ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. కానీ ప్రధాని మోదీ మాత్రం సమాఖ్య, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారు. రాష్ర్టాలను, ఆయా శాఖల నిపుణులను పార్లమెంటరీ చర్చలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్య ఫలితాలే మోదీ ప్రభుత్వ వైఫల్యాలు.
ప్రధాని మోదీ ఆర్థికవేత్తల సలహాలు పట్టించుకోకుండా పెద్దనోట్లను రద్దుచేశారు. తద్వారా మోదీ చెప్పిన ఏ లక్ష్య మూ నెరవేరకపోగా, సన్న, చిన్న వ్యాపారులు, రైతులు, కూలీల వంటి సామాన్యులతో పాటు దేశ ఆర్థికవ్యవస్థ కుంగిపోయింది. ఎంత వ్యతిరేకత వచ్చినా వినకుండా వ్యవసాయ చట్టాలను ప్రవేశ పెట్టారు. ఇవి రైతుల శ్రేయస్సుకు, దేశ ఆహార భద్రతకు ప్రమాదమంటూ వ్యవసాయ నిపుణులు, ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోలేదు. వాటిని నిరసిస్తూ ఉద్యమించిన వందలాది మంది అన్నదాతలు అమరులయ్యాక గాని మోదీ వెనుకడుగు వేయలేదు! ఆర్థిక అసమానతలకు, సంపద కేంద్రీకరణకు, కార్పొరేట్ల గుత్తాధిపత్యానికి దారితీస్తుందని సామాజిక శ్రేయోభిలాషులు నెత్తీనోరు మొత్తుకుంటున్నా మోదీ ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలకు గేట్లు తెరిచారు! ప్రభుత్వ సంస్థల నిర్వహణ బాధ్యతకు, వ్యాపారమనే పేరు పెట్టి కార్పొరేట్లకు వదిలేస్తున్న మోదీ ప్రభుత్వ తీరు దేశ వ్యతిరేకమైనది.
ప్రపంచ బ్యాంకు నివేదిక- 2013 ప్రకారం.. 2007-08 నాటి ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించటంలో భారతదేశం, చైనా ప్రభుత్వ బ్యాంకులు గణనీయంగా కృషిచేశాయి. స్థూల రుణాన్ని స్థిరీకరించటం, కీలక రంగాలకు సరిపడా నిధులను అందించటం ద్వారా సంక్షోభ తీవ్రతను గణనీయం గా తగ్గించగలిగాయి. ఆర్బీఐ నివేదిక ప్రకారం- 2007-08 సంక్షోభంలోనూ లాభాల ను ఆర్జించిన ప్రభుత్వ బ్యాంకులు ప్రభుత్వ ప్రాధాన్యాలకనుగుణంగా వ్యవసాయంతో పాటు, చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు గణనీయంగా నిధులు అందించాయి. నాడు ప్రభుత్వ బ్యాంకులన్నీ వంద శాతం వాటి లక్ష్యాలను నెరవేర్చటం వాటి ప్రాధాన్యాన్ని చాటిచెప్తున్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి భారత ఆర్థికవ్యవస్థను కాపాడిన ప్రభుత్వ బ్యాంకులను ప్రపంచమే ఆదర్శంగా తీసుకోవటం గర్వకారణం.
దేశ ఆర్థికవ్యవస్థకు పెను ప్రమాదమని, ప్రపంచబ్యాంకు కూడా హెచ్చరిస్తున్నా మోదీ బ్యాంకుల ప్రైవేటీకరణకు పూనుకున్నారు. ఆర్థిక సంక్షోభాల బారిన మన దేశం పడకుండా ఎన్నోసార్లు కాపాడి మన ఆర్థికవ్యవస్థకు రక్షగా నిలిచినవి ప్రభుత్వ బ్యాంకులే. కష్టకాలంలో దేశానికి, ప్రజలకు కొండంత భరోసాను కల్పించిన మన ప్రభుత్వ బ్యాంకుల ఘనతను ప్రధాని మోదీ ఒక్కసారి మననం చేసుకోవాలి.
అన్నదాతలకు అండ ప్రభుత్వ బ్యాంకులు. 1947 నుంచి 1969 వరకు అప్పటి ప్రైవేటు బ్యాంకులు అన్నదాతలకందించిన రుణాలు 0.2 శాతమే. బ్యాంకులు జాతీయమయ్యాక 1969 నుంచి 2020 వరకు వ్యవసాయానికి అందించిన రుణం దాదాపు 20 శాతం. ఇది కొన్ని లక్షల కోట్ల మేర ఉంటుంది. ప్రైవేటు బ్యాంకులు లాభాలొచ్చే పట్టణాల్లోనే సేవలందిస్తుంటే, బస్సు కూడా తిరగని మారుమూల పల్లెల్లోనూ ప్రభుత్వ బ్యాంకులు తమ శాఖలను తెరిచాయి. అన్నదాతలు, చిన్న వ్యాపారులు, మహిళలకు సైతం రుణాలందిస్తూ గ్రామీణుల ప్రగతికి పునాది వేశాయి. మోదీ గర్వంగా చెప్పుకొంటున్న ‘జన్ ధన్’ ఖాతాలలో 97 శాతం ప్రభుత్వ బ్యాంకుల్లోనే ఉన్నాయి. ప్రపంచ టాప్టెన్ కుబేరుల్లో ఐదుగురు భారతీయులే. కానీ వాళ్ళలో ఏ ఒక్కరి డిపాజిట్లూ ప్రభుత్వ బ్యాంకుల్లో లేవన్నది నిజం! ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న లక్షల కోట్ల డిపాజిట్లన్నీ సామాన్య ప్రజలవే. అట్టి సామాన్యుల డిపాజిట్లకు భద్రత కల్పించే ‘ఎఫ్ఆర్డీ- 9’ చట్టాన్ని సడలించి ఆ సొమ్మును కూడా కార్పొరేట్ల రుణమాఫీకి తరలించేందుకు యత్నించటం సమర్థనీయం కాదు.
ప్రభుత్వ బ్యాంకుల్లోని మొండి బకాయిలన్నీ ప్రభుత్వ పెద్దల సిఫారసుతో రుణాలు పొందిన బడాబాబులవే. ఇందులో కార్పొరేట్ సంస్థలదే పెద్ద వాటా. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, అనిల్ అంబానీ, సహారా వంటి ఘరానా మోసగాళ్లంతా మోదీ ఇష్టులే. ఇలాంటి రుణ ఎగవేతదారులకే మోదీ హయాంలో లక్షల కోట్ల రుణమాఫీ జరిగింది. చిన్న బ్యాంకులను విలీనం చేయ టం వల్ల వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ విలీనాల మూలంగా పెద్ద బ్యాంకులు ఏర్పడటం మంచిది కాదని నిపుణులంటున్నారు. ‘ఎంత పెద్ద బ్యాంకు కుప్పగూలితే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అంత భారీగా నష్టపోతుంది. అమెరికా, యూరప్లలో పెద్ద బ్యాంకులు కుప్పకూలినందు వల్లనే 2007-08లో ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు అంతగా కుదేలయ్యాయి’ అని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్రాజన్ అభిప్రాయపడ్డారు.
‘పారిశ్రామికవేత్తలకూ బ్యాంకులు పెట్టుకునేందుకు లైసెన్సులిస్తామని మోదీ ప్రకటిస్తున్నారు! అదానీ, అంబానీల చేత బ్యాంకులు పెట్టించి, ప్రభుత్వ బ్యాంకులన్నింటినీ వాళ్ళకు కట్టబెట్టేందు కే ఇలా చేస్తున్నారా? అమెరికాలో 1930 నుంచి విజయవంతంగా పనిచేస్తున్న ప్రభుత్వ బ్యాంకును 1968లో ప్రైవేటీకరించారు. ఈ బ్యాంకు, దీంతోపాటు మరో ప్రైవేటు బ్యాంకు- అమెరికాలోకెల్లా అతి పెద్ద బ్యాంకులైన ఈ రెండూ కుప్పగూలటం వల్లనే 2007-08లో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఆ రెండు బ్యాంకుల నిర్వా కం వల్ల ట్రిలియన్ డాలర్లను అమెరికా ప్రజలు కోల్పోయారు. రెండుసార్లు బెయిలౌట్ ప్రకటించినా గాడినపడని ఈ రెండు బ్యాం కులను గత్యంతరం లేక తిరిగి జాతీయం చేయవలసి వచ్చింది. అమెరికా అనుభవంతోనైనా- ‘బ్యాంకుల ప్రైవేటీకరణ’ను మోదీ ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వ బ్యాంకులను లోయలోకి నెట్టేయవద్దు.
పాతూరి వేంకటేశ్వరరావు
98490 81889