముందుకువచ్చాయి. అప్పటికే దేశంలో పేరుకుపోయిన అనేక సమస్యలకు పరిష్కారం చూపుతామని ఆశ చూపింది కాషాయ పార్టీ. అందులో భాగంగా 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రజలు ఊహించని హామీలను పొందుపరిచింది. ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షల జమ, స్విస్ బ్యాంకుల్లో నల్లధనం వెలికితీత, బడా ఆర్థిక నేరస్థుల అరెస్టు, యువతకు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల కల్పన, పంటలకు కనీస మద్దతు ధర, నిత్యావసర సరుకుల ధరల నియంత్రణ పేరుతో మొదటిసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2014 ‘సబ్ కా సాత్ సబ్ కా విశ్వాస్’ అంటూ అధికారం చేపట్టిన బీజేపీ ముఖ్యంగా మోదీ బృందం వల్ల దేశానికి ఎలాంటి లాభం జరుగలేదు. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన, పొందుపరిచిన ఒక్క అంశాన్ని కూడా ప్రధాని మోదీ నేరవేర్చలేకపోయారు.
తర్వాత 2019 సార్వత్రిక ఎన్నిలకు కొత్త ఎజెండాను ముందుకు తీసుకువచ్చింది. ప్రజలను మళ్లీ అబద్ధపు హామీలతో ఊరించింది. 75 ఏండ్ల భారతానికి 75 హామీల పేరుతో మరో మ్యానిఫెస్టోను వదిలింది. రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మార్చడం, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల కల్పన వంటి కీలక అంశాలను ఎన్నికల ప్రచారాస్ర్తాలుగా చేసుకొని మోదీ, అమిత్ షా ద్వయం రెండోసారి అధికారం చేపట్టింది. అయితే 2014లో మ్యానిఫెస్టోలో పెట్టిన ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల కల్పన, నల్లధనం వెలికితీత వంటి అంశాలు 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో మచ్చుకైనా లేవు. ‘సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ పేరుతో ప్రజల ఆలోచనలను దారిమళ్లించి రెండోవిడత అధికారం చేపట్టిన బీజేపీ ఆ తర్వాత తీసుకున్నవన్నీ ప్రజావ్యతిరేక నిర్ణయాలే. అందులో భాగంగా పెట్రోల్, గ్యాస్ ధరల రెట్టింపు, నిత్యావసర ధరల పెంపు, ప్రభుత్వరంగ సంస్థల నిర్వీర్యం, నూతన వ్యవసాయ చట్టాలు, పెరిగిన రైతుల ఆత్మహత్యలు, తీవ్ర ద్రవ్యోల్బణం వంటి అంశాలు దేశ ప్రజలను అల్లకల్లోలం చేసి, తీవ్ర వేదనలోకి నెట్టివేశాయి. మూడోసారి దేశ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నది బీజేపీ. అన్ని సమస్యలకు పరిష్కారం చూపామని పదే పదే చెప్పే బీజేపీ మళ్లీ కొత్త ఎన్నికల ఎజెండాతో రంగంలోకి దిగింది.
వరుసగా రెండుసార్లు మోసం చేసిన బీజేపీ.. తాజాగా ‘సంకల్ప పత్రం-మోదీ గ్యారెంటీ’ అనే కొత్త పేరుతో 2024 మ్యానిఫెస్టోను విడుదల చేసింది. వికసిత భారత్ థీమ్ అంటూ 14 అంశాలతో ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించింది. ప్రధానంగా వృద్ధులకు ఆయుష్మాన్ భారత్, యూనిఫాం సివిల్ కోడ్ అమలుచేయడం, జమిలి ఎన్నికల నిర్వహణ అంటూ మ్యానిఫెస్టోలో ప్రధానంగా పేర్కొన్నది. అయితే గతంలో రెండు దశల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది.
ప్రతి ఎన్నికకు కొత్త మ్యానిఫెస్టోను తీసుకురావడం బీజేపీకి తెలిసిన ఒక వంచన. నోట్ల రద్దు, జీఎస్టీలతో సామాన్యుల ఉసురు తీసుకున్న బీజేపీ సర్కార్.. జమిలి ఎన్నికలు, యూనిఫాం సివిల్ కోడ్ అమలు పేరుతో మరోసారి మాయ చేయాలని చూస్తున్నది. రెండు మ్యానిఫెస్టోలు అబద్ధాలని తేలినట్టే.. 2024 లోక్సభ ఎన్నికల మ్యానిఫెస్టో కూడా అబద్ధాల పుట్ట అని ప్రజలు గ్రహించాలి.
మరోసారి దేశ ప్రజలను మోసం చేసేందుకు ‘సంకల్ప పత్రం’ పేరుతో బీజేపీ మాయ చేయాలని చూస్తున్నది. గతంలో మాదిరిగా ప్రజలపై థాట్ పోలీసింగ్ చేయాలని బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకు వస్తున్నది. విశాల భారతాన్ని విద్వేషాల భారత్గా మార్చిన బీజేపీ చెర నుంచి బయటపడాలంటే ప్రజలంతా జాగరూకతతో వ్యవహరించాలి. ప్రజల కోసం పోరాడే పార్టీలనే ఎన్నుకోవాలి.