జనగామ తాలూకాలోని బెక్కల్లు గ్రామం వెలుపల పాత శివాలయం ద్గర ఉన్న ఒక స్తంభం మీద ఉన్న శాసనం చాళుక్య త్రిభువనమల్లదేవుని కాలం నాటిదిగా వరంగల్లు జిల్లా శాసనాల్లో ప్రచురింపబడింది. ఈ శాసనంలో కాలం పేర్కొనలేదు. కానీ 11వ శతాబ్దానికి చెందినదిగా నిర్ధారించారు. ఈ శాసనాన్ని వ్రెక్కంటి పురవరేశ్వరుడైన మలిరెడ్డి వేయించాడు. గ్రామంలో ఒక జైన దేవాలయాన్ని, త్రికూటాలయాన్ని ఇంకా 21 దేవతామూర్తులను ప్రతిష్ఠించి మల్లిరెడ్డి ఆయా ఆలయాలకు, దేవతామూర్తులకు దానాదులు సమర్పించిన విషయం ఈ శాసనంలో ఉంది.
చతుర్థ కులానికి చెందిన రేవిరెడ్డి కొడుకైన చండిరెడ్డి స్నేహితుడు పున్నిరెడ్డి. ఇతని కొడుకే మల్లిరెడ్డి. విష్టకులంలో జన్మించాడు. వీరిని గురించి శాసనంలో విపులంగా వర్ణించబడింది. మల్లిరెడ్డి తండ్రి ‘అభినవ ధర్మ నందనుండప్రతి తేజుండు నంగునూరి వల్లభుండు రేవిరడ్డి విలాస రతీశుండు పౌత్రుండైన వీత భయుండు పున్నిరెడ్డి, నిజదాన దయాగుణ ధర్మ నిర్మల ప్రభ దురితౌఁఘ సంతమ సభాస్వదురు ప్రభయయయ్యె నిమ్మహిని’ అని పేర్కొనబడ్డాడు.
ఈ శాసనాన్ని వేయించిన మల్లిరెడ్డి ‘నిజ వంశ లలాముండు గల్ప వ్రిక్షమను మ్రానదె నా సమానమని మానుగ నర్థి జనాలి నర్థితోం దానఖిలార్థ సంపదలం దనుపుచు నప్రమిత ప్రతాపియై శ్రీ నిలయుండమేయ గుణిసీమయ ధారుణి నొప్పెంన్’ అని వర్ణించబడినాడు. ఇంకా కులతిలకుడైన మల్లిరెడ్డి కులజనులకు వేడ్కను కలిగించేవిధంగా వ్రెక్కంటనరంబులో అతి ధార్మికుడై జినాగరమెత్తిం చినాడట.
ఇంకా ‘కమలజ మిత్ర తేజుండు ప్రకాశిత కీర్తి సమన్వితుండు, విక్రమ నఖరాయుధుండు.. సద్విమల గుణాభిరాముడు పవిత్ర చరిత్రుండు ఉత్తమ మతి మల్లిరెడ్డి గుణధాముండు’ ఇంకా సన్మార్గమున నడచి సమృద్ధి బాంధవులను చూసుకునేవాడు, విప్రులను బ్రోచి రక్షించేవాడు, ప్రజలను అతి స్నేహ ముగా పెంచెడివాడు, దేవుని సేవలను అతి ప్రీతితో చేసేవాడుగా కీర్తించబడినాడు.
మల్లిరెడ్డి ఈ శాసనంలో చాలా విపులంగా వర్ణించబడినాడు. ‘చతుర వనితా జన హృదయాకర్షణోపాయ ప్రణయ వినయ మధుర క్రియా యంత్ర తంత్ర పరిణతాధక్రిత మనోభవుడు, సుభ మనోభవుడు, శిష్ట కుల వార్ధి వర్ధన సుధాకరుండు, అతి దేవ గురు, ద్విజ భక్తి వ్రత రత్నాకరుడు అయిన శ్రీమద్వ్రెక్కంటి పురవరేశ్వరుడు మలిరెడ్డి’ అని, అతడు తన కులదీపకుడై తన కులములో ఇరవైఒక్క తరములవారికి చెందువిధంగా ఇరవై ఒక్క గుడులను ఎత్తించి, త్రికూటమును, తక్కిన గుడులను తనకు ఇహ పరార్థ ప్రదంగా ఎత్తించినాడు.
ఇంకా ఆచంద్రార్క తారకంగా దేవభోగానికి సమర్పించి శాసనారూఢ స్తంభాన్ని నిల్పి దాన్ని అభినవ మల్లికారున పుణ్యస్థానంగా చేసినాడు. దీనివల్ల అతడు పుణ్యశ్లోకుడై పరమ ధర్మ ప్రతిపాలనం చేసినట్లు పేర్కొనబడింది.
వారి వంశంలో అనాదిగా వస్తున్న జిన జైన ధర్మాన్ని ప్రవర్తిల్ల చేస్తూ విమల జ్ఞానంతో వివేక విద్యాధరుడైనాడు. ఇంకా శైవ వైష్ణవ నిజారూహ బౌద్ధములైన ఇతర మతాలను ఆదరించి దైవములెల్ల ఒకటే అని భావించి కల్మషహరుడైన మల్లిరెడ్డి అమితగుణాఢ్యుడై అతులిత ఆయతనంబులు ప్రీతితో నిల్పినట్లు చెప్పబడింది.
ఇంకా ఈ శాసనం, మల్లిరెడ్డి విపుల ధర్మము సకల భువనాలందు కుల గిరులు, చంద్ర తారకలు, ధరణి ఉన్నంత వరకు ఉంటుందని ప్రశంసించబడింది.
డాక్టర్ భిన్నూరి మనోహరి
9347971177
ఇవి కూడా చదవండి :
కొన్నది వంకాయ.. కొసిరేది గుమ్మడికాయ