హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అనేక ప్రజాసమస్యలను పక్కనబెట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం విడ్డూరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఒకవైపు సభలో పద్దులపై చర్చ జరుగుతున్నదని, ఆ చర్చను పక్కనబెట్టి ఆటలాడించాలని ప్రభుత్వం భావించడం భావ్యం కాదని, సమావేశాల నిర్వహణపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. దీనిపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు వద్ద సరైన సమాధానం లేదని దయ్యబట్టారు. అనేక అంశాలపై సభలో చర్చించాల్సి ఉన్నదని, ఇరిగేషన్ వంటి పద్దులపై లోతుగా చర్చ జరుగాల్సి ఉన్నదని తెలిపారు. కానీ, సభలో ఆయా పద్దులపై నిర్మాణాత్మకమైన చర్చ జరుగకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
తూతూమంత్రంగా సభను నడుపుతున్నదని అభ్యంతరం వ్యక్తంచేశారు. మంత్రులే చర్చల్లో ఉండటం లేదని విమర్శించారు. ఈనెల 28, 29 తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటలపోటీలు పెడుతామని ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. అయితే సభలో తమ సమస్యలపై గొంతెత్తుతారని భావించిన ఎమ్మెల్యేలు మైదానాల్లో ఆటలాడుకుంటున్నారంటే ప్రజలు హర్షించబోరని పేర్కొన్నారు. కాలయాపన కోసమే ప్రభుత్వం ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్టు కనిపిస్తున్నదని తెలిపారు. సభలో అర్థవంతమైన చర్చను బీఆర్ఎస్ కోరుకుంటుందని, ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చేతకాక సభ నుంచి తప్పించుకోవడానికి సర్కార్ ఆటలపోటీలు పెడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు.